Sep 22, 2025

‘ఆమె’ప్రేమలో రజా హుస్సేన్


ఈ ముసలోడికి 68 ఏళ్ల వయసులో ఈ ప్రేమ కవిత్వం ఏమిటని లోకులు ఆడిపోసుకుంటారన్న ఆలోచన, కించిత్తు భయం ప్రముఖ సాహితీవేత్త, విమర్శకుడు, కవి అబ్దుల్  రజా హుస్సేన్‌కు ఉన్నాయి. అయినా, అది ప్రేమ కవిత్వం. దానిని ఆపడం ఎవరికీ సాధ్యంకాదు. చివరకు ఎప్పుడూ ప్రేమ కవిత్వం జోలికి వెళ్లని రజా హుస్సేన్‌కు కూడా సాధ్యం కాలేదు. ఈ వయసులో మనసులో ఉన్న ప్రేమంతా ఒక్కసారిగా తన్నుకొచ్చింది. అతనిలోని గాఢమైన ప్రేమికుడు బయటపడ్డాడు. పైగా ‘‘ ఉష్! నేను ప్రేమలో వున్నా చప్పుడు చేయకండి.!!’’అని కోరుకోవడంతోపాటు  ‘‘కళ్లముందెప్పుడూ ‘ఆమె’ రూపమే. నిద్రలో, మెలకువలో, అంతెందుకు? ఊపిరిలో కూడా ‘ఆమే’.’’ అని స్పష్టంగా చెప్పేశారు.    తెలుగు సాహిత్యంలో మాస్టర్ డిగ్రీ చేయడంతోపాటు ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ఔపాసన పట్టిన రజా హుస్సేన్ ‘ఆమె’పై ప్రేమతో చక్కటి భాష, భావంతో ఈ ప్రేమ కవిత్వం అద్భుతంగా రాశారు.

‘‘ప్రేమ అనేది అంతులేని రహస్యం, ఎందుకంటే దానిని వివరించగల సహేతుకమైన కారణం లేదు ’’ అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారు. ‘‘అందాన్ని ఆస్వాదించు, కావాలని కోరుకోకు’’ అన్నాడు కవీంద్రుడు. ‘‘నా ప్రేమ కవిత్వం లౌకిక వాసనలంటనిది. అలౌకికమైంది’’ అని రజా హుస్సేన్ అన్నారంటే దాదాపు కవీంద్రుని ధోరణిలోని ఈ కవిత్వం సాగిందని నాకు అనిపించింది. ‘‘ప్రేమంటే ఇదీ అని ఇదమిద్ధంగా చెప్పడం కష్టమే. పరిమళాన్ని కళ్లకు చూపడం ఎంత కష్టమో, ప్రేమని చూపడమూ అంతే కష్టం.’’అని తేల్చి చెప్పి ప్రేమకు సలాంచేసి గులామైపోయారు రజా హుస్సేన్. అంటే, అంతగా ప్రేమలో మునిగిపోయాడు. చూసినకొద్దీ చూడాలనిపించేదే ప్రేమ ఎమో?..కరుకుదనం, బాధ లేని గాయాలు..నడిచే నీ పాదాల అడుగుల సడి శ్రవణానందమే...గుప్పుమంటున్న పాదముద్రల పరిమళం.. ఉలిక్కిపడి నిద్రలేస్తే ఎదురుగా నీ రూపం... రాచపుండు వంటి ప్రేమకు మందు ప్రేమించడమే...ప్రేమంటే లౌకిక వాసనలకు అందనిది...ఆమె కోసం కన్నీటితో దీపం వెలిగించడం...దాగుడు మూతల ప్రేమ... కోయిల పాట-నిశ్శబ్దం-నువ్వున్నప్పుడు -లేనప్పుడు...ఆ అందాన్ని కొలిచే కలమానం నా హృదయమే సుమా!...మనసు విలువ తెలియాలంటే మనసుండాలి..... అని ‘ఆమె’ కవిత్వం సాగింది. ఈర్ష్యా ద్వేషాలు, కులమతాల కొట్లాటలు, కుతకుత ఉడికిపోతున్న సంక్షోభం... వంటి వాటికి దూరంగా కాస్తంత ఉపశమనం, ప్రశాంతత కోసం ప్రేమవైపు పరుగులు తీశారు. ప్రేమ లోతులకు వెళ్లారు. ఆస్వాదించి అలౌకికానందం పొందారు. జీవితంలో ‘ఆమె’తో పెనవేసుకున్న ప్రేమ జ్ఞాపకాలు, అనుభవించడం, ఆనందించడం, ప్రేమలోని సౌందర్యం, మాధుర్యం, ప్రేమ భావన, బాధలు, వెదలు, వేదనలు ....... అంతా రజా హుస్సేన్ అనుభవించి మనకు ‘ఆమె’ కవిత్వ రూపంలో అందించారు. అయినా, ఆయన ప్రేమ దాహం తీరలేదు. ‘‘56 అక్షరాలతో ఏకరువుపెట్టినా నీ మీద ప్రేమ వర్ణించలేను!!’’ అన్నది ఆయన భావన. దిష్టి తగిలి తమ ప్రేమ ఒట్టిపోయిందన్నది ఆయన బాధ. ప్రతి కవితకి తగిన విధంగా తన ఊహా సుందరి లేదా ఉంది, లేదని చెప్పిన  ‘ఆమె’ అందమైన ఫొటోలను అద్భుతంగా అద్దారు. అక్కడ కూడా  అలౌకిక ప్రేమతో ‘ఆమె’ను అన్ని రూపాలలో, భంగిమలలో  చూపడం విశేషం.

‘ఆమె’ పుస్తకం వెల:రూ.100
కాపీలకు : 9063167117

సమీక్షకులు: శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ -9440222914

Sep 12, 2025

చేనేత రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి!

రేపటి కోసం ఎడిటోరియల్ పేజీ
ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కళాకారులపై కూటమి ప్రభుత్వం చల్లని చూపు  పడింది. ఈ ప్రభుత్వం చేనేత వృత్తిని గౌరవించడంతోపాటు చేనేత కార్మికుల చిందించే శ్వేదాన్ని గుర్తించింది. చేనేత ఉత్పత్తులతోపాటు మార్కెటింగ్‌కు కూడా ఈ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.  చేనేత కళాకారుల  జీవనాన్ని మెరుగు పరచడం కోసం  ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది.  చేనేత కుటుంబాలలో వెలుగు నింపుతోంది. చేనేత ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఎప్పుడూ ఉంటూనే ఉంది. అయితే, సరైన మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల, చేనేత సహకార సంఘాల నిర్వహణా లోపాల వల్ల చేనేత కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే చర్యల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా చేనేత మగ్గాల మోతలు మోగుతాయి. ప్రభుత్వం చేనేతకు సహకరిస్తే,  అది ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది.  చేనేత రంగం అభివృద్ధి చెందడంతోపాటు చేనేత కుటుంబాలకు, అలాగే, చేనేత అనుబంధ రంగాలలో ఇతరులకూ ఉపాధి అవకాశాలు పెరుగుపడతాయి.  చేనేత ఉత్పత్తులు, ఎగుమతులు పెరిగి ఈ రంగం కూడా సంపదని సృష్టిస్తుంది. చేనేత కార్మికులకు ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 7 నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నా.  ఈ పథకం ప్రకారం చేనేత మగ్గం ఉన్న కుటుంబానికి 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం. మర మగ్గం ఉన్న కుటుంబానికి 500 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం. ఈ ఉచిత విద్యుత్  పథకం కోసం  కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.190 కోట్లు ఖర్చు చేయనుంది.  ఈ పథకం ద్వారా రాష్ట్రంలో  చేనేత మగ్గాలు ఉన్న 50 వేల కుటుంబాలు,  మర మగ్గాలు ఉన్న 15 వేల కుటుంబాలు లబ్ధి పొందుతాయి. మగ్గానికి ఉచిత విద్యుత్  ఇవ్వడం అంటే చేనేత కార్మికుడి కష్టానికి గౌరవం ఇవ్వడమే.  ఎన్టీఆర్  భరోసా పెన్షన్ పథకం కింద 50 ఏళ్లు దాటిన ఒక్కో చేనేత కళాకారుడికి రూ.4000 పెన్షన్ ఇస్తున్నారు. 92,724 చేనేత కుటుంబాలకు సామాజిక పింఛన్ల కోసం ఏడాదికి రూ.546 కోట్లు ఖర్చు చేస్తున్నారు. నేషనల్‌ రూరల్‌ లైవ్లీ హుడ్‌ మిషన్‌ కింద మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, శ్రీకాళహస్తి, రాజాంలలో రూ.74 కోట్లతో కొత్త చేనేత క్లస్టర్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వీటిద్వారా 11,374 మంది చేనేత మహిళలకు లబ్ధి చేకూరుతుంది.  నేతన్న నేస్తం పథకం ద్వారా ఒక్కో కుటుంబంలో ఒక చేనేత కళాకారుడుకి ఏడాదికి రూ.25 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, సొంత ఇల్లు లేక, ఇల్లు ఉన్నా మగ్గం పట్టే స్థలం లేక మాస్టర్ వీవర్‌కు చెందిన షెడ్లలో నేత నేసే నిజమైన పేద చేనేత కళాకారులకు కూడా నేతన్న నేస్తం పథకం వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.  చేనేత వస్త్రాల అమ్మకంపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న 5 శాతం జీఎస్టీని ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వమే  భరిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.15 కోట్లు చెల్లించనుంది. గత ప్రభుత్వం నిలిపివేసిన త్రిఫ్ట్ నిధులను  కూటమి ప్రభుత్వం మళ్లీ అమలులోకి తీసుకొచ్చింది. 5,386 మంది చేనేత కళాకారులకు  రూ.5 కోట్లను విడుదల చేసింది. చేనేత క్లస్టర్స్ లో నమోదైన చేనేత కళాకారులకు మగ్గం, ఇతర మగ్గం పరికరాలు 90 శాతం సబ్సిడీతో ప్రభుత్వం అందిస్తోంది.  కేంద్ర ప్రభుత్వ ముద్ర యోజన పథకం క్రింద చేనేత కళాకారులు,  చేనేత సహకార సంఘాలు ముడిసరుకుల కొనుగోలుకు బ్యాంకుల ద్వారా 20శాతం సబ్సిడీ తో రుణాలు మంజూరు చేస్తున్నారు. ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన పథకం కింద 18 నుంచి 50 ఏళ్ల లోపు చేనేత కళాకారుడు మరణిస్తే రూ.2 లక్షల జీవిత భీమా చెల్లిస్తారు. ఈ పథకానికి ప్రీమియం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. 18 నుంచి 70 ఏళ్ల మధ్య చేనేత కళాకారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే  ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకం  కింద రూ.2 లక్షల చెల్లిస్తారు.   చేనేత కళాకారులకు ఆరోగ్య బీమా పథకం  కూడా ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రూ.10 వేల కోట్ల పెట్టుబడితో నూతన టెక్స్‌టైల్స్ పాలసీని ప్రభుత్వం రూపొందించింది.  1.51 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల( ఎంఎస్ఎంఈ) పార్కుల్లో చేనేత కళాకారుల కోసం ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. చేనేత సహకార సంఘాలను పటిష్టపరిచేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ సంఘాలకు  త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు  ఏర్పాట్లు చేస్తున్నారు. 

చేనేత కుటుంబాలు ఎక్కువగా ఉన్న మంగళగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎన్నికవడం కూడా చేనేత వర్గాలకు కలిసి వచ్చింది.  మంత్రి నారా లోకేష్‌తోపాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి కూడా చేనేత రంగం అభివృద్ధిపైనే ఉంటుంది. జాతీయ చేనేత దినోత్సవం రోజు మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో కూడా వారు ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. చేనేత కళాకారులు అధికంగా ఉన్న మంగళగిరి నియోజకవర్గ ప్రజలు తనను 90,160 మెజార్టీతో గెలిపించారన్న విశ్వాసం కూడ మంత్రి లోకేష్‌కు ఉంది. దాంతో,  మంత్రి నారా లోకేష్‌తోపాటు ఆయన సతీమణి బ్రాహ్మణి  కూడా  చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడర్లుగా  వ్యవహరిస్తున్నారు.  గతంలోనే మంత్రి లోకేష్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని మంగళగిరి ఆటోనగర్‌లో వీవర్‌శాల ఏర్పాటు చేశారు.  ప్రముఖ జాతీయోద్యమ నాయకుడు, చేనేత పరిశ్రమ రక్షణ కోసం పోరాటం చేసిన యోధుడు, చేనేత సూర్యుడిగా పేరొందిన రాజ్యసభ మాజీ సభ్యుడు ప్రగడ కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, మంగళగిరిలో కొత్తగా ఏర్పాటు చేసే పెద్ద పార్కుకి ప్రగడ కోటయ్య పేరు పెట్టి, అక్కడ ఆయన విగ్రహం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.  చేనేత వారసత్వాన్ని ప్రదర్శించేందుకు అమరావతిలో చేనేత మ్యూజియం ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. చేనేత పరిశ్రమ ఎదగాలన్న తపన ఉన్న పారిశ్రామికవేత్త సుచిత్ర ఎల్లాను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’  కింద రాష్ట్రానికి వచ్చిన తొమ్మిది అవార్డుల్లో నాలుగు చేనేత రంగానికే వచ్చాయి. ‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’ ద్వారా చేనేత ఉత్పత్తుల మార్కెట్‌ విస్తరిస్తోంది. ఇప్పటికే రెండు వేల చేనేత ఉత్పత్తులు ఇందులో నమోదయ్యాయి. చేనేతను ప్రపంచస్థాయికి తీసుకెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. 

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Sep 4, 2025

మానవ అక్రమరవాణా నిరోధించడంలో విఫలం


మానవ అక్రమ రవాణా, వ్యభిచారం ద్వారా ఆంధ్రప్రదేశ్‌  రాష్ట్రంలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. మానవ అక్రమ రవాణా విషయంలో ఆడ, మగ తేడాలేదు. అయితే, ఆడపిల్లలే అధికంగా ఉన్నారని సమాచారం. బాలికలను, మహిళలను వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారు.  అవయవాల కోసం కూడా  మానవ అక్రమ రవాణా జరుగుతోంది. రాష్ట్రంలో మ‌హిళా సెక్స్ వ‌ర్క‌ర్లు గణనీయంగా ఉన్నారు. ఓ పక్క అక్రమ రవాణా, మరోపక్క ఆర్థిక పరిస్థితుల వల్ల సెక్స్ వర్కర్ల సంఖ్య పెరుగుతోంది. ఇది చాలా ఆందోళన కరమైన అంశం. ఒక నివేదిక ప్రకారం 2021లో 1,33,447 మంది మహిళా సెక్స్ వర్కర్లతో రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా, 2024లో 1,19,367 మందితో రెండవ స్థానంలో ఉంది.  మానవ అక్రమరవాణా, వ్యభిచారం నిరోధించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఈ అంశాన్ని ప్రభుత్వాలు ఏవీ తీవ్రంగా పరిగణిస్తుట్లు కనిపించడంలేదు. ఇందుకోసం రాష్ట్రంలో ఓ పటిష్టవంతమైన వ్యవస్థలేదు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో మానవ అక్రమరవాణా నిరోధక యూనిట్స్ (యాంటీ హ్యుమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌-ఏహెచ్‌టీయూ)లను ఏర్పాటు చేశారు. వాటికి పోలీస్ స్టేషన్ హోదా కల్పించారు. అయితే, ఇప్పటి వరకు ఏ ఒక్క యూనిట్‌లో  ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నేరుగా  నమోదు చేయలేదు. స్థానిక పోలీస్ స్టేషన్‌లు తమ వద్ద ఉన్న పిల్లలు, యువతుల మిస్సింగ్, అక్రమ రవాణా కేసులు ఈ మానవ అక్రమరవాణా నిరోధక యూనిట్స్‌కు  బదిలీ చేయవలసి ఉంది. ఆ కేసులను ఏహెచ్‌టీయూలు స్వతంత్రంగా దర్యాప్తు  చేపట్టాలి, కానీ  వాస్తవ పరిస్థితుల్లో  అలా జరగడం లేదు. దాంతో  ఆ కేసులు విచారణ నీరుగారి పోతోంది. గత 5 ఏళ్ళుగా  కనీసం 10 శాతం మంది నిందితులకు కూడా  శిక్షలు పడలేదు.

 శారీరక దోపిడీ లేదా లైంగిక దోపిడీ, బానిసత్వం, దాస్యం లేదా అవయవాలను బలవంతంగా తొలగించడం, పిల్లలు, మానవ అక్రమ రవాణా ముప్పును ఎదుర్కోవడానికి  భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 370, 370A ఉన్నాయి. లైంగిక వేధింపులు, దోపిడీ నుండి పిల్లలను రక్షించడానికి  లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ-పోక్సో (పీఓసీఎస్ఓ) చట్టం చేశారు. బాలికలు, మహిళలను అమ్మడం, కొనడం, స్త్రీలు, పిల్లల అక్రమ రవాణాకు సంబంధించి భారతీయ శిక్షాస్మృతిలో   నిర్దిష్ట చట్టాలు అనేకం ఉన్నాయి. రాష్ట్రం కూడా  వారి రక్షణకు GOMs.No.1 (2003), GOMs.No.28 (2012), GOMs.No.43 (2015 ) జారీ చేసింది.  ఇన్ని చట్టాలు, జీఓలు ఉన్నప్పటికీ ఫలితంలేదు. వాటిని  అమలు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతోంది. బాధిత బాలికలకు, మహిళలకు  తగిన రీతిలో  పునరావాసం, పరిహారం లభించడంలేదు. 2016 నుండి 2022 వరకు ఆంధ్రప్రదేశ్‌లో 2,460 మందిని అక్రమ రవాణా, వ్యభిచార గృహాల నుంచి రక్షించారు. వారిలో పది శాతం మందికి కూడా పునరావాస సహాయం లభించలేదు. దీని వలన వారు తిరిగి లైంగిక దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉంది. అక్రమ రవాణాదారులకు శిక్ష విధించే రేటు 8 శాతం మించిలేదు. వీరికి అందాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏవీ అందలేదు.  పునరావాస కార్యక్రమాలు, నష్టపరిహారం అందించడంలో ఆ నాటి రాష్ట్ర ప్రభుత్వం  విఫలమైంది. ముఖ్యంగా నల్సా (నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ) వారు  2015లో రూపొందించిన పథకం ప్రకారం నరక కూపాల నుంచి విముక్తి పొందిన  ప్రతి మహిళకు లేదా బాలికకు లక్ష రూపాయల నుంచి రూ.8 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా, జీవో ఎంఎస్ నెంబర్ 28 ప్రకారం  విముక్తి పొందిన బాధితులకు రూ.20 వేలు తక్షణ ఆర్థిక సహాయం అందజేయాలి. కానీ, విముక్తి పొందినవారిలో ఐదు శాతం మందికి మించి ఆర్థిక సహాయం అందలేదు.
బాధితులకు  రక్షణ కరువైంది.  బాధితుల పిల్లలు వివక్షకు గురవడం మరో తీవ్రమైన అంశం. ఇది బాధిత మహిళలకు అయిన గాయాలను ఇంకా తీవ్ర చేస్తోంది. సెక్స్ వర్కర్లను అనధికారిక కార్మికులుగా పరిగణించి, వారికి అందించే అన్ని సంక్షేమ పథకాలు వీరికి కూడా వర్తింపచేయాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆ ఆదేశాలు అమలు కావడంలేదు. న్యాయ వ్యవస్థ కూడా ఈ బాధిత మహిళలు, బాలికల రక్షణ, వారి పునరావాసం, ఉపాధి... వంటి విషయాలలో ప్రత్యేక దృష్టి సారించవలసి ఉంది.  సెక్స్ వర్కర్లను, వ్యభిచార గృహాలు, అక్రమ రవాణా నుంచి రక్షించబడినవారి సంక్షేమం కోసం అక్రమ రవాణా బాధిత మహిళల రాష్ట్ర సమాఖ్య ‘విముక్తి’, హెచ్ఈఎల్‌పీ(సొసైటీ ఫర్ హెల్ప్ ఎంటైర్ లోయర్ అంద్ రూరల్ పీపుల్)వంటి స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నాయి. బాధిత మహిళల తరఫున పోరాటం చేస్తున్నాయి.  అయినా, ప్రభుత్వాల నుంచి తగినంత స్థాయిలో స్పందన రాకపోవడం బాధాకరం.  విముక్తి పొందిన బాలికలు, యువతుల సంక్షేమంపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిపెట్టవలసి ఉంది. వారికి న్యాయం, గౌరవం, ఉపాధి,  ఆర్థిక భద్రత కల్పించడం వంటి అంశాల విషయమై  ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవలసి ఉంది.    వ్యభిచారం, అక్రమ రవాణా నుండి బయటపడేవారికి ప్రత్యామ్నాయ జీవనోపాధిని కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం  ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించాలి. దానిని పటిష్టవంతంగా అమలు చేయాలి. వారు మళ్లీ గౌరప్రదంగా సమాజంలో బతికే వెసులుబాటు కల్పించాలి.  వ్యభిచారం, అక్రమ రవాణా నుండి బయటపడిన వారికి  రక్షణ, సంక్షేమం, నష్ట పరిహారం కోసం సింగిల్ విండో విధానం ద్వారా వారు ప్రయోజనాలు పొందేందుకు  రాష్ట్ర ప్రభుత్వం తగిన  చర్యలు తీసుకోవలసి ఉంది. అక్రమ రవాణాలో బయటపడిన వారిని నేరస్థుల వలే  షెల్టర్ హోమ్‌లలో సంవత్సరాల పాటు నిర్బంధంలో ఉంచడం భావ్యంకాదు.  అందుకు ప్రత్యామ్నయంగా కమ్యూనిటీ-ఆధారిత పునరావాసం కోసం సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయవలసి ఉంది. తద్వారా వారు సమాజంలో కలిసిపోయి జీవించేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ రవాణా బాధిత మహిళలు కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, సహాయక సేవల సమీక్ష, పర్యవేక్షణ, వాటి అమలు కోసం ఏర్పాటు చేసే కమిటీలలో  సెక్స్ వర్కర్లు, అక్రమ రవాణా నుండి బయటపడిన వారికి ప్రాతినిధ్యం కల్పించవలసి ఉంది. బాధితులు తమ హక్కులు తిరిగి పొందేందుకు, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు స్పష్టమైన, పటిష్టమైన విధానాలు, సంస్కరణలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని అన్ని విధాల ఆదుకోవలసిన అవసరం ఉంది.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

Sep 3, 2025

సీనియర్ జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ విధానం కోసం తీర్మానం

విజయవాడ: ఆగస్టు 19 నుండి 21 వరకు సీనియర్ జర్నలిస్ట్ ఫోరం కేరళ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మహాసభల్లో సీనియర్ జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతూ తీర్మానించినట్లు ఏపీ వెటరన్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ టి. జనార్ధన్,ఉపాధ్యక్షులు ఎస్. అజాద్, కోశాధికారి ఎం.వి. రామారావు, సంయుక్త కార్యదర్శి పి. భుజంగ రావులు పేర్కొన్నారు. మంగళవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో  జరిగిన విలేకర్ల సమావేశంలో కేరళలో జరిగిన సీనియర్ జర్నలిస్ట్ ఫోరం జాతీయ మహాసభలో చేసిన తీర్మానాలను, రాష్ట్ర కార్యవర్గ నిర్ణయాలను మీడియాకు వివరించారు. 


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 21 రాష్ట్రాల  నుండి 250 మంది, సీనియర్ జర్నలిస్టులు ప్రథమ జాతీయ మహాసభకు విచ్చేసారని, ప్రారంభ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, ముగింపు సమావేశానికి ప్రతిపక్ష నేత సతీషన్, గోవా మాజీ గవర్నర్ పిళ్ళై హాజరై మహాసభ విజయాన్ని కాంక్షించారని పేర్కొన్నారు.  ఈ సభలో ప్రధానంగా దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలలో  వెటరన్స్ కు పెన్షన్ అందిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నెలకు రు.20,000 తో జాతీయ పెన్షన్

విధానం ఉండాలని మహాసభ తీర్మానించినట్టు తెలిపారు. కరోనా సమయంలో ఉపసంహరించిన రైల్వే పాసులను  పునరుద్ధరించాలని మహాసభ డిమాండ్ చేయడం జరిగిందన్నారు.  దక్షిణ భారతదేశంలో ఆంధ్ర,తెలంగాణలో మాత్రమే వెటరన్స్ కు  ఎలాంటి పెన్షన్ సౌకర్యం లేదని, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరడం జరిగిందన్నారు.  జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ను,గతంలో లాగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రతి జర్నలిస్టు కుటుంబానికి వైద్యం,
ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమలుకు దోహదపడాలని మహా సభ నిర్ణయించిందన్నారు.  హెల్త్ ఇన్సూరెన్స్ ను రు.5 లక్షలకు పెంచి ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నిమ్స్ తరహాలో మన రాష్ట్రంలోని సిమ్స్, రిమ్స్, ఎయిమ్స్ లాంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో కూడా జర్నలిస్టులకు, కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం కల్పించాలన్నారు.

మధ్యప్రదేశ్ తరహాలో   వెటరన్స్ కు పర్మినెంట్ అక్రిడిటేషన్ సౌకర్యం కల్పించాలన్నారు., కర్ణాటక తరహాలో అన్ని బస్సుల్లో ( ఎసితోసహా) ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు.  రాష్ట్ర హెడ్ క్వార్టర్ లో లాగా జిల్లా స్థాయి జర్నలిస్టులకు కూడా స్టేట్ అక్రిడిటేషన్ మంజూరు చేయాలని కోరడం జరిగిందన్నారు. కేరళ మహా సభలో రాష్ట్రం నుండి. యం. వి.రామారావు, హెచ్.ఆజాద్,,యం. నరేంద్ర రెడ్డి, ఎస్.నాగార్జున రావు,, జాతీయ సమితి సభ్యులు గా, డా. టి. జనార్దన్, జాతీయ ఉపాధ్యక్షులు గా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్ర కార్యవర్గం వారిని అభినందించింది.

సమాచార శాఖ సంచాలకులకు వినతి

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్ష్ శుక్ల ఐఏఎస్ కి, అడిషనల్ డైరెక్టర్ ఎల్. స్వర్ణలత కి ఏ.పి. వెటరన్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు వినతిపత్రం అందజేసారు. కార్యక్రమం లో ఏ.పి. వెటరన్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డా. టి. జనార్దన్, గౌరవ అధ్యక్షులు నాగార్జున, ఉపాధ్యక్షులు ఎస్. అజాద్,ఎం. నరేంద్ర రెడ్డి, కోశాధికారి ఎం.వి. రామారావు, సంయుక్త కార్యదర్శి పి. భుజంగ రావు, తదితరులు పాల్గొన్నారు.

ఏపీవీజేయూ గౌరవాధ్యక్షునిగా శిరందాసు నాగార్జున

విజయవాడ: ఏపీ వెటరన్ జర్నలిస్టుల యూనియన్ గౌరవాధ్యక్షులుగా గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ శిరందాసు నాగార్జున రావుని ఎంపిక చేసినట్లు యూనియన్ అధ్యక్షుడు  డాక్టర్ టి. జనార్దన్, ప్రధాన కార్యదర్శి  జి. చంద్రశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ సిద్ధార్ధ నగర్‌లో సోమవారం జరిగిన వెటరన్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్రస్థాయి కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వారు వివరించారు. యూనియన్  రిజిస్ట్రేషన్ ప్రక్రియను మన యూనియన్ ఉపాధ్యక్షులు వెంకటరత్నం సారధ్యంలో ఈనెల 30లోగా పూర్తి చేయాలని రాష్ట్ర కార్యవర్గం తీర్మానించింది. ఈ ప్రక్రియలో ఆయనకు అందరూ సహకరించాలని కమిటీ నిర్ణయించింది. యూనియన్ కార్యవర్గంలోకి  గౌరవ అధ్యక్షులుగా శిరందాసు నాగార్జున రావు (మంగళగిరి) సహాయ కార్యదర్శులుగా పి.భుజంగ రావు (ధర్మవరం) ఆర్.రాజశేఖర్ (విజయవాడ)లను  తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. జర్నలిస్టులుగా 20 ఏళ్లు పూర్తి అయి, తగిన ఆధారాలు కలిగి ఉండి, 58 ఏళ్లు నిండిన వారు, తాజాగా అక్రెడిటేషన్ కలిగినవారిని సభ్యులుగా చేర్చుకోవాలని నిర్ణయించారు. సభ్యత్వ రుసుము రూ.500గా, ప్రతి ఏడాది రెన్యూవల్ కోసం రూ.100 చెల్లించాలని నిర్ణయించారు. యూనియన్‌లో  221 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే, వారిలో  130 మంది మాత్రమే సభ్యత్వ రుసుం  చెల్లించారు. మిగతా 91 మంది ఈనెల 15లోగా సభ్యత్వ రుసుంతో పాటు, దరఖాస్తును విజయవాడలోని మన కోశాధికారి రామారావు(7286964554)కి పంపాలని తెలిపారు. లేనిచో జాబితా నుండి పేర్లు  తొలగించాలని కార్యవర్గం నిర్ణయించింది. మన సభ్యుల ప్రవర్తన గౌరవప్రదంగా హుందాగా  ఉండాలని, అలా లేని పక్షంలో, ఎవరిపైనైనా  ఫిర్యాదులు అందితే, వారిపై క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు  చేసేందుకు ముగ్గురితో కమిటీ ఏర్పాటు ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులుగా ఎంవీ.రామారావు(విజయవాడ), హెచ్.ఆజాద్(అనంతపురం), వేగి రామ చంద్రరావు(విశాఖపట్నం)లుగా ఉంటారు.58 ఏళ్లు నిండి, వెటరన్ జర్నలిస్టులుగా అక్రెడిటేషన్ కలిగిన వారు కొత్త సభ్యులుగా చేరమని కమిటీ పిలుపు ఇచ్చింది.

30న తెలంగాణ బార్ కౌన్సిల్‌ సభ్యుల ఎన్నిక

ఎన్నుకోబడవలసిన సభ్యుల సంఖ్య: 23 ఓటర్లకు సూచనలు 1. ఒకే బదిలీ ఓటు పద్ధతి ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థ ప్రకారం ఇరవై మూడు మంది సభ్యులను ఎన్...