ఆర్టీసీ కార్మికులకు
వేతన సవరణ బకాయిలు చెల్లించాలి
బీసీ సంక్షేమ సంఘం
డిమాండ్
సచివాలయం, ఏప్రిల్ 22: ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన
సవరణ బకాయిలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం డిమాండ్
చేసింది. ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు
సోమవారం మధ్యాహ్నం సచివాలయం 1వ బ్లాక్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ఎల్.వి.సుబ్రహ్మణ్యంకు అందజేశారు. ఆర్టీసీలో 56వేల మంది కార్మికులు అరకొర జీతాలతో
సర్ధుకొని బతుకుతూ ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఆర్టీసీ
అభివృద్ధిలో కార్మికుల కృషిని ప్రశంసించారు. అయితే సంస్థ నుంచి రావలసిన పాత బకాయిలు సకాలంలో అందక కార్మికులు
ఆర్థిక ఇబ్బందులతో నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం నుంచి రావలసిన
బకాయిలు రాకపోవడంతో కార్మికుల వేతన సవరణ బకాయిలు చెల్లించలేమని సంస్థ
పేర్కొన్నట్లు పేర్కొన్నారు. బస్ పాస్ లు తదితర రాయితీలకు సంబంధించి ప్రభుత్వం
నుంచి ఆర్టీసీకి రూ.650 కోట్లు అందవలసి ఉందని తెలిపారు. ఇందులో రూ.350 కోట్లు
ఆర్టీసీకి మంజూరు చేస్తున్నాట్లు గత ఏడాది అక్టోబర్ లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
చేసిందని, అయితే ఆ మొత్తం ఇప్పటి వరకు ఆర్టీసీకి అందలేదన్నారు. గత సంవత్సరం సమ్మె
బాట పడుతున్న కార్మికులకు హామీలు ఇస్తూ 20 శాతం బకాయిలు చెల్లించారని, మిగిలిన 80
శాతం బకాయిలు ఏప్రిల్ లో 40 శాతం, జూలైలో 40 శాతం చెల్లిస్తామని రాతపూర్వకంగా
ఒప్పందం కూడా చేసుకున్నారని వివరించారు. ఇప్పటి వరకు ఆ ఒప్పందం అమలు కాలేదని
తెలిపారు. అటు ప్రభుత్వం నుంచి గానీ, ఇటు ఆర్టీసీ నుంచి గానీ స్పష్టమైన హామీ
ఇవ్వకపోవడంతో కార్మికులు అందోళనకు గురవుతున్నారన్నారు. ఈ విషయంలో స్పందించి
సకాలంలో తగిన చర్యలు తీసుకొని వారికి న్యాయం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ఎల్.వి.సుబ్రహ్మణ్యంని బీసీ సంఘం
అధ్యక్షుడు కేసన శంకరరావు కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసినవారిలో సంఘం
రాష్ట్ర నేతలు తన్నీరు ఆంజనేయులు, కుమ్మర క్రాంతి కుమార్, పరసా రంగనాథ్, దూళిపూడి
ఏసుబాబు, అన్నం శివరాఘవయ్య, నాగలింగం, అంగిరేకుల గోపి తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment