Oct 20, 2020

దసరా పాట

ఇది ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు..కానీ వెనకటి తరానికి ఒక మధురానుభూతి.


దసరా వచ్చేసింది కదండి.

నా చిన్నతనంలో దసరా రోజుల్లో అక్కడక్కడా వినిపించేది ఈ దసరా పాట.

 దసరా వచ్చిందంటే ప్రతీ గ్రామంలోనూ గురువులూ వారి వెంట పిల్లలూ ఊరంతా తిరుగుతూ పాడుకునే ఈ మన పాట ఆనాటివారికి గుర్తుకు రావలసినదే...

ఇదే ఆ దసరా పాట

పల్లవి-

1

ఏదయా మీదయ మామీద లేదు!

ఇంతసేపుంచుట ఇది మీకు తగదు!

దసరాకు వస్తిమని విసవిసల బడక!

చేతిలో లేదనక  ఇవ్వలేమనక !

ఇప్పుడు లేదనక అప్పివ్వరనక!

రేపురా మాపురా మళ్ళి రమ్మనక!

శీఘ్రముగ నివ్వరే శ్రీమంతులారా!

జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!

2

పావలా బేడైతె పట్టేది లేదు!

అర్థరూపాయైతె అంటేది లేదు!

ముప్పావలైతేను ముట్టేది లేదు!

రూపాయి ఐతేను చెల్లుబడి కాదు!

హెచ్చు రూపాయైతె పుచ్చుకొంటాము!

జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!

3

అయ్యవారికి చాలు ఐదు వరహాలు!

పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు!

మా పప్పు బెల్లాలు మాకు దయచేసి!

శీఘ్రముగ బంపరే శ్రీమంతులారా!

జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!

దసరా పండుగను గిలకల పండగంటారు. చక్కగా కొత్త దుస్తులు ధరించి  వెదురుతో చేసిన విల్లం బులు, ఎక్కుబెట్టిన విల్లు చివరి భాగాన మిఠాయి పొట్లం ఆకారంలో తయారుచేసి దానిలో "బుక్కా" రంగు పొడీ కొందరైతే పువ్వులూ వేసి ఒండొరులు చల్లుకొంటు, ఆడుకొంటూ, పాడుకొంటూ నడిచే దసరా గీతమిది.

పంతుళ్ళు వెనుక నడుస్తుంటే పిల్లలు వరుస ల్లో పాడుతూ ప్రతి వాకిటా ఆగి దసరా మామూళ్ళు స్వీకరించే ఆత్మీయమైనఆచార మిది.

లోగుట్టు

ఒక వ్యక్తి అభివృద్ధి గాని కుటుంబ, సమాజ, ప్రాంత అభివృద్ధి గాని జ్ఞానము తోటే సాధ్యమని, చదువుతోటే వికాసమని భావించిన ఆ గ్రామములోని పెద్దలు గ్రామం లోని బడి బలంగా ఉండడానికి తమ సహాయాన్ని అందించేవారు.  ప్రభుత్వ బడులు లేని ఎన్నో గ్రామాల్లో తమ స్ధలాలను బడి పెట్ట డానికి నిస్వార్ధంగా దానం ఇచ్చేవారు. వెలుగు తున్న దీపం మరియొక దీపాన్ని వెలిగిస్తుందని నిజాయతీగా నమ్మిన జ్ఞాన మూర్తులు బతక డానికి కాకుండా, బ్రతికించడానికి ఉపాధ్యాయులుగా మారి ఆ గ్రామంలోని పిల్లలను వెలుగు దివ్వెలుగా మార్చేవారు. దసరా పండుగ సందర్భంగా ఆ సంవత్సర కాలంలో తాము విద్యార్ధులకు నేర్పిన పద్యాలు, శ్లోకాలు, గణిత సమస్యలు, పొడుపు కధలు మొదలైనవి గ్రామంలోని పెద్దల అందరి ఎదుట దసరా సెలవులలో కుమార జ్ఞాన ప్రదర్శన కావించేవారు. పిల్లల వయస్సు, తరగతిని బట్టి వివిధ కళలను పిల్లకు నేర్పి తమను పోషిస్తున్న పెద్దలతో చెప్పి మెప్పించి పెద్దలు ఆనందంగా ఇచ్చే కానుకలను పొందేవారు. ఇదే కదా నిజమైన పరీక్ష ఉపాధ్యాయులకు  విద్యార్ధులకు  ఎంత గొప్ప ఆంతర్యమో ఆనాటి దసరా పాటల్లో. దేవతా వేషధారులై ఆ చిన్నారులు ఘనమైన పద్యాలు చదువుతూ ఆశ్శీస్సులు అందిస్తే ముగ్దులైన ఆ ఊరి పెద్దలు ఆ బడి ఇంకా ఇంకా ఎదగాలని తమ ధనాన్ని దసరా కానుకగా అందించేవారు. ఆనాటి పిల్లలు అర్జునునిలా జీవన కురుక్షేత్రంలో విజయులే.అలాంటి ఉపాధ్యాయులు ద్రోణాచార్యులు. ఈ సంప్రదాయం పాటించే అవసరం ఇప్పుడు లేదనుకోండి. దాంతోపాటే ఈ పాటా మూలపడిపోయింది.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...