May 15, 2026

యువ న్యాయవాదులను భయపెట్టవద్దు


ఏపీ హైకోర్టు ఘటనపైనే ఇప్పుడు దేశమంతటా చర్చ

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మే 5న జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ), సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ)లతోపాటు దేశంలోని పలు బార్ అసోసియేషన్లు స్పందించాయి. యువ న్యాయవాదులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ సంఘటనతో అనేక కొత్త ప్రశ్నలు కూడా తలెత్తాయి. లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్ఓసీ), పాస్‌పోర్టు స్వాధీనం అంశాలను సవాల్ చేస్తూ దాఖలైన ఓ పిటిషన్ ఆ రోజు హైకోర్టు ముందుకు వచ్చింది. ఈ కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున వాదించిన ఓ యువ న్యాయవాదిపై హైకోర్టు న్యాయమూర్తి తర్లాడ రాజశేఖర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ సందర్భంగా గతంలో ఇలాంటి కేసులో ఇచ్చిన కోర్టు తీర్పు కాపీ అవసరమని న్యాయమూర్తి భావించారు. దీంతో, కేసును వాయిదా వేయాలని జస్టిస్ రాజశేఖర్ రావు సూచించారు. అయితే, పిటిషనర్ తరఫు యువ న్యాయవాది వెంటనే విచారణ కొనసాగించాలని కోరారు. తన వాదన వినిపించడానికి, పదేపదే మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించారు. దీంతో, జడ్జి అసహనం వ్యక్తం చేశారు. ఆగ్రహంతో,

"నేను మీ రిట్ పిటిషన్‌ను కొట్టివేశానా? ఆర్డర్ కాపీని తీసుకురమ్మని మాత్రమే కోరాను. మీరేదో గొప్ప సీనియర్ న్యాయవాది అనుకుంటున్నారా? కనీసం 10 ఏళ్ల అనుభవం కూడా లేకుండా ఈ కట్టను విసిరేస్తారా?’’ అని అన్నారు. న్యాయవాది నిర్లక్ష్యంగా ప్రవర్తించారని భావించిన జడ్జి, 24 గంటల పాటు అతనిని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచమని పోలీసులను పిలిచారు. దీంతో కోర్టు హాల్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లాయర్లు అందరూ షాక్‌కు గురయ్యారు. పోలీసులు వచ్చిన తర్వాత ‘‘తీసుకెళ్లండి. లోపల వేయండి’’ అని జడ్జి అన్నారు. ఆ తర్వాత బార్ అసోసియేషన్‌తో కలిసి ధర్నా చేయండి అని కూడా జడ్జి వ్యాఖ్యానించారు. మరో పక్క యువ న్యాయవాది చేతులు జోడించి క్షమించమని, దయ చూపమని వేడుకున్నారు. అయినా, న్యాయమూర్తి ఆయనను మందలించారు. ఇక్కడ ఉన్న ఇతర న్యాయవాదులు కూడా ఇది చూశారని, కోర్టులో ఉన్న లాయర్ల పేర్లు నమోదు చేసి సాక్షులుగా రికార్డు చేయాలని జడ్జి సూచించారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వెంటనే, సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో, జడ్జి ఆగ్రహించడం, న్యాయవాది వేడుకోవడం స్పష్టంగా కనిపించాయి. దాంతో, దేశం అంతటా న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంమైంది. బీసీఐ, ఎస్‌సీబీఏ, దేశంలోని ఇతర బార్ అసోసియేషన్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఆందోళన వ్యక్తం చేశాయి. జడ్జి తీరుని ఖండించాయి. అయితే, వెంటనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ , హైకోర్టు బార్ అసోసియేషన్ రంగంలోకి దిగారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయవాదితో, న్యాయమూర్తితో విడివిడిగా మాట్లాడారు. 24 గంటల జ్యుడీషియల్ కస్టడీ ఆదేశాలు అమలు కాకుండా ఆపారు. సమస్య సామరస్యంగా సద్దుమణిగింది. అయినప్పటికీ, ఈ ఘటన న్యాయవ్యవస్థలో, న్యాయవాదుల్లో, ముఖ్యంగా యువ న్యాయవాదుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. యువ న్యాయవాదుల పట్ల న్యాయమూర్తులు సహనంతో వ్యవహరించాలని, వారిని ప్రోత్సాహించాలని బీసీఐ, ఎస్‌సీబీఏ, ఇతర బార్ అసోసియేషన్లు వ్యక్తం చేసిన అభిప్రాయాన్నే సుప్రీం కోర్టు కూడా వ్యక్తం చేసింది. యువ న్యాయవాదులలో భయం, అవమానం లేదా బెదిరింపులకు కారణమయ్యే ఏ చర్య అయినా బార్ స్వాతంత్ర్యాన్ని, న్యాయ వ్యవస్థ సమర్థవంతమైన పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని బీసీఐ, ఎస్‌సీబీఏ హెచ్చరించింది. ఇలాంటి సంఘటనలు యువ న్యాయవాదులపై ప్రతికూల ప్రభావాన్ని చూపడంతోపాటు న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య సంస్థాగత సమతుల్యతను దెబ్బతీస్తాయని బీసీఐ పేర్కొంది. న్యాయవాది బహిరంగ క్షమాపణ చెప్పినప్పటికీ, న్యాయమూర్తి ప్రవర్తించిన తీరుని బార్ అసోసియేషన్లు తప్పుపట్టాయి. ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ తీరుపై పలువురు యువ న్యాయవాదులు తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. జూనియర్ లాయర్లను కోర్టులో బెదిరించడం, అవమానించడం అంగీకరించలేని అంశం అన్నది వారి వాదన. న్యాయమూర్తులు సీనియర్లు, జూనియర్ల మధ్య వివక్ష చూపడం భావ్యంకాదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు. కోర్టు కార్యకలాపాల్లో మర్యాద, క్రమశిక్షణ అత్యంత కీలకమని ఈ సంఘటన స్పష్టం చేస్తోందని మరికొందరన్నారు. ఈ ఘటనతో మరో కొత్త డిమాండ్ కూడా వినవస్తోంది. కొలీజియం వ్యవస్థ దేశంలో న్యాయవ్యవస్థను నాశనం చేస్తోందని, పరీక్షల ద్వారా వచ్చే ప్రొఫెషనల్ జడ్జీలు కావాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ హైకోర్టులో జరిగిన ఘటనపై సీజేఐ జోక్యాన్ని కోరుతూ బీసీఐ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా లేఖ రాశారు. సదరు న్యాయవాది తన శారీరక ఇబ్బందులను వివరిస్తూ, పదేపదే క్షమించమని వేడుకున్నా న్యాయమూర్తి కనికరించలేదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. యువ న్యాయవాదులను ప్రోత్సహించడానికి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక అంతర్గత యంత్రాంగం ఉండాలని ఎస్‌సీబీఏ అధ్యక్షుడు వికాస్ సింగ్ నొక్కి చెప్పారు. కోర్టుల అధికారాన్ని గౌరవించాల్సిందేనని, అయితే, న్యాయాధికారాలను వినియోగించేటప్పుడు సంయమనం, నిష్పాక్షికత, కరుణ కూడా ఉండాలని ఎస్‌సీబీఏ సూచించింది. న్యాయవాదులను భయపెట్టే బదులు, యువ న్యాయవాదులు ధైర్యంగా, నిర్భయంగా, స్వతంత్రంగా వాదించేలా ప్రోత్సహించేంత బలంగా న్యాయవ్యవస్థ ఉండాలని అడ్వకేట్ అసోసియేషన్ ఆఫ్ బెంగళూరు(ఏఏబీ) పేర్కొంది.
కోర్టు కార్యకలాపాల్లో చిన్నపాటి లోపం దొర్లిందనే కారణంతో ఒక యువ న్యాయవాదిని 24 గంటల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలన్న జడ్జి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై బీసీఐ, ఎస్‌సీబీఏ చేసిన తీర్మానాల ఆధారంగా నమోదైన రెండు రిట్ పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం ఈ నెల 15న విచారణ చేపట్టనుంది. యువ న్యాయవాదుల విషయంలో న్యాయమూర్తులు సహనం పాటించాలి, ప్రోత్సాహించేవిధంగా వ్యవహరించాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సమస్యను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, బార్ అసోసియేషన్ ప్రమేయంతో హైకోర్టు స్థాయిలోనే సామరస్య పూర్వకంగా పరిష్కరించినందున, తమ వైపు నుండి ఎటువంటి ఆదేశాలు అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది . యువ న్యాయవాది కోపంతో ఫైళ్లను పోడియంపై కొట్టారని భావించి, అతడిని పోలీసు కస్టడీకి పంపిస్తానని జస్టిస్ రాజశేఖర్‌రావు హెచ్చరించారు. అయితే, ఆ న్యాయవాది చేతిలోంచి ఫైలు జారిపోయిందని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి కేవలం మౌఖికంగా వ్యాఖ్యానించారని, ఎటువంటి లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వలేదని ధర్మాసనం గుర్తు చేసింది. సందర్భం గురించి వివరించకుండా కోర్టు విచారణకు సంబంధించిన వీడియో క్లిప్స్‌ని ప్రసారం చేసే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సుప్రీం కోర్టు ధర్మాసనం మీడియాను కోరింది. మీడియాకు కూడా బాధ్యత ఉందని, క్రియాశీలక పాత్ర పోషిస్తుందని సుప్రీం కోర్టు ఆశిస్తోంది.
ఈ ఘటనతో న్యాయవాదులు, న్యాయమూర్తుల బృందాలకు మధ్య తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి సుప్రీం కోర్టు చర్యలు చేపట్టింది. బార్, న్యాయవ్యవస్థ మధ్య తలెత్తే సమస్యల పరిష్కారానికి బార్ కౌన్సిల్స్, బార్ అసోసియేషన్‌ల సభ్యులతో కూడిన గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కమిటీలను (జీఆర్సీలు) హైకోర్టులు, దిగువ కోర్టులలో ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. ఇటువంటి కమిటీలను జిల్లా/తాలూకా స్థాయిలో కూడా ఏర్పాటు చేయాలని కోర్టు పేర్కొంది. న్యాయవాదులు, ధర్మాసనాలు ఒకే లక్ష్యం కోసం పనిచేస్తాయి. ధర్మాసనం ఒక వైపు ఎత్తైన కుర్చీలలో కూర్చుంటే, న్యాయవాదులు న్యాయం కోసం నిలబడి వాదిస్తుంటారు! ఈ నేపథ్యంలో 15న జరిగే విచారణలో సుప్రీం కోర్టు ఈ ఘటనపై ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో వేచి చూడాలి. న్యాయ వ్యవస్థ పటిష్టవంతమయ్యే విధంగా, యువ న్యాయవాదులకు భరోసా ఇచ్చేవిధంగా అత్యున్నత న్యాయ స్థానం తీర్పు ఇస్తుందని ఆశిద్దాం.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

https://www.sci.gov.in/case-status-case-no/# Writ Petition (Civil) Case Number :604 Case Year : 2026

Serial NumberDiary NumberCase NumberPetitioner NameRespondent NameStatusAction
128532/2026W.P.(C) No. 000604 / 2026 Registered on 08-05-2026
SUPREME COURT BAR ASSOCIATIONHIGH COURT OF ANDHRA PRADESHDISPOSEDView

Diary Number28532/2026 Filed on 08-05-2026 03:04 PM

No comments:

Post a Comment

యువ న్యాయవాదులను భయపెట్టవద్దు

ఏపీ హైకోర్టు ఘటనపైనే ఇప్పుడు దేశమంతటా చర్చ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మే 5న జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండి...