‘ఎదురీత’ పుస్తక సమీక్ష
ఎవరు ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే అద్భుతమైన కవిత్వం రాయగల దిట్ట ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత్వంలో స్పష్టత ఉంటుంది. ఆయన కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ. తెలుగు భాషలోని పదాలతో ఆడుకుంటారు. సరళమైన భాషలో చక్కటి అర్థం వచ్చే విధంగా కవిత్వం రాస్తారు. మూడు దశాబ్దాలుగా ఆధునిక భావాలతో, సామాజిక స్పృహతో అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని ప్రజా చైతన్యం కోసం ఎదురీదుతున్నారు. మధు గతంలో భారతీయ ధర్మ విశ్లేషణ(2003), నవశకం(2006), రైతు సమరభేరి(2020,2021), గమనం(2021), సంఘర్షణ (2023)అనే అయిదు కవితా సంకలనాలు అందించారు. పుస్తకాలకు కాలం చెల్లిందనుకుంటున్న రోజుల్లో 2020లో వచ్చిన ఆయన ‘రైతు సమరభేరి’ కవితా సంపుటి 2021లో రెండవ ముద్రణ కూడా జరిగింది. అంటే, ఆయన కవిత్వంలో ఎంత పట్టు, పవర్ ఉందో అర్థమవుతోంది. మధు ఆరవ కవితా సంకలనం ‘ఎదురీత’ని మంగళగిరి సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో ఇటీవలే మంగళగిరిలో ఈ సంకలనం ముద్రణ దాత ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు ఆవిష్కరించారు.
ఈ కవితా సంపుటిలోని 55 కవితలలో విభిన్న పార్శ్వాలను స్పర్శించారు. చదవడం మొదలుపెడితే, చివరి వరకు పుస్తకం మూయలేరు. పాఠకులను అంతగా కట్టిపడేశాలా ఈ కవితలు ఉన్నాయి. మధుకు జీవితం పట్ల, కవిత్వం పట్ల స్పష్టత ఉండటంతో ఆయన రాసే కవిత్వం పాఠకుల మనసుకు సూటిగా తగులుతుంది. ప్రజల పక్షం, బాధితుల పక్షం నిలిచిన కవి. మధు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా, ప్రభుత్వాలపైనే తిరుగుబాటు కవిత్వం రాయగల ధైర్యవంతుడు, ధీశాలి. మధు కవిత్వం ఎంత మక్కువతో రాస్తారో, ఉద్యోగం కూడా అంతే నిజాయితీ, నిబద్ధత, అంకితభావంతో చేస్తారు. తన భావాలు చక్కటి భాషతో సూటిగా చెప్పగల సత్తా ఉన్న కవి. ఈ సంకలనం మొదటి పేజీలో భారత రాజ్యాంగ ప్రవేశికకు స్థానం కల్పించారంటే, భారతీయ పౌరుడుగా మధు ఎంత బాధ్యతగా ఉంటారో తెలుస్తోంది. గుడి కప్పులు ధగ ధగ మెరుస్తుంటే - బడి కప్పులు పెచ్చులూడి పడుతున్నాయి... గుళ్ల మీద చూపించిన శ్రద్ధ మనం బడులమీద చూపించడంలేదన్న బాధ వ్యక్తం చేశారు మధు. ఈ కవిత చదువుతుంటే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నటి, నిర్మాత మంచు లక్ష్మి గుర్తుకు వస్తారు. ‘‘కట్టాల్సింది దేవాలయాలు, చర్చిలు, మసీదులు కాదు... విద్యాలయాలు, వైద్య శాలలు’’ అని రామ్ గోపాల్ వర్మ అన్నారు. మంచు లక్ష్మి తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో పది, పది ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నారు. అత్యధిక మంది దాతలు అలా ముందుకు వచ్చి బడులను బాగుచేయాలన్నదే మధు కోరిక.
తమ పెంపుడు కుక్క ‘మిలో’ మరణించినప్పుడు మధు రాసిన 8 పేజీల కవిత పాఠకుల కంట తడిపెట్టిస్తోంది. పెంపుడు కుక్కలతో ఆ ఇంటి వారి అనుబంధం, వాటి చేష్టలు, అల్లరి, అరుపులు, చూపులు, ప్రేమ, వాటి ప్రవర్తనా తీరు..., వాటిపై ఇంట్లో వారు చూపించే ప్రేమ, అవి మరణించినప్పుడు వారు పడే బాధ... చాలా అద్బుతంగా రాశారు. దానిని అందరూ చదివి తీరవలసిందే. ముఖ్యంగా జంతు ప్రేమికులకు, కుక్కలను పెంచుకునేవారి మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది. అలాగే, కల్తీ కల్తీ కల్తీ - ఇందుగలదందులేదన్న కల్తీ... అని మనిషి జీవితంలో అడుగడుగునా జరిగే కల్తీల గురించి ‘సమాధి’ అనే కవిత అద్భుతంగా రాశారు. సజావుగా సాగే జీవితం తలక్రిందులైతే, కాలానికి ఎదురీది, తనని, తన చెల్లిని పెంచిన తీరు ద్వారా అమ్మ గోలి పార్వతీ దేవే తన ఎదురీతకు స్ఫూర్తి అని చెప్పడంలోనే మధు సంస్కారం తెలుస్తోంది. మంగళగిరి లయన్స్ క్లబ్ అధ్యక్షురాలిగా ప్రజాసేవలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన దివంగత నన్నపనేని లక్ష్మికి ఈ పుస్తకం అంకితం ఇవ్వడం ద్వారా ఆయన మహిళలకు ఇచ్చే గౌరవం అర్థమవుతోంది. మరో కవితలో ప్రశ్నించడం మరిచామని ప్రశ్నార్థకమయ్యావా ప్రజాస్వామ్యమా!.. అని అంటారు. గొంతు మెదపక ప్రశ్నించక, ప్రతిధ్వనించక కలహించక కూర్చుంటే - నువ్వు మాయం నేను మాయం!!... అని హెచ్చరిస్తారు. తడి గుడ్డతో గొంతులు తెగుతుంటాయి-తడి గుడ్డ వేసుకుని వేడుక చూస్తున్నంత కాలం... అని మరో హెచ్చరిక చేశారు. అంతేకాకుండా, తడిగుడ్డ తొలగించి-కళ్లు తెరిచి - కన్నెర్ర చేద్దాం రారండి!! అని పిలుపు ఇచ్చారు. అదే మధు ప్రత్యేకత. ఒకటికి మరొకటి జత చేరనిదే ఒకటి లేనేలేదు - పరుగు పందెంలో ఒకటో స్థానానికి రెండు కాళ్లు..., మనిషి మనిషికీ మతం మత్తు-సందు సందుకీ కులం కిక్కు..., పీడితుల నడుమ ఐక్యత సాధించనంతవరకూ పీడకునిదే గెలుపు.... ఇలా సాగుతుంది మధు కవిత్వం.
‘ఎదురీత’ పుస్తకం వెల : రూ.150
కవి గోలి మధు సెల్: 9989186883
ప్రతులకు : 9848199098
సమీక్షకులు : శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914

No comments:
Post a Comment