వృద్ధులకు అండగా ప్రభుత్వం
సామాజిక భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత
పట్టణీకరణ, సాంకేతిక, జీవన శైలిలో మార్పులతో మానవసంబంధాలు, కుటుంబ సంబంధాలలో తీవ్రమైన మార్పులు వస్తున్నాయి.కుటుంబ వ్యవస్థకు, ముఖ్యంగా ఉమ్మడి కుటుంబానికి ప్రాధాన్యత తగ్గిపోతోంది.దాంతో రానురాను వృద్ధుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ముఖ్యంగా ఏ ఆధారంలేని వృద్ధుల జీవనం దుర్భరమైంది. ఈ పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధులకు ప్రతి నెలా ఇచ్చే పెన్షన్ ను రూ.1000ల నుంచి ఒక్కసారిగా రెట్టింపు చేసి రూ.2వేలకు పెంచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పండుగ రోజు ఈ ప్రకటన చేయడంతో పండుటాకుల కళ్లలో ఆనందం తాండవించింది. వారి కళ్లలో నిజమైన పండుగ కళ కనిపించింది. చివరిదశలో వివిధ కారణాల వల్ల కుటుంబ సభ్యులు సరిగా చూసిచూడక, గ్రామాలలో ఒక్కరినే వదిలివేసి పట్టణాలకు వెళ్లడం, ఆర్థికంగా ఏమాత్రం ఆధారంలేని వారికి కావలసింది ఆ కాస్త భరోసానే. ఎన్టీఆర్ హయాంలో కడుపు నిండా అన్నం తినని పేదలు ఉన్నారని తెలుసుకొని కిలో రూ.2 లకు బియ్యం పథకం ప్రవేశపెట్టారు. ఆయన ప్రవేశపెట్టినవాటిలో ఇప్పటికీ అత్యంత ప్రజాధరణ పొందిన పథకం అదే. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం కిలో రూపాయికి తగ్గించినా ఇప్పటికీ జనంలో అది అన్న పథకంగానే గుర్తింపు పొందింది. బియ్యం పథకం అంటే ఆంధ్రులకు అన్నే గుర్తుకు వస్తారు. ఆయన ఆలోచనలు, ఆయన భావాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ఈ పెన్షన్ పథకానికి ‘ఎన్టీఆర్ భరోసా’ అని పేరు పెట్టింది. గతంలో రూ.200లు మాత్రమే ఇచ్చే పెన్షన్ ను 2014 అక్టోబర్ 2 నుంచి ‘ఎన్టీఆర్ భరోసా’ పేరుతో రూ.1000లకు పెంచింది. ఈ పథకాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పేదరిక నిర్మూలన సంస్థ నిర్వహిస్తోంది. మళ్లీ ఇప్పుడు దానిని రూ.2వేలకు పెంచారు. నెల మధ్యలో పెన్షన్ రెట్టింపు ప్రకటించినప్పటికీ జనవరి నెల నుంచే ఇది అమలవుతుంది. ఈ నెలలో ఇప్పటికే లబ్దిదారులు పెన్షన్ అందుకున్నారు.అందువల్ల ఈ నెలకు మిగిలిన రూ.1000లు, ఫిబ్రవరి నెల పెన్షన్ రూ.2వేలు కలిపి మొత్తం రూ.3వేలు వచ్చే నెలలో లబ్దిదారులకు అందజేస్తారు. ఆ తరువాత ప్రతి నెల రూ.2వేలు అందజేస్తారు. దివ్వాంగులకు, హిజ్రాలకు ఇచ్చే పెన్షన్ ను రూ.1500ల నుంచి రూ.3వేలకు పెంచారు. రెండు చేతులు లేని, సంపాదనకు ఎటువంటి అవకాశంలేని దివ్యాంగులకు నెలకు రూ.10 వేలు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 22,46,947 మంది వృద్ధులు, 19,07,307 మంది వితంతువులు, 6,18,699 మంది దివ్యాంగులు, 95,415 మంది చేనేత కార్మికులు, 22,701 మంది కల్లు గీత కార్మికులు, 32,070 మంది కళాకారులు, 1645 మంది హిజ్రాలు, 39,967 మంది మత్స్యకారులు, 88,202 మంది ఒంటరి మహిళలు,దయాలసిస్ రోగులు ప్రభుత్వ ఆస్పత్రులలో చికిత్స పొందేవారు 3,373 మంది,అనుమతి పొందిన ఆస్పత్రులలో చికిత్స పొందేవారు 4,671 మంది సామాజిక భద్రత పెన్షన్లు అందుకుంటున్నారు. మొత్తం 50,61,906 మందికి ప్రభుత్వం 10రకాల పెన్షన్లు అందజేస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 5,54,934 మంది, అతి తక్కువగా విజయనగరం జిల్లాలో 2,84,045 మంది ఉన్నారు. పెన్షన్ అందుకునేవారిలో ఎయిడ్స్ రోగులు కూడా ఉన్నారు. 2018 డిసెంబర్ నెలలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 50,62,008 మందికి పెన్షన్ రూపంలో రూ.560,79,49,000 అందజేసింది. 2019 జనవరి 17వ తేదీ వరకు 46,59,530 మంది లబ్దిదారులకు రూ.514,33,76,500 అందజేసింది. ఇటీవల జరిగిన జన్మభూమి గ్రామసభలలో సామాజిక భద్రత పెన్షన్ కోసం దాదాపు 1.5లక్షల మంది దరకాస్తు చేసుకున్నారు. వాటిని కూడా పరిశీలించి అర్హులకు పెన్షన్ మంజూరు చేసే అవకాశం ఉంది. వృద్ధులకు భద్రత, భరోసా కల్పించడం అభినందనీయం.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914
No comments:
Post a Comment