ఎమిరేట్స్ గ్రూప్
ప్రధాన కార్యాలయంలో ఆ గ్రూప్ చైర్మన్ షేక్ అహ్మద్ బీన్ సయీద్ అల్ మక్దూమ్తో సీఎం
సమావేశమయ్యారు. ఆ గ్రూప్ రాష్ట్రంలో అడుగుపెట్టేందుకు ఆసక్తి కనబరుస్తోంది. ఎయిర్
క్రాఫ్ట్ తయారీ, విమానాల ఇంటీరియర్, డ్యూరబుల్స్ తయారీ కేంద్రాలను
రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ఎమిరేట్స్ గ్రూపు ముందుకొచ్చింది. ఏవియేషన్ శిక్షణ
కోసం ఒక అకాడమీని సైతం నెలకొల్పనుంది. దీంతో పాటు మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్హాల్
(ఎమ్ఆర్ఆర్) సదుపాయాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సీఎం సమక్షంలో ఆంధ్రప్రదేశ్
ఆర్థిక అభివృద్ధి సంస్థ( ఏపీఈడీబీ)తో ఎమిరేట్స్ గ్రూపు అవగాహన ఒప్పందం
కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం ఎమిరేట్స్ గ్రూపు, ఏపీఈడీబీ
కలిసి వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేస్తాయి. ఏరోస్పేస్ సంబంధిత మౌలిక సదుపాయాలు,
తయారీ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, వాటిల్లో ‘ఎమిరేట్స్’ పెట్టుబడులు
పెట్టేందుకు గల అవకాశాలను ఈ వర్కింగ్ గ్రూపులు పరిశీలిస్తాయి. అలాగే ప్రపంచ
ప్రమాణాలకు అనుగుణంగా ఏపీలో నైపుణ్యాభివృద్ధి, సామర్థ్యం
పెంపులోనూ ‘ఎమిరేట్స్’, ఏపీఈడీబీ
సంయుక్తంగా కలిసి పనిచేస్తాయి. ఈ ఒప్పందం వాస్తవరూపం దాల్చితే రాష్ట్రానికి
కొత్తగా రూ. 30 వేల కోట్ల మేర పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం లభిస్తుంది. దుబాయ్
ఎయిర్పోర్టు ఫ్రీ జోన్ అథారిటీ డైరెక్టర్ జనరల్, దుబాయ్
సిలికాన్ ఒయాసిస్ అథారిటీ వైస్ చైర్మన్, దుబాయ్
ఎయిరో స్పేస్ డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ అహ్మద్ అల్ ఝరూనీతో కూడా సీఎం సమావేశమయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ స్థాయి ఎయిరోసిటీ ఏర్పాటు సన్నాహాల్లో వున్నామని, ఇందుకోసం
సౌదీ అరేబియా పెట్టుబడిదారులతో కలిసి పనిచేస్తున్నామని ఝురానీ వెల్లడించారు.
కేపీఎంజీ సహకారంతో మరో మూడు నెలల్లో దీనిపై సవివర ప్రాజెక్టు నివేదిక సిద్ధం
చేస్తున్నట్లు చెప్పారు. ‘ఎయిర్
బస్’తో
ఒప్పందం కుదుర్చుకున్నామని,
నాసాతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. విశాఖలో జరిగే సీఐఐ-భాగస్వామ్య
సదస్సుకు హాజరవుతానని ఝురానీ మాటివ్వగా, అప్పటికి స్పష్టమైన ప్రతిపాదనలతో
రావాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆరు ఖండాలు, 40 దేశాల్లోని నౌకాశ్రయాల్లో మెరైన్, ఇన్లాండ్ టెర్మినళ్లను కలిగి, సప్లయ్
చైన్ ద్వారా అంతర్జాతీయ వాణిజ్యానికి మార్గం సుగమం చేయండంలో ముఖ్యపాత్ర
పోషిస్తున్న డీపీ వరల్డ్ గ్రూప్ చైర్మన్ సుల్తాన్ బీన్ సులేయమ్, గ్రూపు
డిప్యూటీ ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రాజ్ జిత్ సింగ్ వాలియా, కార్పొరేట్
ఫైనాన్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ ఖన్నాలను సీఎం
కలిసినప్పుడు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు, వివిధ అంశాలలో కలిసి
పనిచేసేందుకు ఏపీ, డీపీ
వరల్డ్ సంయుక్త భాగస్వామ్యంతో కార్యబృందం ఏర్పాటు చేశారు. ఈ బృందంలో ఏపీ ప్రభుత్వ
మౌలిక సదుపాయాల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్జైన్, డీపీవరల్డ్ సీఈవో యువరాజ్ ఉన్నారు.
ఏపీలో తమ సంస్థ కార్యకలాపాల విస్తృతికి వెంటనే ఒక బృందాన్ని పంపించేందుకు సుల్తాన్
అంగీకారం తెలిపారు.
బిజినెస్ లీడర్స్ ఫోరం యూఏఈ ఆధ్వర్యంలో ఏర్పాటైన రోడ్ షోలో
సీఎం పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో
అవకాశాలు- ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాటా మంతీ’ అనే ఇతివృత్తంతో ఏర్పాటైన ఈ రోడ్షోలో
ఆయన మాట్లాడారు. పెట్టుబడులు తెండి. అనుమతులు, వ్యవస్థాపన అంశాలకు తాను భరోసాగా
ఉంటానని, ఆ బాధ్యత తనదని స్పష్టం చేశారు. తమది
అందమైన, ఆహ్లాద
రాష్ట్రం అని, పెట్టుబడులకు చక్కని గమ్యస్థానంగా ఎంచుకోండని పిలుపు
ఇచ్చారు. విశాఖ మహానగరంలో లులూ గ్రూపు ఏర్పాటు చేస్తున్న కన్వెన్షన్ సెంటర్కు
సంబంధించిన నిర్మాణ ఆకృతులు ఆ సంస్థ ప్రతినిధులు సీఎం బృందానికి చూపించారు. విశాఖలో
ఈనెల 26న లులూ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేసే అవకాశం వుంది. ముఖ్యమంత్రి
బృందంలో ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్
పరకాల ప్రభాకర్, సీఎం
ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, మౌలికవసతుల శాఖ ముఖ్య కార్యదర్శి
అజయ్ జైన్, ఏపీఈడీబీ
సీఈఓ జాస్తి కృష్ణ కిషోర్ ఉన్నారు. యుఏఈలో భారత రాయబారి నవదీప్ సూరి కూడా ఈ బృందం
వెంట ఉన్నారు.
-శిరందాసు నాగార్జున, సీనియర్
జర్నలిస్ట్- 9440222914
No comments:
Post a Comment