Mar 24, 2026

సాహిత్యంలో రజా హుస్సేన్ రికార్డ్

ఫేస్ బుక్‌ వేదికగా కాఫీ విత్... పేరుతో 3331 ఎపిసోడ్స్ 


ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్  అబ్దుల్ రజా హుస్సేన్ సాహిత్యంలో ఓ రికార్డ్ సృష్టించి, సాహితీ శిఖరానికి చేరుకున్నారు. కాఫీ విత్..... పేరిట సాహితీ విమర్శలను ప్రారంభించి  ఏకధాటిగా  3331 (మార్చి 21-దాకోజు శివప్రసాద్) ఎపిసోడ్స్ తో కొనసాగిస్తున్నారు. మార్చి 21 రాసిన  ఎపిసోడ్ లో అన్నమయ్య -చలం మధ్య పోలిక వివరించారు. వారిద్దరి మధ్య పోలికేంటని ఆశ్చర్యపోకండి. చదివితే తెలుస్తుంది.   3195 ఎపిసోడ్ లో  కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం పొందిన  నందిని సిధారెడ్డి రచించిన దీర్ఘకవిత “అనిమేష” (ఉపద్రవ గాధకావ్యమ్) నూరుపాళ్ళు అకాడెమీ పురస్కారానికి అర్హమైందని పేర్కొన్నారు. ఈ సాహితీ ప్రవాహం ఆగేదికాదు. ఇలాగే కొనసాగుతుంది. అంతేకాకుండా,  చిత్రకళా పరిమళం -407 ఎపిసోడ్స్, కొత్త పుస్తకం-278(బీఎస్ రాములు ఆత్మకథ),  మనసు విప్పి కాస్సేపు -175(ఆనందో పరబ్రహ్మ), సక్సెస్ స్టోరీలు-192, రమదాన్ - 25 ఎపిసోడ్స్, పచ్చి జ్ఞాపకం...మొదలైన శీర్షికల పేర్లతో వేలకు వేలు  రాశారు. రాస్తున్నారు.  ఈ మధ్య తన కవిత్వానికి, విశ్లేషణలకు అందమైన, అద్భుతమైన ఫొటోలను కూడా జతచేసి మరీ పోస్ట్ చేస్తున్నారు. 

 

మార్చి 21 ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా  ‘‘ప్రజల దగ్గరకు వెళ్ళేది. ప్రజలతో  మమేకమయ్యేది  కవిత్వం .!!’’ అని మొదలుపెట్టి  మనకు తెలిసిన అనేక మంది కవుల ‘ఆకు పచ్చని జ్ఞాపకాలు’ రాశారు.  ఉద్యోగ విరమణ తర్వాత ఆయన రాయడమే పనిగా పెట్టుకున్నారు. అలుపెరగకుండా రాస్తున్నారు. సాహితీ లోతులను తవ్వితీస్తున్నారు.  కొత్త పుస్తకాలను, కొత్త రచయితలను సాహిత్యలోకానికి పరిచయం చేయడమే పనిగా పెట్టుకున్నారు. గతంలో ‘యువ సంతకాలు’ శీర్షికన నాగభైరవ కోటేశ్వరరావు ‘వార్త’ ఆదివారం అనుబంధంలో యువ కవులను పరిచయం చేశారు. అయితే, ఆయన ఓ 200 మందికిలోపే పరిచయం చేశారు. అది పత్రిక అయినందున పరిమితి ఉంటుంది. ఫేస్ బుక్ అయినందున రజా హుస్సేన్ కు ఆ పరిమితిలేదు.  ఓ కవి, ఆయన రాసిన పుస్తకం, రచన, కవిత్వం వెలుగులోకి రావాలంటే, చాలా రకాల సంబంధాలతో ముడిపడి ఉంటుంది. అయితే, రజా హుస్సేన్ కు అవేమీ పట్టవు. మనిషి జీవన శైలి, పుస్తకం, రచన, కవిత్వం నచ్చితే చాలు వెలుగులోకి తీసుకువస్తారు.  ఆ విధంగా కొత్త రచయితలకు ఆరాధ్యుడయ్యారు.

 

రజా హుస్సేన్ రాతల పోకడకు ప్రపంచమే హద్దు. రచయితలు, కవులు, కళాకారులు, నటులు, వృత్తి నిపుణులు..... ఇలా మనిషిలో ఏ నైపుణ్యం ఉన్నా గుర్తించి, మరీ వెలుగులోకి తీసుకురావడం ఆయన ప్రత్యేకత. పురాతన కవుల దగ్గర నుంచి గురజాడ అప్పారావు,  కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ...... వంటి వారు మొదలుకొని ఖలీల్ జిబ్రాన్ .... వంటివారితోపాటు నేటి తరం యువకవుల వరకు.... గోసంగీల జీవితాలపై  పలు రచనలు చేసిన ప్రముఖ తెలుగు రచయిత, పరిశోధకులు గనిశెట్టి రాములు, ఒగ్గు కళకు జీవితాన్ని అంకితం చేసిన తొలి మహిళా కళాకారిణి మల్లారి, జార్ఖండ్ డైనమెట్,  డైనమిక్ చిత్రకారుడు మహతో మనీష్ కుమార్, చిత్రాలయ రాజు  ప్రత్తిపాటి రాజు, బలిజేపల్లి లక్ష్మీకాంతం,  శేషేంద్ర శర్మ, వెల్చాల కొండలరావు, డాక్టర్. వేదాంతం రామలింగశాస్త్రి,  రావిరంగారావు,  గోలి మధు, ఇషాక్ హుస్సేన్(ఇష్క్), షేక్ కరిముల్లా, తేళ్ళ అరుణ, మంజువాణి కొండపి , జ్యోతిర్మయి మళ్ళ, డాక్టర్ రాయదుర్గం విజయలక్ష్మి, పోర్షియా దేవి, భాగ్యలక్ష్మి నల్లా,  నల్లి ధర్మారావు, సినీ ప్రముఖులు కాంచనమాల, కె.విశ్వనాథ్, ఎన్టీఆర్, అక్కినేని, సావిత్రి, జమున....... వంటి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు,   పురాణాలు,  పురాతన భవనాలలో కళా నైపుణ్యం, శ్రీవెంకటేశ్వర శుప్రభాతం...... ఇలా ఎవరినీ, దేనిని వదిలిపెట్టరు.  అన్ని రంగాల వారిని, అన్ని అంశాలను విశ్లేషించారు. సాహితీ పంట పండిస్తున్నారు.  ఎవరి గురించైనా రాసే ముందు అతను ఆస్తికుడా?, నాస్తికుడా?,  హేతువాదా?, ఏ మతం?, ఏ జాతి?,  ఏ కులం?, ఏ పార్టీ?, చేనేత ఉద్యమకారుడా?,  నక్సలైట్ ఉద్యమకారుడా?..... అనేవి అస్సలు పట్టించుకోరు.  అతనిలో తనకు నచ్చిన ప్రతిభ గురించే ఆలోచిస్తారు. అధ్యయనం చేస్తారు. సారం మనకు అందిస్తారు.    


అభ్యుదయ కవిత్వం నుంచి ప్రేమ కవిత్వం వరకు మనసుకు హత్తుకునేవిధంగా రజా హుస్సేన్ రాస్తారు. ‘స్పర్శ’ పై ఆయన చాలా అద్భుతంగా  రాశారు. ఆయన చాలా వివరంగా రాసినప్పటికీ,  దానిని చదివితే, మనకు ఇంకా అనేక స్పర్శలు,  వాటి ప్రభావాలు, ఫలితాలు... గుర్తుకు వస్తాయి. ఒక్కో డాక్టర్ స్పర్శని హస్తవాసి అంటారు. అది కూడా అలాంటిదే.  ‘‘ఈ ప్రేమ వుందే మా చెడ్డది…. ఎవరూ… తెలిసి ప్రేమించరు - ప్రేమించాకే …ప్రేమంటే ఏమిటోతెలుస్తుంది’’ అంటారు. మనం చెట్లు నరుక్కుంటూపోతున్నాం.. నగరాలన్నీ కాంక్రీటు వనాలవుతున్నాయి. అభివృద్ధి పేరుతో అడవుల్ని కాంక్రీటు జంగిల్ గా మారుస్తున్నాం.  వన్యజీవులు ఎక్కడ బతకాలి? అని ప్రశ్నిస్తారు.  సుఖం వేరు..ఆనందం వేరు. ఈ రెంటిలో ఆనందమే. పరమోన్నతమైంది..!! అని తెలిపారు. బడి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంపై నోరుజారిన ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావుని ‘ప్రవచనమా... విరోచనమా..?’ అని ఉతికి ఆరేశారు. వందేమాతరం పాటపై కూడా చక్కటి వివరణ ఇచ్చారు. వెంకటేశ్వరుడిని రాజకీయాల్లోకి లాగి నందుకు బాధపడతారు. అలా చేయకండ్రా బాబూ అని వేడుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన తన రచనల ద్వారా మత సామరస్యం కోసం ప్రయత్నిస్తారు. వీటన్నిటినీ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు.  వేల మంది జీవితాలు, వారి రచనలపై స్పందించారు. విమర్శించారు. మెచ్చుకున్నారు. ఆ విధంగా ఆయన జీవితమే సాహిత్యంతో పెనవేసుకుపోయింది.  ఒక్క మనిషి ఇన్ని రాశారా?! అని ఆశ్చర్యపోతున్నారా? అవును. ఫేస్ బుక్ సాక్షిగా ఇది నిజం.  సాహితీ అభిమానులకు రజాహుస్సేన్ రచనలు తిరగేయడం అంటే ఓ పండుగ.  

రజా హుస్సేన్ పేరు కోసమో, సంపాదన కోసం ఇంతటి సాహిత్యాన్ని మనకు అందించడంలేదు. అది ఆయన ప్రవృత్తి. అత్యంత ఇష్టంగా రాస్తారు. సాహితీ వేత్తలన్నా, శ్రమజీవులన్నా ఆయనకు అంత ప్రేమ. కాఫీ విత్..... పేరిట రాసినవాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని తన సొంత ఖర్చులతో పుస్తక రూపంలో తీసుకురావడం కూడా ఆయన ప్రారంభించారు. మొదటిసారిగా ‘కాఫీ విత్ గోలి మధు’ అనే పుస్తకాన్ని బయటకు తెచ్చారు. భవిష్యత్తులో ఆయన రచనలపై ఎంఫిల్,  పీహెచ్‌డీ చేసే అవకాశం ఉంది.  సాహితీ ప్రపంచంలో  ఇంతటి సాహిత్యాన్ని గుమ్మరిస్తున్న రజా హుస్సేన్ కు ఆ స్థాయిలో తగిన గుర్తింపు రాలేదు. అందుకు ఆయన ముక్కుసూటి రాతలే అయి ఉండవచ్చన్నది నా భావన. అయితే, ఆయన సాహిత్య సృష్టిని ఎవరూ మెచ్చుకోకుండా ఉండలేరు.  అభిమానుల ప్రశంసలకు మించిన అవార్డులు ఏముంటాయని రజా హుస్సేన్ అంటారు. అది కూడా నిజమే కదా! అది కూడా కాదు అదే నిజం.

నేను 2014లో ప్రముఖ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ‘రామ్ గోపాల్ వర్మకు తిక్క: ఒక పరిశీలన’ శీర్షికన  రాస్తూ,  భవిష్యత్ లో అతనిపై  యూనివర్సీటీలలో  సినిమా - జర్నలిజం - సైకాలజీ - యాడ్స్ - కామర్స్ -హిస్టరీ...వంటి  డిపార్ట్ మెంట్లలో  పీహెచ్ డీలు చేసే అవకాశం ఉందని రాశాను. అయిదేళ్ల తర్వాత అతనిపై పీహెచ్ డీ చేయడం మొదలైంది.  అలాగే, సాహిత్య గని అయిన రజా హుస్సేన్ రచనలపై కూడా తప్పక పీహెచ్ డీ చేస్తారని భావిస్తున్నాను.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914



Mar 22, 2026

సాహితీ వనంలో విరబూసిన రజా హుస్సేన్

ఫేస్ బుక్‌లో కాఫీ విత్... పేరుతో 3220 ఎపిసోడ్స్ రికార్డ్


ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్  అబ్దుల్ రజా హుస్సేన్ సాహిత్యంలో ఓ రికార్డ్ సృష్టించి, సాహితీ శిఖరానికి చేరుకున్నారు. కాఫీ విత్..... పేరిట సాహితీ విమర్శలను ప్రారంభించి  ఏకధాటిగా  3220 (మార్చి 21-అన్నమయ్య / చలం) ఎపిసోడ్స్ తో కొనసాగిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో అన్నమయ్య -చలం మధ్య పోలిక వివరించారు. వారిద్దరి మధ్య పోలికేంటని ఆశ్చర్యపోకండి. చదివితే తెలుస్తుంది.   3195 ఎపిసోడ్ లో  కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం పొందిన  నందిని సిధారెడ్డి రచించిన దీర్ఘకవిత “అనిమేష” (ఉపద్రవ గాధకావ్యమ్) నూరుపాళ్ళు అకాడెమీ పురస్కారానికి అర్హమైందని పేర్కొన్నారు.ఈ సాహితీ ప్రవాహం ఆగేదికాదు. ఇలాగే కొనసాగుతుంది. అంతేకాకుండా,  చిత్రకళా పరిమళం -407 ఎపిసోడ్స్, కొత్త పుస్తకం-278(బీఎస్ రాములు ఆత్మకథ),  మనసు విప్పి కాస్సేపు -175(ఆనందో పరబ్రహ్మ), సక్సెస్ స్టోరీలు-192, రమదాన్ - 25 ఎపిసోడ్స్, పచ్చి జ్ఞాపకం...మొదలైన శీర్షికల పేర్లతో వేలకు వేలు  రాశారు. రాస్తున్నారు.  ఈ మధ్య తన కవిత్వానికి, విశ్లేషణలకు అందమైన, అద్భుతమైన ఫొటోలను కూడా జతచేసి మరీ పోస్ట్ చేస్తున్నారు. 

 మార్చి 21 ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా  ‘‘ప్రజల దగ్గరకు వెళ్ళేది. ప్రజలతో  మమేకమయ్యేది  కవిత్వం .!!’’ అని మొదలుపెట్టి  మనకు తెలిసిన అనేక మంది కవుల ‘ఆకు పచ్చని జ్ఞాపకాలు’ రాశారు.  ఉద్యోగ విరమణ తర్వాత ఆయన రాయడమే పనిగా పెట్టుకున్నారు. అలుపెరగకుండా రాస్తున్నారు. సాహితీ లోతులను తవ్వితీస్తున్నారు.  కొత్త పుస్తకాలను, కొత్త రచయితలను సాహిత్యలోకానికి పరిచయం చేయడమే పనిగా పెట్టుకున్నారు. గతంలో ‘యువ సంతకాలు’ శీర్షికన నాగభైరవ కోటేశ్వరరావు ‘వార్త’ ఆదివారం అనుబంధంలో యువ కవులను పరిచయం చేశారు. అయితే, ఆయన ఓ 200 మందికిలోపే పరిచయం చేశారు. అది పత్రిక అయినందున పరిమితి ఉంటుంది. ఫేస్ బుక్ అయినందున రజా హుస్సేన్ కు ఆ పరిమితిలేదు.  ఓ కవి, ఆయన రాసిన పుస్తకం, రచన, కవిత్వం వెలుగులోకి రావాలంటే, చాలా రకాల సంబంధాలతో ముడిపడి ఉంటుంది. అయితే, రజా హుస్సేన్ కు అవేమీ పట్టవు. మనిషి జీవన శైలి, పుస్తకం, రచన, కవిత్వం నచ్చితే చాలు వెలుగులోకి తీసుకువస్తారు.  ఆ విధంగా కొత్త రచయితలకు ఆరాధ్యుడయ్యారు.

 రజా హుస్సేన్ రాతల పోకడకు ప్రపంచమే హద్దు. రచయితలు, కవులు, కళాకారులు, నటులు, వృత్తి నిపుణులు..... ఇలా మనిషిలో ఏ నైపుణ్యం ఉన్నా గుర్తించి, మరీ వెలుగులోకి తీసుకురావడం ఆయన ప్రత్యేకత. పురాతన కవుల దగ్గర నుంచి గురజాడ అప్పారావు,  కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ...... వంటి వారు మొదలుకొని ఖలీల్ జిబ్రాన్ .... వంటివారితోపాటు నేటి తరం యువకవుల వరకు.... గోసంగీల జీవితాలపై  పలు రచనలు చేసిన ప్రముఖ తెలుగు రచయిత, పరిశోధకులు గనిశెట్టి రాములు, ఒగ్గు కళకు జీవితాన్ని అంకితం చేసిన తొలి మహిళా కళాకారిణి మల్లారి, జార్ఖండ్ డైనమెట్,  డైనమిక్ చిత్రకారుడు మహతో మనీష్ కుమార్, చిత్రాలయ రాజు  ప్రత్తిపాటి రాజు, బలిజేపల్లి లక్ష్మీకాంతం,  శేషేంద్ర శర్మ, వెల్చాల కొండలరావు, డాక్టర్. వేదాంతం రామలింగశాస్త్రి,  రావిరంగారావు,  గోలి మధు, ఇషాక్ హుస్సేన్(ఇష్క్), షేక్ కరిముల్లా, తేళ్ళ అరుణ, మంజువాణి కొండపి , జ్యోతిర్మయి మళ్ళ, డాక్టర్ రాయదుర్గం విజయలక్ష్మి, పోర్షియా దేవి, భాగ్యలక్ష్మి నల్లా,  నల్లి ధర్మారావు, సినీ ప్రముఖులు కాంచనమాల, కె.విశ్వనాథ్, ఎన్టీఆర్, అక్కినేని, సావిత్రి, జమున....... వంటి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు,   పురాణాలు,  పురాతన భవనాలలో కళా నైపుణ్యం, శ్రీవెంకటేశ్వర శుప్రభాతం...... ఇలా ఎవరినీ, దేనిని వదిలిపెట్టరు.  అన్ని రంగాల వారిని, అన్ని అంశాలను విశ్లేషించారు. సాహితీ పంట పండిస్తున్నారు.  ఎవరి గురించైనా రాసే ముందు అతను ఆస్తికుడా?, నాస్తికుడా?,  హేతువాదా?, ఏ మతం?, ఏ జాతి?,  ఏ కులం?, ఏ పార్టీ?, చేనేత ఉద్యమకారుడా?,  నక్సలైట్ ఉద్యమకారుడా?..... అనేవి అస్సలు పట్టించుకోరు.  అతనిలో తనకు నచ్చిన ప్రతిభ గురించే ఆలోచిస్తారు. అధ్యయనం చేస్తారు. సారం మనకు అందిస్తారు.    

అభ్యుదయ కవిత్వం నుంచి ప్రేమ కవిత్వం వరకు మనసుకు హత్తుకునేవిధంగా రజా హుస్సేన్ రాస్తారు. ‘స్పర్శ’ పై ఆయన చాలా అద్భుతంగా  రాశారు. ఆయన చాలా వివరంగా రాసినప్పటికీ,  దానిని చదివితే, మనకు ఇంకా అనేక స్పర్శలు,  వాటి ప్రభావాలు, ఫలితాలు... గుర్తుకు వస్తాయి. ఒక్కో డాక్టర్ స్పర్శని హస్తవాసి అంటారు. అది కూడా అలాంటిదే.  ‘‘ఈ ప్రేమ వుందే మా చెడ్డది…. ఎవరూ… తెలిసి ప్రేమించరు - ప్రేమించాకే …ప్రేమంటే ఏమిటోతెలుస్తుంది’’ అంటారు. మనం చెట్లు నరుక్కుంటూపోతున్నాం.. నగరాలన్నీ కాంక్రీటు వనాలవుతున్నాయి. అభివృద్ధి పేరుతో అడవుల్ని కాంక్రీటు జంగిల్ గా మారుస్తున్నాం.  వన్యజీవులు ఎక్కడ బతకాలి? అని ప్రశ్నిస్తారు.  సుఖం వేరు..ఆనందం వేరు. ఈ రెంటిలో ఆనందమే. పరమోన్నతమైంది..!! అని తెలిపారు. బడి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంపై నోరుజారిన ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావుని ‘ప్రవచనమా... విరోచనమా..?’ అని ఉతికి ఆరేశారు. వందేమాతరం పాటపై కూడా చక్కటి వివరణ ఇచ్చారు. వెంకటేశ్వరుడిని రాజకీయాల్లోకి లాగి నందుకు బాధపడతారు. అలా చేయకండ్రా బాబూ అని వేడుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన తన రచనల ద్వారా మత సామరస్యం కోసం ప్రయత్నిస్తారు. వీటన్నిటినీ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు.  వేల మంది జీవితాలు, వారి రచనలపై స్పందించారు. విమర్శించారు. మెచ్చుకున్నారు. ఆ విధంగా ఆయన జీవితమే సాహిత్యంతో పెనవేసుకుపోయింది.  ఒక్క మనిషి ఇన్ని రాశారా?! అని ఆశ్చర్యపోతున్నారా? అవును. ఫేస్ బుక్ సాక్షిగా ఇది నిజం.  సాహితీ అభిమానులకు రజాహుస్సేన్ రచనలు తిరగేయడం అంటే ఓ పండుగ.  

రజా హుస్సేన్ పేరు కోసమో, సంపాదన కోసం ఇంతటి సాహిత్యాన్ని మనకు అందించడంలేదు. అది ఆయన ప్రవృత్తి. అత్యంత ఇష్టంగా రాస్తారు. సాహితీ వేత్తలన్నా, శ్రమజీవులన్నా ఆయనకు అంత ప్రేమ. కాఫీ విత్..... పేరిట రాసినవాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని తన సొంత ఖర్చులతో పుస్తక రూపంలో తీసుకురావడం కూడా ఆయన ప్రారంభించారు. మొదటిసారిగా ‘కాఫీ విత్ గోలి మధు’ అనే పుస్తకాన్ని బయటకు తెచ్చారు. భవిష్యత్తులో ఆయన రచనలపై ఎంఫిల్,  పీహెచ్‌డీ చేసే అవకాశం ఉంది.  సాహితీ ప్రపంచంలో  ఇంతటి సాహిత్యాన్ని గుమ్మరిస్తున్న రజా హుస్సేన్ కు ఆ స్థాయిలో తగిన గుర్తింపు రాలేదు. అందుకు ఆయన ముక్కుసూటి రాతలే అయి ఉండవచ్చన్నది నా భావన. అయితే, ఆయన సాహిత్య సృష్టిని ఎవరూ మెచ్చుకోకుండా ఉండలేరు.  అభిమానుల ప్రశంసలకు మించిన అవార్డులు ఏముంటాయని రజా హుస్సేన్ అంటారు. అది కూడా నిజమే కదా! అది కూడా కాదు అదే నిజం.

నేను 2014లో ప్రముఖ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ‘రామ్ గోపాల్ వర్మకు తిక్క: ఒక పరిశీలన’ శీర్షికన  రాస్తూ,  భవిష్యత్ లో అతనిపై  యూనివర్సీటీలలో  సినిమా - జర్నలిజం - సైకాలజీ - యాడ్స్ - కామర్స్ -హిస్టరీ...వంటి  డిపార్ట్ మెంట్లలో  పీహెచ్ డీలు చేసే అవకాశం ఉందని రాశాను. అయిదేళ్ల తర్వాత అతనిపై పీహెచ్ డీ చేయడం మొదలైంది.  అలాగే, సాహిత్య గని అయిన రజా హుస్సేన్ రచనలపై కూడా తప్పక పీహెచ్ డీ చేస్తారని భావిస్తున్నాను.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914



Mar 21, 2026

నలుగురు చేనేత బిడ్డలకు ఉగాది పురస్కారాలు


శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నలుగురు చేనేత బిడ్డలకు ‘ఉగాది పురస్కారాలు-2026’  ప్రకటించింది. మొత్తం 164 మందికి (40 కళారత్న, 124 ఉగాది) పురస్కారాలు ప్రకటించినట్లు  పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మంగళవారం  జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారిలో చేనేత కుటుంబాలకు చెందిన  జామ్దానీ నేత కళాకారుడు గౌరాబత్తిని రమణయ్య, సీనియర్  జర్నలిస్టులు డాక్టర్ గుత్తికొండ కొండలరావు, ఉడతా రామకృష్ణ, ఆర్టిస్ట్ కౌతరపు పార్వతి ఉన్నారు. 

 



గౌరాబత్తిని రమణయ్య: 
తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు గౌరాబత్తిని రమణయ్యకు చేనేత రంగంలో జామ్‌దానీ నేత కళలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా ప్రభుత్వం ఈ పురస్కారానికి ఎంపిక చేసింది.  రమణయ్య దాదాపు ఆరు దశాబ్దాలుగా చేనేత రంగంలో విశేష సేవలందిస్తున్నారు. చీరలపై అరుదైన డిజైన్లను నేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.  2003లో చీరపై నేసిన రామచిలుక డిజైన్‌కు జాతీయ అవార్డు అందుకున్నారు. 2005లో ఎద్దు డిజైన్‌కు రాష్ట్ర అవార్డు, 2006లో “ట్రీ ఆఫ్ లైఫ్” డిజైన్‌కు యునెస్కో అవార్డు, 2009లో కల్పవృక్షం డిజైన్‌కు సంత్ కబీర్ అవార్డు అందుకున్నారు. 2014లో “డబుల్ ట్రీ” డిజైన్‌కు వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ అవార్డు చైనాలో అందుకున్నారు. 2021లో వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డును కూడా అందుకున్నారు.  రమణయ్య తయారు చేసిన ప్రత్యేక వస్త్రాన్ని  బంగ్లాదేశ్ ప్రధాని హసీనా బేగంకు మన ప్రధాని నరేంద్ర మోదీ బహుమతిగా అందజేశారు.  రమణయ్య   ప్రస్తుతం రిలయన్స్ వంటి ప్రముఖ సంస్థలకు ప్రత్యేక వాల్ హ్యాంగింగ్స్ తయారు చేస్తూ ఆధునిక చేనేత కళను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.

 


కౌతరపు పార్వతి: గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయిని, చిత్రకారిణి కౌతరపు పార్వతి(ఆమ్రపాలి)ని, ఆమె చిత్రకళా నైపుణ్యానికి గుర్తుగా ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఫైన్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ (బీఎఫ్ఏ) డిగ్రీ చేసిన పార్వతి ప్రభుత్వ పాఠ్యపుస్తకాలకు చిత్రకారిణిగా పనిచేశారు.  ప్రముఖ కవులు, రచయితల పుస్తకాలకు కవర్ పేజీలు రూపొందించారు. అమెరికాలోని తానా వారి మాసపత్రిక తెలుగునాడికి ముఖచిత్రాలతోపాటు అనేక లోపలి పేజీల చిత్రాలు గీశారు.  ఆమె చిత్రకళా నైపుణ్యాన్ని దేశవిదేశాల్లో అనేక మంది ప్రముఖులు మెచ్చుకున్నారు. ప్రశంసించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇండియన్ ఎంబసీ, ఆర్ట్ గ్యాలరీలో జరిగిన ప్రతిష్టాత్మక ప్రదర్శనల్లో ఆమె పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో  చైనా, రష్యా, బ్యాంకాక్, ఈజిప్టు, వియత్నాం, మాల్దీవులతోపాటు జాతీయ స్థాయిలో న్యూఢిల్లీ, నాగపూర్, అస్సాం, ముంబై, హైదరాబాద్, విజయవాడ, అమరావతి, గుంటూరు తదితర నగరాలలో నిర్వహించిన చిత్రకళా ప్రదర్శనల్లో పాల్గొన్నారు. పార్వతి 2008లో ఉత్తమ ఉపాధ్యయపుస్కారం, 2021లో మాల్దీవ్స్ ఇంటర్నేషనల్ పీస్ అవార్డు, ఉమ్మిడిశెట్టి సత్యాదేవి ప్రతిభా పురస్కారం.... వంటి అనేక పురస్కారాలు అందుకున్నారు.  పార్వతి స్వీయరచన, దర్శకత్వంలో ‘బతుకు చిత్రం’ పేరుతో ఒక లఘుచిత్రాన్ని కూడా నిర్మించారు. 


జీకే:  పశ్చిమగోదావరి జిల్లా తిరుపతి పురం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, విజయవాడ దూరదర్శన్ కేంద్రం న్యూస్ హెడ్(ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్)గా పదవీవిరమణ చేసిన  డాక్టర్ గుత్తికొండ కొండలరావు (జీకే)కు, జర్నలిజం రంగంలో తను చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.  ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంజేఎంసీలో గోల్డ్ మెడల్ సాధించిన జీకే గిరిజన ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగంపై  పీహెచ్‌డీ చేశారు. జర్నలిజంలో డాక్టరేట్ చేసిన జీకే ప్రాంతీయ వార్తా విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. జీకే మొదట్లో కొద్దికాలం ఈనాడులో పనిచేశారు. ఆ తరువాత ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్)కు ఎన్నికయ్యారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ)లో ముంబై, విజయవాడలలో పని చేశారు. క్షేత్రస్థాయి ప్రచార విభాగం(డైరెక్టరేట్ ఫీల్డ్ పబ్లిసిటీ)లో శ్రీకాకుళంలోని మారుమూల ప్రాంతాల్లో, మత్స్యకార గ్రామాల్లో పని చేశారు. క్షేత్రప్రచారాధికారిగా జీకే ఉత్తర కోస్తాలో ఎంతో సేవచేశారు. ఆ తర్వాత ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా సేవలందించారు. తర్వాత విజయవాడ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అధిపతిగా అంకితభావంతో పనిచేసి అందరి మన్ననలు పొందారు. కరోనా సమయంలో ఆకాశవాణిలో ‘జింగిల్స్’ వంటి కొత్త ప్రయోగాలతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు.  12 వేలకు పైగా జింగిల్స్ ప్రసారం చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. పలు విశ్వవిద్యాలయాల్లో  జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహించిన సెమినార్లలో ఆయన పరిశోధనా పత్రాలను సమర్పించారు.  ఆయన రాసిన పరిశోధనాత్మక వ్యాసాలు అనేకం జాతీయ, అంతర్జాతీయ స్థాయి జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. ఆయన మొట్టమొదటి ఇంటర్వూ దివంగత మదర్ థెరిస్సాను చేశారు.  అంతర్జీతీయ చలన చిత్రోత్సవాల్లో కూడా పాల్గొన్నారు. కొండలరావు  జీకే అనే కలం పేరుతో వందల వ్యాసాలు రాశారు. 

 


ఉడతా రామకృష్ణ : కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లి గ్రామానికి  చెందిన సీనియర్ జర్నలిస్ట్, పుస్తక రచయిత ఉడతా రామకృష్ణను, జర్నలిజం రంగంలో తను చేసిన విశిష్ఠ సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. చేనేత కార్మికుడిగా మొదలైన ఆయన జీవితం 1989లో జర్నలిజం వైపునకు మళ్లింది. 14 ఏళ్ళు దారాలను అల్లిన చేతులు అక్షరాలను అల్లడం మొదలుపెట్టాయి.  మూడున్నర దశాబ్ధాల ఆయన జర్నలిస్ట్  ప్రస్థానం అంతా ప్రజాశక్తి దినపత్రికతోనే ముడిపడింది. ఆ పత్రికలో ఆయన విలేకరిగా, స్టాఫ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్ గా, డెస్క్ ఇన్ చార్జిగా, ఎడిషన్ ఇన్ చార్జిగా, కోస్తా జిల్లాల న్యూస్ కోఆర్డినేటర్ గా, ఫీచర్ రైటర్ గా, ప్రజాశక్తి జర్నలిజం కళాశాల ఇన్ చార్జి ప్రిన్సిపాల్, మొఫిషియల్ నెట్ వర్క్ ఇన్ చార్జిగా, క్వాలిటీ సెల్ ఇన్ చార్జిగా, కేంద్ర ఎడిటోరియల్ బోర్డు సభ్యులుగా, ప్రజాశక్తి ప్రచురణ సంస్థ అసిస్టెంట్ ఎడిటర్ గా.... ఇలా ఒక్క ఎడిటర్ పోస్టు తప్ప అన్నీ చేశారు. ఇప్పటికీ ప్రజాశక్తికి చెందిన ‘రైతువాణి’ మాసపత్రికకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రజాశక్తి దినపత్రికలో ఎన్నో శీర్షికలను నిర్వహించడంతోపాటు వేల వ్యాసాలు, వార్తా కథనాలు రాశారు. ఆ రంగం ఈ రంగం అని ఏమీలేదు రాజకీయ, సాహిత్య, కళలు.... ఇలా అన్ని రంగాలపై వ్యాసాలు రాశారు. అనే మంది ప్రముఖులను ఇంటర్వ్యూలు చేశారు. నిత్య స్ఫూర్తి(డాక్టర్ డి.సాంబశివరావు), ప్రతిభామూర్తులు వంటి పది పుస్తకాల వరకు రాశారు.  దశాబ్దానికి పైగా మగ్గం నేసిన చేతులతో ఓ చేనేత కార్మికుడు  జర్నలిస్టుగా  వేయికి పైగా వ్యాసాలు రాసి ఈ స్థాయికి చేరుకుని రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం అందుకోవడం అభినందనీయం. 

విజయవాడలోని అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్‌లో మార్చి 19న  జరిగే వేడుకలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పురస్కారాలతో వారిని సత్కరిస్తారు.  ఉగాది పురస్కారం గ్రహీతలకు రూ. 10వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేస్తారు.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Mar 3, 2026

‘కాఫీ విత్... గోలి మధు’పై విశ్లేషణ

3 వేలకుపైగా సాహితీ ఎపిసోడ్స్‌తో రజా హుస్సేన్ రికార్డ్


ఆయన చూపు పడిన ఏదైనా రజా హుస్సేనిజానికి రూపాంతరం చెందుతుంది. ఇజం అంటే ఏమిటో అని కంగారు పడకండి. ఇక్కడ ఇజం అంటే సాహితీ సేవనం, విమర్శ, ముఖ పుస్తక సాహితీ ప్రక్రియ. ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్  అబ్దుల్ రజా హుస్సేన్ కంటపడిన ఏ పుస్తకమైనా,  పురాతన భవనమైనా, మరేదైనా వాటికి సాహితీ తీగ అల్లుకుంటుంది. వాటి లోతులకు వెళ్లి, అంతగా పెనవేసుకుపోతారు. గుంటూరు జిల్లా, తెనాలి మండలం నంది వెలుగు గ్రామంలోని వందేళ్లనాటి పచ్చి పులుసు వారి మేడ గురించి కూడా చాలా అద్భుతంగా  రాశారు.  ఫేస్ బుక్ వేదికగా ‘కాఫీ విత్’ శీర్షికన  ఇప్పటి వరకు 3123  విమర్శలు, విశ్లేషణలు రాసిన సాహితీ దిగ్గజం రజా హుస్సేన్.  తెలుగు సాహిత్యంలో ఇదో రికార్డ్.  పాత, కొత్త అనే భేదంలేకుండా తెలుగు సాహిత్యంలో కాకలుతీరిన పురాతన కవుల దగ్గర నుంచి వర్ధమాన కవుల‌ వరకు, వారి కవిత్వ సమగ్ర విశ్లేషణే ఈ శీర్షిక ప్రధాన లక్ష్యం. సోషల్ మీడియాలో సాహితీ లోకం మొత్తాన్ని ఇప్పుడు అమితంగా ఆకర్షిస్తున్న శీర్షిక ఇది. ఈ శీర్షికే  కాకుండా, చిత్రకళా పరిమళం పేరుతో మరో 400 ఎపిసోడ్స్ రాశారు.  ఇంకా అనేక శీర్షికలతో  పుంఖానుపుంఖాలుగా పలు అంశాలపై విమర్శలు, విశ్లేషణలు చేశారు. రాస్తున్నారు. ఇలా నిరంతరం అంటే, రాత్రి, పగలు  సాహితీ సేద్యం చేయడమే ఆయనకు  అత్యంత ఇష్టమైన పని.  రచనా వ్యాసంగంలో స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న ఆయన చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు, అందులోని  ఫేస్ బుక్ లో ఇబ్బడిముబ్బడిగా సాహిత్యం పండిస్తారు.  కవులు, కళాకారులు, చిత్రకారులు, రచయితలు.... ఇలా అనేక రంగాల వారి గురించి, వారి సాహిత్య, కళా నైపుణ్యాల గురించి విశ్లేషించారు.  ఇలా ఎన్నో వేల మంది గురించి రాసిన విమర్శకుడు రజా హుస్సేన్. తెలుగు సాహిత్యానికి ఇంత సేవచేస్తున్నవారు ప్రస్తుతానికి మరొకరులేరని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి  కాదు. 

‘కాఫీ విత్’ శీర్షికన రాసిన కవుల గురించి ఒక్కో పుస్తకం తీసుకురావలన్న సంకల్పంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ప్రముఖ ప్రగతిశీల కవి గోలి మధు కవిత్వ విశ్లేషణతో  ఈ సీరీస్ ను  మొదలు పెట్టారు.  రచయిత హుస్సేన్ స్వగ్రామానికి చెందినవాడు కావడం వల్ల మధుకు ఆ అదృష్టం పట్టింది. 20 ఏళ్ల క్రితమే సరదాగా కవిత్వం రాయడం మొదలుపెట్టిన గోలి మధు, మూడునాలుగేళ్ల నుంచి మాత్రమే సీరియస్ గా రాస్తున్నారు. తల్లి గోలి పార్వతి నుంచి వారసత్వంగా మధుకు కవిత్వం రాయడం అబ్బింది. కళ్ల  ముందు అన్యాయం జరిగితే సహించలేడు. కళ్లెర్రచేసి మరీ కవిత్వం రాయగల ఘటికుడు గోలి మధు అన్నది రజా హుస్సేన్ అభిప్రాయం.  

ఇప్పటి వరకు మధు రాసిన భారతీయ ధర్మ విశ్లేషణ(2003), నవశకం(2006), రైతు సమరభేరి(2020,2021),  గమనం(2021),  సంఘర్షణ (2023), ఎదురీత(2025) అనే ఆరు పుస్తకాలు వచ్చాయి. తొలినాళ్లలోనే అభ్యుదయ భావాలతో మధు కవిత్వంలోకి అడుగుపెట్టాడు.  చేనేత సామాజిక వర్గం నేపథ్యం కలిగిన కవి మధు చేనేతకారుల ఈతిబాధలు, వారి బతుకుల్లో కష్టాలు, నష్టాల చిక్కులు తీయాలనే ప్రయత్నం ‘నవశకం’ కవితా సంపుటిలో కనిపిస్తుంది. కవిగా మధు రెక్కలు తొడుగుతున్న దశలో సామాజిక స్పృహతో రాసిన కవితలు   ‘గమనం’ సంపుటిలో ఉన్నాయి.  ఎవరి పక్షాన నిలిచాడో చెప్పాడు.  అన్నదాత రైతు పక్షాన రాసిన ‘రైతు సమరభేరి’  ఇప్పటికే రెండు ముద్రణలు జరగడం విశేషం.  ఢిల్లీ ఉద్యమ నేపథ్యంలో రైతు సమస్యను కేంద్రంగా చేసుకుని రాసిన కవిత్వం  ‘సంఘర్షణ’ అని రజా హుస్సేన్ పేర్కొన్నారు. 

కడుపు తీపి, కాలచక్రం, ప్రేమఖైది, జ్ఞాన నేత్రం, కర్తవ్యం, నాలోనీవు, మౌనం ... వంటి పలు కవితలను రజా హుస్సేన్ తనదైన స్టైల్లో విశ్లేషించారు. రైతులు, చేనేత కార్మికుల వెతలు, మణిపూర్ లో నగ్నకవాతు, పత్రికల తీరు, బౌద్ధం మొదలు కొని ప్రేమ కవిత్వం వరకు మధు రాసిన అనేక కవితలపై చాలా లోతుగా రాసిన విశ్లేషణలు ఇందులో ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తంగా మధుని ఆవిష్కరించిన పుస్తకం ఇది. ఏది రాసినా ఆసక్తిగా చదివించే శక్తి రజా హుస్సేన్ కలానికి ఉంది. అదే ఆయన ప్రత్యేకత. రజా హుస్సేన్ రచనలను భవిష్యత్ తరాల కోసం విశ్వవిద్యాలయాలు, సాహిత్య అకాడమీలు, సాహితీ సంస్థలు భద్రపరచవలసిన అవసరం ఉంది. 


కాఫీ విత్ గోలి మధు పుస్తకం వెల : రూ.100

పుస్తకాల కోసం సెల్: 9063167117

పుస్తక సమీక్ష : శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

Feb 28, 2026

ఆయేషా మీరా హత్య కేసులో అన్నీ సమాధానాలు దొరకని ప్రశ్నలే!

మృత దేహాం అవశేషాలకు అంత్యక్రియలతో పూర్తిగా ముగిసిపోయిన కేసు

ఆయేషా మీరా మృత దేహాం అవశేషాలకు శుక్రవారం అంత్యక్రియలు పూర్తి కావడంతో ఆమె హత్య కేసు పూర్తిగా ముగిసిపోయినట్లు భావించవచ్చు. విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నంలోని శ్రీదుర్గా లేడీస్ హాస్టల్‌లో 2007, డిసెంబరు 27 అర్ధరాత్రి జరిగిన ఆయేషా మీరా హత్యకేసులో సమాధానాలు దొరకని ప్రశ్నలు అనేకం ఉత్పన్నమవుతున్నాయి. తెనాలికి చెందిన ఆయేషా విజయవాడలోని నిమ్రా కాలేజ్‌లో ఫస్టియర్ బీఫార్మసీ చదువుతూ హత్యకు గురైన ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసు విచారణలో ట్విస్ట్ లు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మించి ఉన్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో చివరికి దోషిని కనిపెడతారు. అయితే, ఈ కేసు విచారణ 18 ఏళ్లు సుదీర్ఘంగా సాగిన తర్వాత కూడా దోషులను కనిపెట్టకుండానే ఈ కేసుని విజయవాడ సీబీఐ కోర్టు ఈ నెల 20న మూసివేసింది. ఈ కేసులో నిందితులను గుర్తించడానికి తగిన ఆధారాలు లభించలేదని సీబీఐ సమర్పించిన తుది నివేదిక ఆధారంగా ఈ కేసు మూసివేస్తున్నట్లు కోర్టు తెలిపింది. రెండోసారి పోస్టుమార్టం కోసం సేకరించిన ఆయేషా మీరా మృతదేహానికి సంబంధించిన అవశేషాలను ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 27వ తేదీన ప్రత్యేక వాహనం, ఎస్కార్ట్, ప్రభుత్వ భద్రతతో తెనాలిలోని ఖబరస్తాన్ లో అంత్యక్రియలు నిర్వహించాలని, ఈ ప్రక్రియను రెవెన్యూ, పోలీసు అధికారులు, మత పెద్దల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఆ ప్రకారం తెనాలి చెంచుపేటలోని ఖబరస్తాన్ లో ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిగాయి. దీంతో, ఈ కేసు ప్రక్రియ పూర్తిగా ముగిసిపోయింది. ఆయేషా తల్లి శంషాద్ బేగం, తండ్రి ఇగ్బాల్ బాషాల పోరాటం ఫలించలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. 18 ఏళ్లు పోరాటం చేసి అలిసిపోయామని, ఇక పోరాటం చేసే శక్తి గానీ, ప్రొటెస్ట్ పిటిషన్ వేసే ఆర్థిక స్థోమత గాని తమకు లేవని ఆయేషా తల్లి కోర్టులో కన్నీరు పెట్టుకున్నారు. న్యాయం కోసం ఆ తల్లిదండ్రులు ఎక్కని గడపలేదు. వేడుకోని నాయకులు లేరు.

ఆయేషా హత్య జరిగిన వెంటనే దోషులు, కేసుని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేశారు. అందులో వారు విజయం సాధించారు. రాజకీయాలు, కులం, డబ్బు, అధికారం.... వంటి అంశాల ప్రభావంతో దోషులు ఎవరో తేలకుండానే ఈ కేసుని మూసివేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసు ఇలా నీరుకారిపోవడానికి వ్యవస్థలోని లోపాలే కారణమని న్యాయనిపుణులు తేల్చారు.
ఆయేషా హత్య జరిగిన తర్వాత తెల్లారిపాటికే అక్కడ ఎటువంటి ఆధారాలు లేకుండా దోషులు ముందు జాగ్రత్తపడ్డారు. అంతేకాకుండా, పోలీసులు కూడా దోషులకు పూర్తిగా సహకరించారన్న ఆయేషా తల్లిదండ్రులు ఆరోపించారు. పైగా కొత్త ఆధారాలు సృష్టించారు. పోలీసులు ఆయేషా మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె ఛాతీ మీద ‘చిరుత 143’ అని, పొట్ట మీద లవ్ సింబల్ రాసి ఉంది. అక్కడే లభించిన ఓ లెటర్‌లో, ‘‘నన్ను ప్రేమించమని బతిమిలాడినా ఒప్పుకోలేదు. అందుకే కోపంతో హాస్టల్‌కు వచ్చా. ఆమెను కొట్టి, అత్యాచారానికి పాల్పడ్డాను. అడిగినప్పుడు ప్రేమించకపోతే మిగతావారికీ ఇదే గతి పడుతుంది’’ అని రాసి ఉంది.
ఈ కేసులో పోలీసులు మొదట హాస్టల్ వంటమనిషిని అనుమానించి, విచారించారు. అతను కాదని తేలింది. తర్వాత తెనాలికి చెందిన శివాంజనేయులు, జగిత్యాలకు చెందిన ఉపేందర్ సింఘ్, గుర్విందర్ సింఘ్ అలియాస్ లడ్డూలను ఒకరి తర్వాత ఒకరిని అరెస్టులు చేశారు. అయితే, వారి అందరి కుటుంబ సభ్యులు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించడంతో వారిని విడుదల చేశారు. ఒకానొక సందర్భంలో ఆయేషా మీరా మేన మామను, మరో సమీప బంధువును కూడా పోలీసులు అనుమానించారు. చివరకు ఇతర నేరాల క్రింద సబ్ జైలులో శిక్షను అనుభవిస్తున్న ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండలం, అనాసాగర గ్రామానికి చెందిన పిడతల సత్యనారాయణ అలియాస్ సత్యం బాబు అనే యువకుడిని నిందితునిగా పేర్కొని, 2008 ఆగస్టు 11న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారి పద్ధతిలో అతనే ఆయేషాని హత్య చేసినట్లు ఒప్పించారు. సత్యంబాబుని 2010లో విజయవాడ మహిళా సెషన్స్ స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టగా, అతను వాస్తవం చెప్పాడు. తాను హత్య చేయలేదని, పోలీసులే తనచేత అలా చెప్పించారని కోర్టుకు తెలిపాడు. పోలీసులు ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాల ప్రకారం సత్యంబాబుని నేరస్తునిగా పేర్కొంటూ, మహిళా సెషన్స్ స్పెషల్ కోర్టు అతనికి 14 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అయితే, సత్యంబాబు నేరస్థుడు కాదని, ఓ మాజీ మంత్రి మనవడే అసలు నేరస్థుడని ఆయేషా తల్లి శంషాద్ బేగం తొలి నుంచి మొత్తుకుంటోంది. హాస్టల్ లోని ముగ్గురు అమ్మాయిలు బయటి వ్యక్తులతో ఉండటం చూసినందుకే ఆయేషాని హత్యచేశారని తల్లిదండ్రుల ఆరోపణ. వారి మాటలు వినే పరిస్థితులు లేవు. సత్యంబాబు బంధువులు హైకోర్టుని ఆశ్రయించారు. బొజ్జా తారకం వంటి వారు కోర్టులో సత్యంబాబు తరఫున వాదించారు. 2017, మార్చి 31న హైకోర్టు సత్యంబాబు నిర్ధోషిగా తీర్పు చెప్పింది. ఆయేషాను సత్యంబాబే హత్య చేశారని చెప్పడానికి తగిన ఆధారాలను పోలీసులు చూపలేకపోయారని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. పోలీసులు ఎవరో ఒకరిని నేరస్తునిగా చూపాలన్న దిశగానే దర్యాప్తు చేశారే తప్ప, అసలైన నిందితులను పట్టుకునే ఉద్దేశంతో దర్యాప్తు చేయలేదని హైకోర్టు అభిప్రాయపడింది.
ఆ తర్వాత ఆయేషా మీరా తల్లిదండ్రులు2018 జనవరి 27న హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయమని 2018 నవంబరు 29న హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటికే దిగువ కోర్టులో ఆధారాలు ధ్వంసం చేశారు. హైకోర్టులో కేసు నడుస్తున్న సమయంలో, 2014లోనే విజయవాడ కోర్టులో ఈ కేసు రికార్డులన్నీ ధ్వంసమయ్యాయని సిట్ హైకోర్టుకు తెలిపింది. స్థానిక కోర్టులో ఈ కేసుకు సంబంధించిన రికార్డులు ధ్వంసమయ్యాయని ఆయేషా మీరా తరఫు న్యాయవాదులు ముందే అనుమానం వ్యక్తం చేశారు. వారు అనుమానించినట్లే జరిగింది. సిట్ దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో ఈ కేసుని 2018 డిసెంబరు 16న సీబీఐకి అప్పగించారు. ఆయేషా మృతదేహాన్ని సీబీఐ రీపోస్ట్ మార్టం చేసి, కొత్త ఆధారాలు ఏమీ దొరకలేదని కోర్టుకు తెలపడంతో కోర్టు కేసుని మూసివేసింది.
ఈ నేపథ్యంలో శంషాద్ బేగం వంటి పేద కుటుంబాలకు న్యాయం లభించే అవకాశం లేదా? స్థితిముంతులైతే రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసులు అండతో తప్పించుకోగలుగుతారా? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా వారు ఎలా తప్పించుకోగలిగారు? న్యాయవ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఏం చేయలేకపోయాయా? శంషాద్ బేగం కుటుంబానికి ఏ రకంగానూ న్యాయం దక్కదా? హత్య జరిగిన నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ ఆనంద్ బదిలీ తర్వాత కేసు మొత్తం ఎలా తారుమారైంది? హాస్టల్ వార్డెన్ కోనేరు పద్మ నోరు తెరిస్తే, అయిదు నిమిషాల్లో కేసులోని నిజానిజాలు వెల్లడవుతాయని ఆయేషా తల్లి శంషాద్ బేగం ఆనాడే చెప్పారు. ఆమె చేత పోలీసులు ఎందుకు నిజం చెప్పించలేకపోయారు? హాస్టల్లో కొందరి రాసలీలలు చూసిందనే తన కుమార్తెని హత్య చేశారని శంషాద్ బేగం చెప్పారు. ఆ రాసలీలలు ఎవరి మధ్య జరిగాయో పోలీసులు ఎందుకు కనిపెట్టలేకపోయారు? తెల్లారేపాటికి సాక్ష్యాలను ఎవరు మాయం చేశారు? పోలీసులు తెలుసుకోలేకపోయారా? ఈ కేసుకు సంబంధించిన రికార్డులు కోర్టులోనే ఎవరు ధ్వంసం చేశారు? ఎందుకు చేశారు? అంతటి తీవ్రమైన నేరాన్ని చేసినవారిని ఇంకా కనుగొనలేదా? వారిని తెలుసుకుని శిక్షించరా? సత్యంబాబు చేయని నేరానికి 8 ఏళ్లు శిక్ష అనుభవించి, నిర్దోషిగా విడుదల అయ్యాడు. హైకోర్టు నష్టపరిహారం కింద లక్ష రూపాయలు ఇవ్వమని తీర్పు ఇచ్చింది. సత్యంబాబు అన్యాయంగా 8 ఏళ్లు శిక్ష అనుభవించడానికి బాధ్యులు ఎవరు? సత్యంబాబు చేయని నేరం అంగీకరించే విధంగా పోలీసులు ఎందుకు చేశారు? అలా చేసిన వారికి శిక్ష ఏమీ లేదా? 8 ఏళ్ల జైలు శిక్షకు నష్ట పరిహారం లక్ష రూపాయలు ఇవ్వమని హైకోర్టు ఆదేశించింది. ఇది న్యాయమేనా? అతను అన్యాయంగా శిక్ష అనుభవించినందుకు, జైల్లో అతను, ఇంటి వద్ద కుటుంబ సభ్యులు అనుభవించిన మనోవేదనకు, బాధలకు, అతని జీవితంలో 8 ఏళ్లు వృధా అయినందుకు, అతనికి నష్టపరిహారం ఇదా? అసలు హంతకులు ఎవరు? ఎందుకు చంపారు? ఈ ప్రశ్నలన్నిటీకీ సమాధానాలు లేవు. హత్య మిస్టరీగానే మిగిలింది. ఈ కేసులో న్యాయం జరగలేదని అందరికీ తెలుసు. అసలు హంతకులను కనిపెట్టలేని దయనీయ స్థితిలో మన వ్యవస్థలు ఉన్నాయా?. లేదా ఆ దోషులు తమకు అనుకూలంగా వాడుకునే స్థితిలో వ్యవస్థలు ఉన్నాయా?. చివరిగా ‘‘ఈ నెల 27న తమ కుమార్తె శరీర భాగాలతో పాటు సత్యం, న్యాయం, ధర్మాన్ని కూడా పూడ్చిపెట్టబోతున్నాం’’ అని ఆయేషా మీరా తల్లిదండ్రులు ఎంతో బాధతో చెప్పారు. న్యాయం కోసం పోరాడి, వేసారిపోయిన తల్లిదండ్రులు ఆయేషా మీరా పేరుతో ఒక విద్యా సంస్థని నెలకొల్పమని, ఇటువంటి బాధితులకు సహాయపడే విధంగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఆ పని చేస్తుందని ఆశిద్ధాం.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

Feb 22, 2026

మంగళగిరిలో చేనేత కులాల గర్జన

నేడు మహా ప్రదర్శన, భారీ బహిరంగ సభ


దేశంలో వ్యవసాయ తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించే చేనేత రంగం నేడు దయనీయ పరిస్థితుల్లో ఉంది. ప్రభుత్వ హామీలు సరైన రీతిలో అమలు కాకపోవడంతో రాష్ట్రంలోని చేనేత కార్మికుల సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చేనేత సంఘాలన్నీ ఏకమై ‘చలో మంగళగిరి’ పిలుపును ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరిలో ‘చేనేత గర్జన’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నాయి. సమస్త చేనేత కులాల వారు ఏకంకండి అని పిలుపునిచ్చాయి. తమ సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాలన్న సంకల్పంతో చేనేత కార్మికులు మంగళగిరిలోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నుంచి ఎన్ఆర్ఐ ఆస్పత్రి సమీపంలోని వై జంక్షన్ వద్ద చేనేత సర్కిల్ వరకు మహా ప్రదర్శన నిర్వహించి, అక్కడే పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ ‘చేనేత గర్జన’ విజయవంతం చేసేందుకు వివిధ చేనేత సంఘాల నేతలు నెల రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వివిధ చేనేత కులాలకు చెందిన చేనేత కార్మికులను ఏకం చేశారు. ఉద్యమబాట పట్టించారు. ప్రభుత్వాల మాటలు కాగితాలకే పరిమితమవుతున్నాయని, కార్యాచరణకు నోచుకోవడంలేదన్నది వారి బాధ. శాసనసభల్లో తమకు తగిన ప్రాధాన్యత లేదన్నది వారి ఆవేదన.
రాష్ట్రంలో తరతరాలుగా చేనేత వృత్తిపైనే జీవించే కులాలు అనేకం ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి పద్మశాలి, దేవాంగ, జాండ్ర, పట్టుసాలి, తొగటవీరక్షత్రియ, స్వకులశాలి, కుర్హీనసెట్టి (కుర్ణి)(నెస్సి), సేనాపతులు, కైకాల, కర్ణభక్తులు,కరికాల భక్తులు, సాధనాసూరులు, బావసార క్షత్రియ, ఖత్రి, నీలి, నీలకంఠి, కోస్టి, ముదలియార్ మొత్తం 18 చేనేత కులాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఇవి అంత్యంత వెనుకబడిన కులాల(ఎంబీసీ) జాబితాలో ఉన్నాయి. ప్రభుత్వ వద్ద అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 1,77,447 మంది చేనేత కార్మికులు ఉన్నారు. ప్రస్తుతం మూడు లక్షల మంది ప్రత్యక్షంగా, 8 లక్షల మంది పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు.ఎంతో ప్రాధాన్యత కలిగిన ఇన్ని చేనేత కులాల నుంచి శాసనసభలో కదిరి నుంచి కందికుంట వెంకట ప్రసాద్, శాసనమండలిలో విజయవాడ నుంచి పంచుమర్తి అనురాధ ఇద్దరు మాత్రమే ఉన్నారు.
రాజకీయ ప్రాధాన్యత అలా ఉంటే, వృత్తిపరంగా చేనేతకు సంబంధించిన నూలు, సిల్క్, రంగులు, రసాయనాలు ముడిసరుకులు వంటి వాటి ధరలు, చేనేత ఉత్పత్తులు, అమ్మకాలు, ఎగుమతులు, పన్నులు, సబ్జిడీలు, ఇతర సౌకర్యాల వంటి అనేక సమస్యలు ఉన్నాయి. చేనేతకు సరైన మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల, చేనేత సహకార సంఘాల నిర్వహణా లోపాల వల్ల చేనేత కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యలను ఆచరణాత్మకంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం వల్ల చేనేత కార్మికుల సమస్యలు రోజురోజుకు పేరుకుపోతున్నాయి. సమస్యల పరిష్కారం దిశగా కూడా అడుగులు పడటంలేదన్నది వారి ఆరోపణ. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అర్హులు అందరికీ ఇవ్వాలన్నది వారి డిమాండ్. నేతన్న నేస్తం పథకం ద్వారా ఒక్కో కుటుంబంలో ఒక చేనేత కళాకారుడుకి ఏడాదికి రూ.25 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, సొంత ఇల్లు లేక, ఇల్లు ఉన్నా మగ్గం పట్టే స్థలం లేక మాస్టర్ వీవర్‌కు చెందిన షెడ్లలో నేత నేసే నిజమైన పేద చేనేత కళాకారులకు కూడా నేతన్న నేస్తం పథకం వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ప్రభుత్వానికి, మంత్రులకు, అధికారులకు చేనేత కార్మికుని బతుకు చిత్రం తెలియకపోవడం వల్ల కూడా వారి సమస్యలు పరిష్కారం కావడంలేదన్న భావన ఉంది. రాష్ట్రంలోని చేనేత కార్మికుల స్థితిగతులను, వృత్తిపరంగా వారు ఎదుర్కునే సమస్యలను ప్రభుత్వానికి అర్థమయ్యేరీతిలో వివరించగల గల నేతలు ఎదిగి, శాసనసభలకు ఎన్నిక కావలసి ఉంది. చేనేత వర్గాల నుంచి, చేనేత రంగంపై సంపూర్ణ అవగాహన ఉన్న నేతలు మాచాని సోమప్ప, ప్రగడ కోటయ్య, పుచ్చల సత్యనారాయణ, కుండా రామయ్య, అగిశం వీరప్ప, దామర్ల రమాకాంతరావు, గోలి వీరాంజనేయులు వంటివారు మరణించిన తరువాత ఈ రంగం నుంచి రాజకీయంగా నాయకత్వం లోపం కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. వారికి చేనేత సమస్యలపై పూర్తి అవగాహన ఉండేది. అందువల్ల వారి హయాంలో ఈ రంగానికి ఎంతో మేలు జరిగింది. ఆ తరువాత ఈ కులాల వారు రాజకీయంగా బలహీనమవడం వల్ల చేనేత రంగానికి తీవ్ర నష్టం జరుగుతూ వస్తోంది.
చేనేత వర్గాల వారు దాదాపు 65 లక్షల మంది, అంటే రాష్ట్ర జనాభాలో 12 శాతం మంది ఉన్నా ఒక్క మంత్రి పదవి కూడా లేదు. చేనేత మంత్రిత్వ శాఖ ఈ వృత్తి గురించి తెలియని, మరో కులం వారు నిర్వహించడం వల్ల వారికి చేనేత సమస్యలపై అవగాహన ఉండదు. నేరుగా చేనేత రంగంతో సంబంధం ఉన్న, చేనేత వృత్తి, ఆ రంగంలోని సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నవారు శాసనసభలో, మంత్రి మండలిలో ఉండవలసిన అవసరం ఉంది.
రాజకీయపరమైన, వృత్తి పరమైన అన్ని సమస్యలను ఎలుగెత్తి చాటేందుకు ఈ చేనేత గర్జన నిర్వహించనున్నారు.
‘చేనేత గర్జన’ డిమాండ్లు
1. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల వార్షిక బడ్జెట్ల కేటాయింపుల్లో చేనేతకు న్యాయం చేయాలి.
2.జౌళి పరిశ్రమకు అనుకూల, చేనేత వ్యతిరేక విధానాలలో మార్పు రావాలి.
3.ప్రభుత్వాలు చేనేత పరిశ్రమ రక్షణకు, కార్మికుల జీవనానికీ, మనుగడకూ తోడ్పడే నిర్ణయాలు తీసుకోవాలి.
4.చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేయాలి.
5. కేంద్ర బడ్జెట్‌లో చేనేత రంగానికి రూ.25 వేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో రూ.2 వేల కోట్లు కేటాయించాలి.
6. చేనేత కార్మికులతోపాటు చేనేత ఉప వృత్తులు చేసుకునే కార్మికులందరికీ ప్రతి సంవత్సరం రూ.25వేల ఆర్థిక సహాయం అందించాలి.
7. అర్హులైన అందరికీ పెన్షన్ మంజూరు చేయాలి.
8. సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించవలసిన రూ.203 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
9. చేనేత సహకార సంగా రుణాలు రద్దు చేయాలి.
10.చిలప నూలు, పట్టు, రంగులు, రసాయనాలను సబ్సిడీ రేట్లకు సప్లై చేయాలి.
11. ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలను నెరవేర్చాలి.
12. నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను ప్రభుత్వాలు కొనుగోలు చేయాలి.
13. ప్రకృతి వైపరీత్యాల సందర్భాల్లో నేత కార్మికులకు రూ.10 వేల ఆర్థిక సహకారం అందించాలి.
14.ఆత్మహత్యలు, ఆకలి చావులతో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.
15. 200 యూనిట్ల వరకూ విద్యుత్‌ను ఉచితంగా అందించే పథకాన్ని వెంటనే అమలుపరచాలి.
16. కేంద్ర ప్రభుత్వం హ్యాండ్లూమ్ బోర్డును పునరుద్ధరించాలి.
17. చేనేత సహకార సంఘాల పాలక వర్గాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలి.
18. అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి మూడు సెంట్లు భూమి ఇచ్చి, అందులో వర్క్‌ షెడ్లను ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలి.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

Feb 18, 2026

ప్రశ్నించే పాత్రికేయమే సత్యాన్వేషణ

బండారు రాధాకృష్ణ వ్యాసాలపై సమీక్ష


జర్నలిస్ట్ కు సామాజిక స్పృహ ఉండాలి. దానికి నూరు శాతం న్యాయం చేశారు ప్రముఖ నటుడు, విద్యావేత్త, సీనియర్ జర్నలిస్ట్ బండారు రాధాకృష్ణ. వృత్తి ధర్మానికి కట్టుబడిన వ్యక్తి. 86 ఏళ్ల వయసులో కూడా సామాజిక చైతన్యంతో విధంగా వివిధ పత్రికలకు వ్యాసాలు రాయడంతోపాటు విశాలాంధ్ర దినపత్రికలో ప్రతి శుక్రవారం ‘వివేచన’ పేరుతో ఓ కాలం కూడా నిర్వహిస్తున్నారు. వయసు మీదపడుతున్నా, సడలని దృఢత్వంతో, సామాజిక బాధ్యతతో, ముఢనమ్మకాలకు వ్యతిరేకంగా, యువతని మేల్కొలిపే విధంగా ఎంతో చురుకుగా తన రచనలు కొనసాగిస్తున్నారు. చిన్నప్పటి నుంచి వామపక్ష భావాలు పుణికిపుచ్చుకున్న రాధాకృష్ణ మంచి నటుడు. 50కి పైగా నాటకాలలో నటించారు. లంబాడీ రాందాసు అనే నాటకాన్ని ఆటపాటి లక్ష్మి హీరోయిన్ గా 50 చోట్ల ప్రదర్శించారు. 26 ఏళ్లకుపైగా ఈనాడు విలేకరిగా పనిచేసిన రాధాకృష్ణ 65 ఏళ్ల క్రితమే ఇంజనీరింగ్ చదివి, సింగరేణి కాలరీస్ లో ఉద్యోగం చేశారు. ఆ సమయంలోనే కమ్మూనిస్టు కార్మిక సంఘాలతో కలిసి పనిచేశారు. అప్పటి నుంచే కమ్మూనిస్టు నేతలతో పరిచయాలు. కమ్యూనిస్టు భావజాలంతో ఎరుపెక్కిన ఆయన కలానికి ఇప్పటికీ పవర్ తగ్గలేదు. యువకుడిగా ఉన్నప్పుడు ఎలా రాసేవారో, ఇప్పుడు కూడా అదే స్ఫూర్తి, అదే స్పందన, అదే రాత. అదే ఆయన ప్రత్యేకత. 2020 నుంచి 2025 వరకు ఆయన రాసిన 50 వ్యాసాల సంపుటిని ఇటీవల విజయవాడలో ఆవిష్కరించారు. పాఠకులను ఆకట్టుకునే విధంగా, సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో తన వ్యాసాలను బావా బావా అనుకునే రెండు పాత్రలతో మొదలు పెట్టి సమకాలీన సమాజంలో జరిగే, జరుగుతున్న అనేక అంశాల లోతులకు వెళతారు. మనిషికి తలెత్తే అనేక ప్రశ్నలు ‘సత్యాన్వేషణ’లో ఉన్నాయి. 172 పేజీల ఈ వ్యాస సంపుటిలో పలు ప్రశ్నలకు సమాధానాలు కూడా ఉన్నాయి.
గుడి-బడి అనే వ్యాసంలో ఈ సమాజంలోని మనుషులకు గుడులమీద ఉన్న శ్రద్ధ బడులపై లేకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించి, యువత ఆలోచనను వ్యవసాయంవైపు మళ్లించాలన్నది ఆయన ఆకాంక్ష. శివం శవం అనే వ్యాసంలో తాము సృష్టించిన దేవుడే అంతా చేస్తారన్న భావనను మనుషులందరిలోకి మత పెద్దలు చొప్పించారని, దాంతో, తాము నిమిత్తమాత్రులం, నిస్సహాయులం అన్న దోరణిలో మనుషులున్నారన్న బాధ వ్యక్తం చేశారు. తనకు తెలియనివాడు మరణించినా, ఆ మృతదేహం వద్దకు వెళ్లి చూస్తే చాలు, ఇంటికి వెళ్లి స్నానం చేసే స్థితిలో మనిషి ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేస్తారు. తత్వం లక్ష్యం సత్యాన్వేషణ అని, మతం లక్ష్యం అసత్యంపై విశ్వాసం కలిగి ఉండటం అని తెలిపారు. మనిషిని మతానికి బానిసగా మారుస్తున్న వ్యవస్థపై రచయితలు అక్షరాన్ని సంధించాలని పిలుపు ఇచ్చారు రాధాకృష్ణ.
ఒకప్పుడు ఆంగ్లేయులను తరిమికొట్టిన అక్షరం, నేడు రాజకీయ నాయకుల చేతిలో నలిగిపోతుంది, కాదు ఉరితీయబడుతోందని ఆవేశంగా చెప్పారు. మరో వ్యాసంలో అక్షరం ఆయుధం కన్నా గొప్పదని, కోట్ల మందిని చైతన్యపరుస్తుందని, ప్రభుత్వాలను సైతం పడగొడుతుందన్నారు. కళలన్నిటిలోకి దృశ్య కావ్యం మనిషి మనసుని తాకి, మార్పుకు నాంది పలుకుతుందని ఇంకో వ్యాసంలో చెప్పారు. ఇందులో నాటక రంగ చరిత్రని సంక్షిప్తీకరించారు. ప్రశ్నించకపోతే నిజం బయటపడదు. కానీ, నేడు ప్రశ్నించిన మనిషి జైలులో ఉంటున్నాడని చెప్పారు. సామాజిక స్పృహతో సమాజం కోసం నినదించిన, 90శాతం వైకల్యం ఉన్న
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా జైలులోనే మగ్గిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పౌరహక్కులు హరించుకుపోతుంటే, నిద్రపోతున్న మానవాళిని మేల్కొలపవలసిన అగత్యం ఏర్పడిందన్న బాధ్య వ్యక్తం చేశారు.
ప్రపంచంలో అత్యంత దుర్మార్గమైన మనుస్మృతిని అంబేద్కర్ బహిరంగంగా దహనం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. యువత ఆలోచించకుండా, గుడ్డిగా నాయకులను అనుసరించడమే దేశ అభివృద్ధి మందగమనానికి కారణం అని తేల్చిచెప్పారు. 80 శాతం మంది పార్లమెంట్ సభ్యులు కుబేరులుగా ఉన్న మన దేశం ప్రజాస్వామ్యం దేశం కాదని, ధనిక స్వామ్యదేశం అని పేర్కొన్నారు.
కమ్యూనిస్టు ఉద్ధండులైన పుచ్చలపల్లి సుందరయ్య, ఏకె గోపాలన్, నంబూద్రిపాద్, జ్యోతిబసు, ప్రమోద్ దాస్ గుప్త, రణదివే, పి.రామమూర్తిలతోపాటు రావిపూడి వెంకటాద్రి, కొంగర జగ్గయ్య, రామోజీరావు, ఎన్టీ రామారావు... వంటి వారి పరిచయం, విరసంతో అనుబంధం కలిగి ఉండటంతో ఆయన అనుభవాల సారాంశం ఈ వ్యాసాలలో కనిపిస్తాయి. అది ఇదనేమీలేదు, జీవితానికి, సమాజానికి సంబంధించిన అన్ని అంశాలపై ఆయన వ్యాసాలు రాశారు. ప్రాథమికంగా మనిషి ఆలోచనా విధానంలో మార్పు రావాలన్న తపన రాధాకృష్ణ వ్యాసాలలో కనిపిస్తుంది.
సత్యాన్వేషణ పుస్తకం వెల : రూ.160
పుస్తకాల కోసం సెల్: 9390686100
పుస్తక సమీక్ష : శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

Jan 25, 2026

30న తెలంగాణ బార్ కౌన్సిల్‌ సభ్యుల ఎన్నిక

ఎన్నుకోబడవలసిన సభ్యుల సంఖ్య: 23


ఓటర్లకు సూచనలు

1. ఒకే బదిలీ ఓటు పద్ధతి ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థ ప్రకారం ఇరవై మూడు మంది సభ్యులను ఎన్నుకోవాలి. ఇరవై మూడు మంది సభ్యులలో, కనీసం పన్నెండు మంది సభ్యులు రాష్ట్ర రోల్‌లో న్యాయవాదులుగా కనీసం 10 సంవత్సరాల ప్రాక్టీస్ చేసిన వారై ఉండాలి. బ్యాలెట్ పేపర్‌పై ఉన్న [*] గుర్తు, ఆ అభ్యర్థులు 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం రాష్ట్ర రోల్‌లో ఉన్నారని సూచిస్తుంది.


2. ఓటరుకు బ్యాలెట్ పేపర్ అందిన వెంటనే, అతను/ఆమె పోలింగ్ అధికారి వద్ద ఉన్న ఓటర్ల జాబితాలో సంతకం చేసి, వెంటనే పోలింగ్ బూత్‌లోకి వెళ్లి, ఎవరూ చూడకుండా రహస్యంగా తన ప్రాధాన్యతను నమోదు చేయాలి.


3. తెలంగాణ బార్ కౌన్సిల్ లేదా సంబంధిత బార్ అసోసియేషన్లు జారీ చేసిన అసలు గుర్తింపు కార్డును చూపించిన తర్వాతే ఓటరుకు బ్యాలెట్ పేపర్ ఇవ్వబడుతుంది.


4. ఓటర్లు పోలింగ్ బూత్‌లోకి ఎలాంటి సెల్ ఫోన్లు లేదా కెమెరాలను తీసుకురాకూడదు మరియు ఏదైనా ఓటరు అటువంటి పరికరాలను తీసుకువస్తే, వారు వాటిని పోలింగ్ అధికారి వద్ద డిపాజిట్ చేసి, ఓటు వేసిన తర్వాత తిరిగి తీసుకోవాలి.


5. ఓటరు ఎలాంటి దుష్ప్రవర్తన, నకిలీ వేషధారణ లేదా హింసకు పాల్పడకూడదు, పాల్పడితే చట్ట ప్రకారం చర్య తీసుకోబడుతుంది.


6. ఓటరు తన ఓటు వేసేటప్పుడు: -


(ఎ) ఒక ఓటరు తన మొదటి ప్రాధాన్యత అభ్యర్థికి ఓటు వేయాలనుకుంటే; అతను/ఆమె బ్యాలెట్ పేపర్‌లోని అదే కాలమ్‌లో అభ్యర్థి పేరుకు ఎదురుగా పెన్‌తో "ఒకటి" అని అక్షరాలలో రాయాలి. అదేవిధంగా, రెండవ ప్రాధాన్యత అభ్యర్థి పేరుకు ఎదురుగా "రెండు" అని అక్షరాలలో రాయాలి. మూడవ ప్రాధాన్యత అభ్యర్థికి ఎదురుగా "మూడు" అని అక్షరాలలో రాయాలి.


నాల్గవ ప్రాధాన్యత అభ్యర్థికి ఎదురుగా "నాలుగు" అని అక్షరాలలో మరియు ఐదవ ప్రాధాన్యత అభ్యర్థికి ఎదురుగా పైన పేర్కొన్న విధంగా "ఐదు" అని అక్షరాలలో రాయాలి.

(సి) ప్రతి ఓటరు బ్యాలెట్ పత్రంలో తప్పనిసరిగా కనీసం (5) ప్రాధాన్యతలను ఉపయోగించాలి, అలా చేయని పక్షంలో ఓటు చెల్లనిదిగా పరిగణించబడుతుంది.


(డి) ఓటరు కేటాయించిన బూత్‌కు వెళ్లి, బ్యాలెట్ పత్రాన్ని తెరిచి, పోలింగ్ బూత్‌లోని టేబుల్‌పై ఉంచి, పోలింగ్ బూత్‌లో అందుబాటులో ఉన్న పెన్‌తో పదాలలో వ్రాస్తూ, కనీసం "1 నుండి 5" వరకు మరియు గరిష్టంగా 23 వరకు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాలి.


(ఇ) బ్యాలెట్ పత్రంపై ప్రాధాన్యతలను నమోదు చేసిన తర్వాత, పోలింగ్ అధికారి చూపించిన విధంగా ఓటరు దానిని మడవాలి.


(ఎఫ్) బ్యాలెట్ పత్రాన్ని మడవడం పూర్తి చేసిన తర్వాత, ఓటరు బ్యాలెట్ పెట్టె వద్దకు వెళ్లి పోలింగ్ అధికారి లేదా అతని అధీకృత వ్యక్తి సమక్షంలో బ్యాలెట్ పత్రాన్ని పెట్టెలో వేయాలి.


(జి) బ్యాలెట్ పత్రంలో కనీసం 5 ప్రాధాన్యతల గుర్తులు లేకపోతే, అటువంటి బ్యాలెట్ పత్రం చెల్లనిదిగా పరిగణించబడుతుంది మరియు చెల్లుబాటు అయ్యే ఓట్ల లెక్కింపులో చేర్చబడదు.


7. పోలింగ్ కేంద్రంలో ఇద్దరి కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నట్లయితే, వారు క్యూలో నిలబడాలి.


8. ఓటరు "ఒకటి" "రెండు" "మూడు" "నాలుగు" "ఐదు" మొదలైన పదాలకు బదులుగా 1, 2, 3, 4, 5 వంటి సంఖ్యలను వ్రాస్తే బ్యాలెట్ పత్రం చెల్లనిదిగా పరిగణించబడుతుంది.


9. బ్యాలెట్ పత్రంపై సంతకం చేయకూడదు, ఎలాంటి గుర్తింపు గుర్తులు లేదా ఇతర గీతలు లేదా గుర్తులు, చెరిపివేతలు, తుడిచివేతలు లేదా మార్పులు చేయకూడదు, అలా చేస్తే బ్యాలెట్ పత్రం పాడైపోయినట్లుగా పరిగణించబడుతుంది మరియు దాని ద్వారా వేసినట్లుగా భావించే ఏ ఓటు కూడా ఎన్నికల ప్రయోజనం కోసం పరిగణనలోకి తీసుకోబడదు.


హైదరాబాద్. తేదీ: 12.01.2026.

సంతకం

(డాక్టర్ గురుగుబెల్లి యతిరాజులు)

రిటర్నింగ్ అధికారి

సాహిత్యంలో రజా హుస్సేన్ రికార్డ్

ఫేస్ బుక్‌ వేదికగా కాఫీ విత్... పేరుతో 3331 ఎపిసోడ్స్  ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్  అబ్దుల్ రజా హుస్సేన్ సాహ...