గృహ నిర్మాణం, కేటాయింపులపై
ప్రభుత్వం
ప్రత్యేక దృష్టి
Ø జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు
Ø బ్యాంకర్లపై పెంచిన వత్తిడి
Ø నిర్మాణాలలో పెంచిన వేగం
Ø ఫిబ్రవరి 9న 4 లక్షల
గృహప్రవేశాలు
పేదలకు సొంత ఇల్లు అనేది ఓ
కల. అది ఓ జీవితాశయం.అటువంటిదానిని
వాస్తవంలో నిజం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టి పట్టుదలతో కృషి చేస్తోంది. రాష్ట్రంలో
ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. ఆ
దిశగా చాలా పెద్ద ప్రాజెక్ట్ చేపట్టింది. దానిని ఓ పవిత్ర యజ్ఞంలా
భావించింది. షీర్ వాల్ టెక్నాలజీతో
శరవేగంగా నిర్మాణాలు కొనసాగిస్తూ దేశానికే ఆదర్శంగా
నిలిచింది. రూ.80 వేల కోట్ల అంచనా వ్యయంతో 20లక్షల
ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. 2022 నాటికి పేదలందరికీ ఇళ్లు
సమకూర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ,గ్రామీణ గృహ నిర్మాణ పథకాలు, పీఎంఏవై-ఎన్టీఆర్
కాలనీలు(అపార్ట్ మెంట్లు) వంటి
వివిధ పథకాల కింద మొత్తం 19,57,429 ఇళ్లు నిర్మించాలని
నిర్ణయించారు. అవసరమైతే మరో 5 లక్షల ఇళ్లు నిర్మించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రస్తుతానికి13,61,252 మంజూరు చేశారు. వీటిలో 11,51,465 పనులు ప్రారంభించారు. 2018 డిశంబర్ 29 నాటికి 7,20,113 ఇళ్ల నిర్మాణం పూర్తి
అయింది. పీఎంఏవై-ఎన్టీఆర్
నగర్(ఏహెచ్పీ) పథకం
కింద5,29,786 ఇళ్లు మంజూరు చేశారు. వాటిలో 3,60,365 ఇళ్ల నిర్మాణం
ప్రారంభించారు. 1,42,061 ఇళ్లకు శ్లాబుల నిర్మాణం
పూర్తయింది. 75,284 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఎన్టీఆర్ పట్టణ గృహనిర్మాణం (బీఎల్సీ) కింద 4,28,444 ఇళ్లు మంజూరు చేశారు. 1,11,613 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. 73,752 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. పట్టణ ప్రాంతంలో ఫిబ్రవరి
నెలాఖరుకు లక్షా 75 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి
చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్ధేశించింది. పట్టణాలలో పీఎంఆర్ వై-ఎన్టీఆర్
ఇళ్లను టిడ్కో(ఆంధ్రప్రదేశ్ టౌన్ షిప్
అండ్ ఎన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్) నిర్మిస్తోంది. ఇళ్లు, అపార్ట్ మెంట్ల నిర్మాణం, బ్యాంకులు రుణాలు మంజూరు
ప్రక్రియ, జిల్లా
స్థాయి, మునిసిపల్
స్థాయి ఎంపిక కమిటీల లబ్దిదారుల ఎంపిక వంటి విషయాలలో ఎక్కడ జాప్యం జరుగుతుందో
తెలుసుకొని త్వరితగతిన లబ్దిదారులకు ఇళ్లు కేటాయించే విధంగా ప్రభుత్వం చర్యలు
చేపట్టింది. భూమి, బ్యాంకు రుణాలు, ఇళ్ల కేటాయింపు వంటి
విషయాలలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం
ఆదేశించింది. లబ్దిదారుల ఎంపిక పూర్తి
చేయాలని, పీఎంఏవై
పోర్టల్ లో లబ్దిదారులను పేర్లు పొందుపరచాలని, జిల్లా స్థాయి ఎంపిక కమిటీల
ద్వారా లబ్దిదారులకు ఫ్లాట్లు కేటాయించాలని, భూములకు సంబంధించి పట్టణ, స్థానిక సంస్థలకు అనుకూలంగా
నిర్ణయాలు తీసుకోమని, బ్యాంకు రుణాల అంశంపై
ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్లకు ఇచ్చిన
ఆదేశాల్లో పేర్కొంది. తరచూ ఇళ్ల నిర్మాణ
ప్రదేశాలను తనిఖీ చేసి అక్కడ పని చేసే ఇంజనీర్లకు తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని
ఆదేశించింది. నిర్మాణ పనులు త్వరితగతిన
జరగడానికి, ఇసుక,విద్యుత్, నీటి సరఫరా వంటి సమస్యల
పరిష్కారానికి జిల్లా కలెక్టర్లు ఏపీ టిడ్కో ఇంజనీర్లు, మునిసిపల్ కమిషనర్లు, ప్రజారోగ్య ఇంజనీర్లు,డిస్కమ్, గనుల శాఖ అదికారులతో సమన్వయ
సమావేశాలు నిర్వహిస్తారు. ఈ పథకాలకు సంబంధించి
ఇతరత్రా సమస్యలను కూడా జిల్లా కలెక్టర్లు పరిశీలించి, తగిన చర్యలు తీసుకుని
పరిష్కరిస్తారు. ఇళ్ల నిర్మాణానికి స్థలం
సమకూర్చడంతోపాటు అపార్ట్ మెంట్ల నిర్మాణం, అనుమతులు, విద్యుత్ కనెక్షన్, తాగునీటి సౌకర్యం, రోడ్ల నిర్మాణం, పరిసరాలు పచ్చదనంతో నింపడం, మురుగునీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు
తదితర మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే సమకూరుస్తోంది.
ప్రభుత్వం భూమి, మౌలిక సదుపాయాలు
సమకూర్చడంతోపాటు రూ.3 లక్షల వరకు సబ్సిడీ ఇస్తూ
ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేసినందున బ్యాంకులు సామాజిక బాధ్యతగా
భావించి వేగంగా రుణాలు మంజూరు చేయాలన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. నిర్మాణం
పూర్తి అయిన ఇళ్లకు రుణాలు మంజూరు చేసి లబ్దిదారులకు ఇళ్లను అప్పగించడానికి
ప్రభుత్వం బ్యాంకులపై వత్తిడి పెంచింది. చాలా బ్యాంకులు
నిబంధనలమేరకు రుణాలు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. రుణాల మంజూరును వేగవంతం
చేయడానికి రాష్ట్రంలోని 44 బ్యాంకులు ప్రత్యేకంగా
నోడల్ ఆఫీసర్లను నియమించే అవకాశం ఉంది. ఇప్పటివరకు రుణాలు
ఇచ్చేందుకు ముందుకు రాని బ్యాంకులు తమ విధానాలను వెళ్లడించమని ఆయా బ్యాంకులకు
ప్రభుత్వం సూచించింది. రాష్ట్రంలోని అన్ని
ప్రాంతాలలో ఒకే పద్దతిలో జీ+3విధానంలో మూడు కేటగిరీలుగా
ప్రభుత్వం అపార్ట్ మెంట్లను నిర్మిస్తోంది. 300, 365 చదరపు అడుగుల సింగిల్ బెడ్
రూమ్ ఫ్లాట్లు, 465 చదరపు అడుగుల డబుల్ బెడ్
రూమ్ ఫ్లాట్లు నిర్మిస్తున్నారు.
ఇళ్ల
నిర్మాణంలో వెర్టిఫైడ్ టైల్స్, సెరామిక్ టైల్స్, గ్లేజ్ సెరామిక్ టైల్స్, బ్లాక్ గ్రానైట్, సాల్ ఉడ్ తలుపులు, ప్లాస్టిక్ ఎమల్సన్ పెయింటింగ్ వంటి
వాటిని వాడుతున్నారు. విశాలమైన రోడ్లతో గేటెడ్
కమ్యూనిటి తరహాలో ఇవి ఉంటాయి. నిర్మాణం, కేటాయింపులు,రుణాల ప్రక్రియ వేగవంతం
చేసి లబ్దిదారులకు ఇళ్లను త్వరగా అందించడానికి కావలసిన అన్ని చర్యలను ప్రభుత్వం
తీసుకుంటోంది. ఫిబ్రవరి 9వ
తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 4 లక్షల ఇళ్లలోకి లబ్దిదారులు
గృహప్రవేశం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇళ్ల
నిర్మాణం పూర్తి అయితే బడుగులు కళ్లలో ఆనందం
కనిపిస్తుంది. వారు పూర్తి స్థాయిలో
సంతృప్తి చెందుతారు.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914
No comments:
Post a Comment