నూతన ప్రజా రాజధాని
అమరావతి మహానగరం నిర్మాణంలో భాగంగా అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు
ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఏ ఆధునిక నగరమైనా అభివృద్ధి చెందాలంటే ముందుగా సమకూర్చవలసింది మౌలిక
వసతులేనన్నది ప్రభుత్వం గుర్తించింది. పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ,
ఉన్నత జీవనం,
ఉత్తమ పరిపాలన,
విద్య,
వైద్యం,
వినోదం,
పెట్టుబడులకు అనుకూల వాతావరణ, పర్యావరణ
పరిరక్షణ అమరావతి అభివృద్ధికి ప్రధానమైనవిగా ప్రభుత్వం భావిస్తోంది. వీటన్నిటినీ
దృష్టిలో పెట్టుకొని ఏపీసీఆర్డీఏ(ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి
ప్రాధికార సంస్థ), ఏడీసీ(అమరావతి అభివృద్ధి సంస్థ)లు ప్రణాళికలకు రూపకల్పన చేశాయి. ఇటు
ప్రభుత్వ పరగంగా, అటు ప్రైవేటు పరంగా నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. 217 కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మించాలని
ప్రభుత్వం నిర్ణయించింది.
95 శాతం పైగా
భూమిని సీఆర్టీఏ స్వాధీనం చేసుకుంది. రాజధాని పరిధిలో ప్రస్తుత గ్రామాల్లోని నివాస ప్రాంతాలతో కలుపుకొని
మొత్తం 53,478 ఎకరాల భూమి ఉంది. ఇందులో 34,564 ఎకరాలను లాండ్ పూలింగ్ పథకం(ఎల్పీఎస్) కింద
సమీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటి వరకు 33,008
ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు.ఇంకా 2523 మంది రైతులు 1555 ఎకరాలు
ఇవ్వవలసి ఉంది. లండన్ కు చెందిన ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థ
రూపొందించిన న్యాయ – శాసన - కార్యనిర్వహక వ్యవస్థల భవనాలు, ఇతర పౌర
నివాస సముదాయాల తుది ఆకృతులను సెప్టెంబర్ 13న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించే అవకాశం ఉంది. అమరావతిలో ముందుగా
పరిపాలన, న్యాయ నగరాల నిర్మాణానికి విజయదశమి రోజున శంకుస్థాపన చేస్తారు. గూగుల్, ఇన్ఫోసిస్
తరహా ఐటీ కార్పొరేట్ కార్యాలయాలకు దీటుగా ఏపీ సచివాలయం,
శాఖాధిపతుల కార్యాలయాలను వినోద, ఆహ్లాద, క్రీడా
వసతులతో ప్రపంచంలోనే అత్యుత్తమ కార్యాలయ భవంతులుగా తీర్చిదిద్దాలన్నది సీఎం ఆలోచన. వీటి
మొత్తానికి రూ. 11,602 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ప్రభుత్వ
భవనాలను 1350 ఎకరాల్లో ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో నిర్మిస్తారు. సెంట్రల్
విస్టా కృష్ణానది నుంచి శాఖమూరు పార్క్ వరకూ విస్తరించి ఉంటుంది. కోహినూర్ వజ్రాకృతిలో అసెంబ్లీ భవనం ఉంటుంది. 250 మంది ఎమ్మెల్యేలు,
100 మంది ఎమ్మెల్సీలకు సరిపడా ఈ భవనం
ఉంటుంది. హైకోర్టు భవనం బౌద్ధస్థూపంలా ఉంటుంది. 37 కోర్టు హాళ్లతోపాటు
మరో 27 హాళ్లు నిర్మించేందుకు అనువుగా ఉంటుంది. మొత్తం రాజధానికి
అవసరమైన ప్రధాన రోడ్లు, తాగునీరు,
మురుగునీటి వ్యవస్థ, విద్యుత్
సరఫరా, వర్షపునీటి పారుదల వ్యవస్థలు,
నడకదారులు,
సైకిల్ట్రాక్లు, అవెన్యూ
ప్లాంటేషన్ కేబుల్ వ్యవస్థ వంటి ప్రధానమైన మౌలిక అవసరాలను కల్పించడానికి కావలసిన
చర్యలను ప్రభుత్వం మొదలు పెట్టింది.
రాజధాని నిర్మాణ తొలి దశలో మొత్తం 21 ప్రధాన రహదారులను నిర్మించాలని ప్రభుత్వం
నిర్ణయించింది. ఇప్పటి వరకు రాజధానిలో ప్రధాన అనుసంధాన రహదారి (సీడ్ యాక్సెస్ రోడ్డు)
సహా మొత్తం
19 ప్రధాన రహదారులకు ఏడీసీ టెండర్లు
పిలిచింది. రహదారులతో పాటు మౌలిక వసతుల కల్పనకు కూడా టెండర్లు పిలిచారు. విద్యుత్, కమ్యూనికేషన్
కేబుళ్లు, ఇతర పైప్లైన్లు వెళ్లేందుకు అవసరమైన మార్గాలను(డక్ట్) కూడా వీటిలో భాగంగానే నిర్మిస్తారు. ఈ పనుల
మొత్తం అంచనా విలువ దాదాపు రూ.5566 కోట్లు. వీటిలో ప్రధాన అనుసంధాన రహదారితో పాటు మరో ఏడు
రహదారుల నిర్మాణ పనులు చురుకుగా జరుగుతున్నాయి.
మొత్తంలో పది రహదారుల నిర్మాణానికి
ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం అందజేస్తోంది. తమ నిధులతో చేపట్టిన రహదారుల నిర్మాణ పనులు
పరిశీలించడానికి ప్రపంచ బ్యాంకు బృందం సెప్టెంబర్ 13న అమరావతిలో పర్యటించనుంది. రూ.242 కోట్ల అంచనా వ్యయంతో 18.27 కిలోమీటర్ల
ప్రధాన అనుసంధాన రహదారి (ఈ3)నిర్మిస్తున్నారు. దీనికి ఇంకా కొంత భూమి సేకరించవలసి ఉంది. రూ.245 కోట్ల అంచనా వ్యయంతో 15 కిలోమీటర్ల రహదారి (ఈ8), రూ.196 కోట్లతో 13
కి.మీ. రదహదారి(ఎన్9), రూ.240 కోట్లతో 6.5 కి.మీ. రహదారి(ఎన్4), 7.5 కి.మీ. రహదారి(ఎన్14), రూ.305 కోట్లతో 8.5కి.మీ. రహదారి(ఈ10), 7.5 కి.మీ. రహదారి(ఈ14), 8.5కి.మీ రహదారి(ఎన్16) నిర్మిస్తున్నారు.
అలాగే రూ.251.33
కోట్లతో 9.84 కి.మీ రహదారి(ఈ6), రూ.207.18
కోట్లతో 6.79కి.మీ. రహదారి(ఈ12), రూ.255.26 కోట్లతో 8.65 కి.మీ. రహదారి (ఎన్11) నిర్మిస్తున్నారు. రూ.3624 కోట్లతో ఈ10,
ఈ14,
ఎన్16, ఎన్4, ఎన్9, ఎన్14,ఈ6, ఈ8, ఈ12, ఎన్11,
ఈ2,
ఈ4,
ఎన్7, ఈ7, ఈ9, ఈ11, ఎన్3ఏ, ఎన్3బీ రహదారుల
వెంట ప్రధాన మౌలిక సదుపాయాల కల్పిస్తారు. అనంతవరం- మందడం, నెక్కల్లు-
కృష్ణాయపాలెం,
నీరుకొండ-
యర్రబాలెం,ఉండవల్లి-
పెనుమాక,
ఉండవల్లి-
నవులూరు గ్రామాలను కలుపుతూ ఈ-7, ఈ-9, ఈ-11, ఎన్-3ఏ, ఎన్-3బీ 5 రహదారుల నిర్మాణానికి సంబంధించి ఏడీసీ కొత్తగా
టెండర్లు పిలిచింది. అమరావతిని జోన్ల వారీగా అభివృద్ధి చేయాలని
సీఆర్డీఏ నిర్ణయించింది. ప్రతిపాదిత మొత్తం 13
జోన్లలో 4, 5, 9 మూడు జోన్లను
రూ. 6,900 కోట్ల అంచనా వ్యయంతో ‘హైబ్రిడ్ యాన్యుటీ మోడల్’ (హెచ్ఏఎం)లో అభివృద్ధి
చేస్తారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా అత్యంత సౌకర్యంగా ప్రజా రవాణా వ్యవస్థకు
రూపకల్పన చేశారు. భూగర్భంలో ఈహెచ్ టీ(ఎలక్ట్రానిక్ హై టెక్షన్)
కేబుల్ లైన్స్ అమర్చడానికి
ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పట్టణాభివృద్ధి శాఖ పర్యవేక్షణలో రాజధాని
ప్రాంతంలోని 29 గ్రామాలను నరేగా నిధులతో అభివృద్ధి చేయనున్నారు.
శాఖమూరు వద్ద 280
ఎకరాలలో పార్కు నిర్మిస్తారు. సీడ్
యాక్సెస్ రోడ్డుకు ఇరువైపులా, శాఖమూరు పార్కులో ఈ నెలలో అందమైన పూల మొక్కలు నాటే కార్యక్రమం
పెద్దఎత్తున చేపట్టనున్నారు. ఇప్పటికే ఇక్కడ విట్ విశ్వవిద్యాలయం భవన
నిర్మాణాలు మొదలుపెట్టి,
తరగతులు కూడా
నిర్వహిస్తోంది. ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం నిర్మాణాలు మొదలుపెట్టింది. త్వరలో 10 వరకు హోటళ్ల
నిర్మాణం మొదలుపెట్టే అవకాశం ఉంది. దుబాయ్లో బుర్జ్ ఖలీఫా, మలేసియా,
సింగపూర్ వంటి దేశాలలో
నిర్మించిన తరహాలో ప్రపంచంలో 10 అగ్రశ్రేణి
కట్టడాలపై సమగ్రంగా అధ్యయనం జరిపి వాటికి దీటుగా రెండు అమరావతి ఐకానిక్ టవర్స్
నిర్మాణం చేపట్టాలని సీఆర్డీఏ నిర్ణయించింది.
ఈ జంట టవర్లు పర్యాటకాన్ని, వాణిజ్య
రంగాన్ని బాగా ఆకర్షించేవిధంగా అమరావతి ఖ్యాతిని ద్విగుణీకృతం చేసేలా ఉండాలన్నది
ప్రధాన ఉద్దేశం. వీటి నిర్మాణానికి ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజీ ముందుకు
వచ్చింది. కృష్ణా నదీముఖంగా అక్షరధామ్ నిర్మాణానికి 30
ఎకరాలు కేటాయించే ప్రతిపాదన
సీఆర్డీఏ పరిశీలనలో ఉంది. ఆధునిక రాజధానికి 742
ఎంఎల్ డీ(మిలియన్ ఆఫ్ లీటర్స్ పర్ డే) నీరు అవసరమవుతుందని
అంచనా వేశారు. ఇంత నీటి సరఫరాకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యాధునికమైన
రీతిలో మురుగునీటి పారుదల వ్యవస్థను రూపొందించారు.
592 ఎంఎల్ డీల మురుగు నీరు ప్రవహించే అవకాశం ఉందని లెక్క తేల్చారు. ఇందు కోసం 316 (నాళాలు, అనుబంధ నాళాలు)
కిలోమీటర్లు +277
(సంగ్రాహకాలు)
కిలో మీటర్ల మేర మురుగు కాలువల
నిర్మాణం చేస్తారు. అలాగే 3355 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తరలించే ఏర్పాట్లు
చేస్తారు. 2710 మెగా వాట్ల విద్యుత్ సరఫరాకు కావలసిన చర్యలు చేపట్టారు. ఇన్
ఫ్రాస్టక్చర్, పీఎంసీ(ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ కన్సల్టెంట్), బ్రూ అండ్
గ్రీన్ (జలకళ-పచ్చదనం) ... అందరు కన్సల్టెంట్లతో సీఆర్డీఏ ఎప్పటికప్పుడు
సంప్రదింపులు జరుపుతోంది.
-శిరందాసు
నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్.
No comments:
Post a Comment