Sep 4, 2025

మానవ అక్రమరవాణా నిరోధించడంలో విఫలం


మానవ అక్రమ రవాణా, వ్యభిచారం ద్వారా ఆంధ్రప్రదేశ్‌  రాష్ట్రంలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. మానవ అక్రమ రవాణా విషయంలో ఆడ, మగ తేడాలేదు. అయితే, ఆడపిల్లలే అధికంగా ఉన్నారని సమాచారం. బాలికలను, మహిళలను వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారు.  అవయవాల కోసం కూడా  మానవ అక్రమ రవాణా జరుగుతోంది. రాష్ట్రంలో మ‌హిళా సెక్స్ వ‌ర్క‌ర్లు గణనీయంగా ఉన్నారు. ఓ పక్క అక్రమ రవాణా, మరోపక్క ఆర్థిక పరిస్థితుల వల్ల సెక్స్ వర్కర్ల సంఖ్య పెరుగుతోంది. ఇది చాలా ఆందోళన కరమైన అంశం. ఒక నివేదిక ప్రకారం 2021లో 1,33,447 మంది మహిళా సెక్స్ వర్కర్లతో రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా, 2024లో 1,19,367 మందితో రెండవ స్థానంలో ఉంది.  మానవ అక్రమరవాణా, వ్యభిచారం నిరోధించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఈ అంశాన్ని ప్రభుత్వాలు ఏవీ తీవ్రంగా పరిగణిస్తుట్లు కనిపించడంలేదు. ఇందుకోసం రాష్ట్రంలో ఓ పటిష్టవంతమైన వ్యవస్థలేదు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో మానవ అక్రమరవాణా నిరోధక యూనిట్స్ (యాంటీ హ్యుమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌-ఏహెచ్‌టీయూ)లను ఏర్పాటు చేశారు. వాటికి పోలీస్ స్టేషన్ హోదా కల్పించారు. అయితే, ఇప్పటి వరకు ఏ ఒక్క యూనిట్‌లో  ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నేరుగా  నమోదు చేయలేదు. స్థానిక పోలీస్ స్టేషన్‌లు తమ వద్ద ఉన్న పిల్లలు, యువతుల మిస్సింగ్, అక్రమ రవాణా కేసులు ఈ మానవ అక్రమరవాణా నిరోధక యూనిట్స్‌కు  బదిలీ చేయవలసి ఉంది. ఆ కేసులను ఏహెచ్‌టీయూలు స్వతంత్రంగా దర్యాప్తు  చేపట్టాలి, కానీ  వాస్తవ పరిస్థితుల్లో  అలా జరగడం లేదు. దాంతో  ఆ కేసులు విచారణ నీరుగారి పోతోంది. గత 5 ఏళ్ళుగా  కనీసం 10 శాతం మంది నిందితులకు కూడా  శిక్షలు పడలేదు.

 శారీరక దోపిడీ లేదా లైంగిక దోపిడీ, బానిసత్వం, దాస్యం లేదా అవయవాలను బలవంతంగా తొలగించడం, పిల్లలు, మానవ అక్రమ రవాణా ముప్పును ఎదుర్కోవడానికి  భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 370, 370A ఉన్నాయి. లైంగిక వేధింపులు, దోపిడీ నుండి పిల్లలను రక్షించడానికి  లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ-పోక్సో (పీఓసీఎస్ఓ) చట్టం చేశారు. బాలికలు, మహిళలను అమ్మడం, కొనడం, స్త్రీలు, పిల్లల అక్రమ రవాణాకు సంబంధించి భారతీయ శిక్షాస్మృతిలో   నిర్దిష్ట చట్టాలు అనేకం ఉన్నాయి. రాష్ట్రం కూడా  వారి రక్షణకు GOMs.No.1 (2003), GOMs.No.28 (2012), GOMs.No.43 (2015 ) జారీ చేసింది.  ఇన్ని చట్టాలు, జీఓలు ఉన్నప్పటికీ ఫలితంలేదు. వాటిని  అమలు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతోంది. బాధిత బాలికలకు, మహిళలకు  తగిన రీతిలో  పునరావాసం, పరిహారం లభించడంలేదు. 2016 నుండి 2022 వరకు ఆంధ్రప్రదేశ్‌లో 2,460 మందిని అక్రమ రవాణా, వ్యభిచార గృహాల నుంచి రక్షించారు. వారిలో పది శాతం మందికి కూడా పునరావాస సహాయం లభించలేదు. దీని వలన వారు తిరిగి లైంగిక దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉంది. అక్రమ రవాణాదారులకు శిక్ష విధించే రేటు 8 శాతం మించిలేదు. వీరికి అందాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏవీ అందలేదు.  పునరావాస కార్యక్రమాలు, నష్టపరిహారం అందించడంలో ఆ నాటి రాష్ట్ర ప్రభుత్వం  విఫలమైంది. ముఖ్యంగా నల్సా (నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ) వారు  2015లో రూపొందించిన పథకం ప్రకారం నరక కూపాల నుంచి విముక్తి పొందిన  ప్రతి మహిళకు లేదా బాలికకు లక్ష రూపాయల నుంచి రూ.8 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా, జీవో ఎంఎస్ నెంబర్ 28 ప్రకారం  విముక్తి పొందిన బాధితులకు రూ.20 వేలు తక్షణ ఆర్థిక సహాయం అందజేయాలి. కానీ, విముక్తి పొందినవారిలో ఐదు శాతం మందికి మించి ఆర్థిక సహాయం అందలేదు.
బాధితులకు  రక్షణ కరువైంది.  బాధితుల పిల్లలు వివక్షకు గురవడం మరో తీవ్రమైన అంశం. ఇది బాధిత మహిళలకు అయిన గాయాలను ఇంకా తీవ్ర చేస్తోంది. సెక్స్ వర్కర్లను అనధికారిక కార్మికులుగా పరిగణించి, వారికి అందించే అన్ని సంక్షేమ పథకాలు వీరికి కూడా వర్తింపచేయాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆ ఆదేశాలు అమలు కావడంలేదు. న్యాయ వ్యవస్థ కూడా ఈ బాధిత మహిళలు, బాలికల రక్షణ, వారి పునరావాసం, ఉపాధి... వంటి విషయాలలో ప్రత్యేక దృష్టి సారించవలసి ఉంది.  సెక్స్ వర్కర్లను, వ్యభిచార గృహాలు, అక్రమ రవాణా నుంచి రక్షించబడినవారి సంక్షేమం కోసం అక్రమ రవాణా బాధిత మహిళల రాష్ట్ర సమాఖ్య ‘విముక్తి’, హెచ్ఈఎల్‌పీ(సొసైటీ ఫర్ హెల్ప్ ఎంటైర్ లోయర్ అంద్ రూరల్ పీపుల్)వంటి స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నాయి. బాధిత మహిళల తరఫున పోరాటం చేస్తున్నాయి.  అయినా, ప్రభుత్వాల నుంచి తగినంత స్థాయిలో స్పందన రాకపోవడం బాధాకరం.  విముక్తి పొందిన బాలికలు, యువతుల సంక్షేమంపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిపెట్టవలసి ఉంది. వారికి న్యాయం, గౌరవం, ఉపాధి,  ఆర్థిక భద్రత కల్పించడం వంటి అంశాల విషయమై  ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవలసి ఉంది.    వ్యభిచారం, అక్రమ రవాణా నుండి బయటపడేవారికి ప్రత్యామ్నాయ జీవనోపాధిని కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం  ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించాలి. దానిని పటిష్టవంతంగా అమలు చేయాలి. వారు మళ్లీ గౌరప్రదంగా సమాజంలో బతికే వెసులుబాటు కల్పించాలి.  వ్యభిచారం, అక్రమ రవాణా నుండి బయటపడిన వారికి  రక్షణ, సంక్షేమం, నష్ట పరిహారం కోసం సింగిల్ విండో విధానం ద్వారా వారు ప్రయోజనాలు పొందేందుకు  రాష్ట్ర ప్రభుత్వం తగిన  చర్యలు తీసుకోవలసి ఉంది. అక్రమ రవాణాలో బయటపడిన వారిని నేరస్థుల వలే  షెల్టర్ హోమ్‌లలో సంవత్సరాల పాటు నిర్బంధంలో ఉంచడం భావ్యంకాదు.  అందుకు ప్రత్యామ్నయంగా కమ్యూనిటీ-ఆధారిత పునరావాసం కోసం సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయవలసి ఉంది. తద్వారా వారు సమాజంలో కలిసిపోయి జీవించేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ రవాణా బాధిత మహిళలు కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, సహాయక సేవల సమీక్ష, పర్యవేక్షణ, వాటి అమలు కోసం ఏర్పాటు చేసే కమిటీలలో  సెక్స్ వర్కర్లు, అక్రమ రవాణా నుండి బయటపడిన వారికి ప్రాతినిధ్యం కల్పించవలసి ఉంది. బాధితులు తమ హక్కులు తిరిగి పొందేందుకు, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు స్పష్టమైన, పటిష్టమైన విధానాలు, సంస్కరణలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని అన్ని విధాల ఆదుకోవలసిన అవసరం ఉంది.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Sep 3, 2025

సీనియర్ జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ విధానం కోసం తీర్మానం

విజయవాడ: ఆగస్టు 19 నుండి 21 వరకు సీనియర్ జర్నలిస్ట్ ఫోరం కేరళ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మహాసభల్లో సీనియర్ జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతూ తీర్మానించినట్లు ఏపీ వెటరన్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ టి. జనార్ధన్,ఉపాధ్యక్షులు ఎస్. అజాద్, కోశాధికారి ఎం.వి. రామారావు, సంయుక్త కార్యదర్శి పి. భుజంగ రావులు పేర్కొన్నారు. మంగళవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో  జరిగిన విలేకర్ల సమావేశంలో కేరళలో జరిగిన సీనియర్ జర్నలిస్ట్ ఫోరం జాతీయ మహాసభలో చేసిన తీర్మానాలను, రాష్ట్ర కార్యవర్గ నిర్ణయాలను మీడియాకు వివరించారు. 


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 21 రాష్ట్రాల  నుండి 250 మంది, సీనియర్ జర్నలిస్టులు ప్రథమ జాతీయ మహాసభకు విచ్చేసారని, ప్రారంభ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, ముగింపు సమావేశానికి ప్రతిపక్ష నేత సతీషన్, గోవా మాజీ గవర్నర్ పిళ్ళై హాజరై మహాసభ విజయాన్ని కాంక్షించారని పేర్కొన్నారు.  ఈ సభలో ప్రధానంగా దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలలో  వెటరన్స్ కు పెన్షన్ అందిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నెలకు రు.20,000 తో జాతీయ పెన్షన్

విధానం ఉండాలని మహాసభ తీర్మానించినట్టు తెలిపారు. కరోనా సమయంలో ఉపసంహరించిన రైల్వే పాసులను  పునరుద్ధరించాలని మహాసభ డిమాండ్ చేయడం జరిగిందన్నారు.  దక్షిణ భారతదేశంలో ఆంధ్ర,తెలంగాణలో మాత్రమే వెటరన్స్ కు  ఎలాంటి పెన్షన్ సౌకర్యం లేదని, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరడం జరిగిందన్నారు.  జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ను,గతంలో లాగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రతి జర్నలిస్టు కుటుంబానికి వైద్యం,
ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమలుకు దోహదపడాలని మహా సభ నిర్ణయించిందన్నారు.  హెల్త్ ఇన్సూరెన్స్ ను రు.5 లక్షలకు పెంచి ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నిమ్స్ తరహాలో మన రాష్ట్రంలోని సిమ్స్, రిమ్స్, ఎయిమ్స్ లాంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో కూడా జర్నలిస్టులకు, కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం కల్పించాలన్నారు.

మధ్యప్రదేశ్ తరహాలో   వెటరన్స్ కు పర్మినెంట్ అక్రిడిటేషన్ సౌకర్యం కల్పించాలన్నారు., కర్ణాటక తరహాలో అన్ని బస్సుల్లో ( ఎసితోసహా) ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు.  రాష్ట్ర హెడ్ క్వార్టర్ లో లాగా జిల్లా స్థాయి జర్నలిస్టులకు కూడా స్టేట్ అక్రిడిటేషన్ మంజూరు చేయాలని కోరడం జరిగిందన్నారు. కేరళ మహా సభలో రాష్ట్రం నుండి. యం. వి.రామారావు, హెచ్.ఆజాద్,,యం. నరేంద్ర రెడ్డి, ఎస్.నాగార్జున రావు,, జాతీయ సమితి సభ్యులు గా, డా. టి. జనార్దన్, జాతీయ ఉపాధ్యక్షులు గా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్ర కార్యవర్గం వారిని అభినందించింది.

సమాచార శాఖ సంచాలకులకు వినతి

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్ష్ శుక్ల ఐఏఎస్ కి, అడిషనల్ డైరెక్టర్ ఎల్. స్వర్ణలత కి ఏ.పి. వెటరన్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు వినతిపత్రం అందజేసారు. కార్యక్రమం లో ఏ.పి. వెటరన్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డా. టి. జనార్దన్, గౌరవ అధ్యక్షులు నాగార్జున, ఉపాధ్యక్షులు ఎస్. అజాద్,ఎం. నరేంద్ర రెడ్డి, కోశాధికారి ఎం.వి. రామారావు, సంయుక్త కార్యదర్శి పి. భుజంగ రావు, తదితరులు పాల్గొన్నారు.

ఏపీవీజేయూ గౌరవాధ్యక్షునిగా శిరందాసు నాగార్జున

విజయవాడ: ఏపీ వెటరన్ జర్నలిస్టుల యూనియన్ గౌరవాధ్యక్షులుగా గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ శిరందాసు నాగార్జున రావుని ఎంపిక చేసినట్లు యూనియన్ అధ్యక్షుడు  డాక్టర్ టి. జనార్దన్, ప్రధాన కార్యదర్శి  జి. చంద్రశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ సిద్ధార్ధ నగర్‌లో సోమవారం జరిగిన వెటరన్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్రస్థాయి కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వారు వివరించారు. యూనియన్  రిజిస్ట్రేషన్ ప్రక్రియను మన యూనియన్ ఉపాధ్యక్షులు వెంకటరత్నం సారధ్యంలో ఈనెల 30లోగా పూర్తి చేయాలని రాష్ట్ర కార్యవర్గం తీర్మానించింది. ఈ ప్రక్రియలో ఆయనకు అందరూ సహకరించాలని కమిటీ నిర్ణయించింది. యూనియన్ కార్యవర్గంలోకి  గౌరవ అధ్యక్షులుగా శిరందాసు నాగార్జున రావు (మంగళగిరి) సహాయ కార్యదర్శులుగా పి.భుజంగ రావు (ధర్మవరం) ఆర్.రాజశేఖర్ (విజయవాడ)లను  తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. జర్నలిస్టులుగా 20 ఏళ్లు పూర్తి అయి, తగిన ఆధారాలు కలిగి ఉండి, 58 ఏళ్లు నిండిన వారు, తాజాగా అక్రెడిటేషన్ కలిగినవారిని సభ్యులుగా చేర్చుకోవాలని నిర్ణయించారు. సభ్యత్వ రుసుము రూ.500గా, ప్రతి ఏడాది రెన్యూవల్ కోసం రూ.100 చెల్లించాలని నిర్ణయించారు. యూనియన్‌లో  221 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే, వారిలో  130 మంది మాత్రమే సభ్యత్వ రుసుం  చెల్లించారు. మిగతా 91 మంది ఈనెల 15లోగా సభ్యత్వ రుసుంతో పాటు, దరఖాస్తును విజయవాడలోని మన కోశాధికారి రామారావు(7286964554)కి పంపాలని తెలిపారు. లేనిచో జాబితా నుండి పేర్లు  తొలగించాలని కార్యవర్గం నిర్ణయించింది. మన సభ్యుల ప్రవర్తన గౌరవప్రదంగా హుందాగా  ఉండాలని, అలా లేని పక్షంలో, ఎవరిపైనైనా  ఫిర్యాదులు అందితే, వారిపై క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు  చేసేందుకు ముగ్గురితో కమిటీ ఏర్పాటు ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులుగా ఎంవీ.రామారావు(విజయవాడ), హెచ్.ఆజాద్(అనంతపురం), వేగి రామ చంద్రరావు(విశాఖపట్నం)లుగా ఉంటారు.58 ఏళ్లు నిండి, వెటరన్ జర్నలిస్టులుగా అక్రెడిటేషన్ కలిగిన వారు కొత్త సభ్యులుగా చేరమని కమిటీ పిలుపు ఇచ్చింది.

మానవ అక్రమరవాణా నిరోధించడంలో విఫలం

మానవ అక్రమ రవాణా, వ్యభిచారం ద్వారా ఆంధ్రప్రదేశ్‌  రాష్ట్రంలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. మానవ అక్రమ రవాణా విషయంలో ఆడ, మగ తేడాలే...