ఈ ముసలోడికి 68 ఏళ్ల వయసులో ఈ ప్రేమ కవిత్వం ఏమిటని లోకులు ఆడిపోసుకుంటారన్న ఆలోచన, కించిత్తు భయం ప్రముఖ సాహితీవేత్త, విమర్శకుడు, కవి అబ్దుల్ రజా హుస్సేన్కు ఉన్నాయి. అయినా, అది ప్రేమ కవిత్వం. దానిని ఆపడం ఎవరికీ సాధ్యంకాదు. చివరకు ఎప్పుడూ ప్రేమ కవిత్వం జోలికి వెళ్లని రజా హుస్సేన్కు కూడా సాధ్యం కాలేదు. ఈ వయసులో మనసులో ఉన్న ప్రేమంతా ఒక్కసారిగా తన్నుకొచ్చింది. అతనిలోని గాఢమైన ప్రేమికుడు బయటపడ్డాడు. పైగా ‘‘ ఉష్! నేను ప్రేమలో వున్నా చప్పుడు చేయకండి.!!’’అని కోరుకోవడంతోపాటు ‘‘కళ్లముందెప్పుడూ ‘ఆమె’ రూపమే. నిద్రలో, మెలకువలో, అంతెందుకు? ఊపిరిలో కూడా ‘ఆమే’.’’ అని స్పష్టంగా చెప్పేశారు. తెలుగు సాహిత్యంలో మాస్టర్ డిగ్రీ చేయడంతోపాటు ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ఔపాసన పట్టిన రజా హుస్సేన్ ‘ఆమె’పై ప్రేమతో చక్కటి భాష, భావంతో ఈ ప్రేమ కవిత్వం అద్భుతంగా రాశారు.‘‘ప్రేమ అనేది అంతులేని రహస్యం, ఎందుకంటే దానిని వివరించగల సహేతుకమైన కారణం లేదు ’’ అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారు. ‘‘అందాన్ని ఆస్వాదించు, కావాలని కోరుకోకు’’ అన్నాడు కవీంద్రుడు. ‘‘నా ప్రేమ కవిత్వం లౌకిక వాసనలంటనిది. అలౌకికమైంది’’ అని రజా హుస్సేన్ అన్నారంటే దాదాపు కవీంద్రుని ధోరణిలోని ఈ కవిత్వం సాగిందని నాకు అనిపించింది. ‘‘ప్రేమంటే ఇదీ అని ఇదమిద్ధంగా చెప్పడం కష్టమే. పరిమళాన్ని కళ్లకు చూపడం ఎంత కష్టమో, ప్రేమని చూపడమూ అంతే కష్టం.’’అని తేల్చి చెప్పి ప్రేమకు సలాంచేసి గులామైపోయారు రజా హుస్సేన్. అంటే, అంతగా ప్రేమలో మునిగిపోయాడు. చూసినకొద్దీ చూడాలనిపించేదే ప్రేమ ఎమో?..కరుకుదనం, బాధ లేని గాయాలు..నడిచే నీ పాదాల అడుగుల సడి శ్రవణానందమే...గుప్పుమంటున్న పాదముద్రల పరిమళం.. ఉలిక్కిపడి నిద్రలేస్తే ఎదురుగా నీ రూపం... రాచపుండు వంటి ప్రేమకు మందు ప్రేమించడమే...ప్రేమంటే లౌకిక వాసనలకు అందనిది...ఆమె కోసం కన్నీటితో దీపం వెలిగించడం...దాగుడు మూతల ప్రేమ... కోయిల పాట-నిశ్శబ్దం-నువ్వున్నప్పుడు -లేనప్పుడు...ఆ అందాన్ని కొలిచే కలమానం నా హృదయమే సుమా!...మనసు విలువ తెలియాలంటే మనసుండాలి..... అని ‘ఆమె’ కవిత్వం సాగింది. ఈర్ష్యా ద్వేషాలు, కులమతాల కొట్లాటలు, కుతకుత ఉడికిపోతున్న సంక్షోభం... వంటి వాటికి దూరంగా కాస్తంత ఉపశమనం, ప్రశాంతత కోసం ప్రేమవైపు పరుగులు తీశారు. ప్రేమ లోతులకు వెళ్లారు. ఆస్వాదించి అలౌకికానందం పొందారు. జీవితంలో ‘ఆమె’తో పెనవేసుకున్న ప్రేమ జ్ఞాపకాలు, అనుభవించడం, ఆనందించడం, ప్రేమలోని సౌందర్యం, మాధుర్యం, ప్రేమ భావన, బాధలు, వెదలు, వేదనలు ....... అంతా రజా హుస్సేన్ అనుభవించి మనకు ‘ఆమె’ కవిత్వ రూపంలో అందించారు. అయినా, ఆయన ప్రేమ దాహం తీరలేదు. ‘‘56 అక్షరాలతో ఏకరువుపెట్టినా నీ మీద ప్రేమ వర్ణించలేను!!’’ అన్నది ఆయన భావన. దిష్టి తగిలి తమ ప్రేమ ఒట్టిపోయిందన్నది ఆయన బాధ. ప్రతి కవితకి తగిన విధంగా తన ఊహా సుందరి లేదా ఉంది, లేదని చెప్పిన ‘ఆమె’ అందమైన ఫొటోలను అద్భుతంగా అద్దారు. అక్కడ కూడా అలౌకిక ప్రేమతో ‘ఆమె’ను అన్ని రూపాలలో, భంగిమలలో చూపడం విశేషం.
‘ఆమె’ పుస్తకం వెల:రూ.100
కాపీలకు : 9063167117









