కలిమిశ్రీ మూడున్నర దశాబ్దాలుగా పత్రికారంగంలో కొనసాగుతున్నారు. ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, జ్యోతిచిత్ర పత్రికల్లో పని చేశారు. ఎన్నో ఏళ్లుగా సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ సాహిత్యంలో కొత్తతరాన్ని ప్రోత్సహిస్తున్నారు. 2007 నుంచి ‘నవమల్లెతీగ’ మాసపత్రికకకు వ్యవస్థాపక సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. సాహితీ విలువలతో దానిని సమర్థవంతంగా తీసుకువస్తున్నారు. మల్లెతీగ అంటే పత్రిక కాదు, అది ఒక సాహితీ సంస్థ. సాహితీవేత్తలందరికీ ‘మల్లెతీగ’ అనగానే కమిలిశ్రీ గుర్తుకు వచ్చేంతగా ఆయన దానిని తీర్చిదిద్దుతున్నారు. గత పదేళ్లుగా ఎంతోమంది కవుల్ని మల్లెతీగ పురస్కారంతో ప్రోత్సహిస్తున్నారు. కవి సమ్మేళనాలు, కథ, కవిత, గజల్ ఇతర సాహిత్య ప్రక్రియలపై అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. సాహిత్యరంగంలో ఉద్దండులైన ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, కె.శివారెడ్డి, ఆచార్య కొలకలూరి ఇనాక్, పాపినేని శివశంకర్, విహారి, గోరటి వెంకన్న, గజల్ శ్రీనివాస్, జి.లక్ష్మీనరసయ్య, రసరాజు, కొప్పర్తి, కీ.శే. డాక్టర్ అద్దేపల్లి రామమోహన్
రావు తదితర సాహితీమూర్తులతో ఎన్నో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. సాహిత్య కళా రంగాల్లో కొత్త చైతన్యాన్ని తీసుకువచ్చేందుకు గత నవంబరులో మిత్రుల సహకారంతో విజయవాడలో ‘జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు’ ఘనంగా నిర్వహించారు. పలువురి ప్రశంసలు అందుకున్నారు. మల్లెతీగ ముద్రణ విభాగాన్ని నెలకొల్పి సొంతంగా పుస్తకాలు అచ్చేసుకోవాలన్న కవులు, రచయితల ఆకాంక్షలకు అనుగుణంగా తక్కువ ధరకే పుస్తకాల్ని అందంగా ముద్రిస్తున్నారు. కవులు, రచయితలు వారి రచనలను కాగితాలపై రాసి ఇస్తే చాలు, డీటీపీ, పేజీ మేకప్, ఆర్ట్ వర్క్, అందంగా ముద్రించడం, ఆ తరువాత వాటిని ఆవిష్కరించడం వరకు అన్ని బాధ్యతలు ఆయనే స్వీకరిస్తారు. మొదటి నుంచి సాహిత్యానికి, పుస్తక ప్రచురణలకు ప్రసిద్ధిచెందిన విజయవాడ పేరును ఆదే కోవలో కొనసాగిస్తూ అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు. సాహిత్య కార్యక్రమాల నిర్వాహణలో దిట్టగా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇన్ని విశిష్ట లక్షణాలున్న కలిమిశ్రీ అసలు పేరు కలిమికొండ సాంబశివరావు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో కలిమికొండ బసవయ్య, దేవకమ్మలకు ఐదవ సంతానంగా కలిమిశ్రీ జన్మించారు. మగ్గం నేసిన రోజే కడుపు నిండే అంతటి పేద చేనేత కుటుంబం వారిది. కొత్తరెడ్డిపాలెంలోనే ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేశారు. ఆ తర్వాత గుంటూరులో వారి పెద్దన్నయ్య ఇంట్లో ఉంటూ హిందూ కాలేజీలో డిగ్రీలో చేరారు. అయితే, చదువు మధ్యలోనే ఆపేశారు. ఆయన 10వ తరగతి చదివే రోజుల్లోనే తొలి కవిత రాసి, తొలి కార్టూన్ గీశారు. 1984 నుంచి విస్తృతంగా రాసేవారు. కార్టూన్లు వేసేవారు. అవి పత్రికలలో వస్తుండేవి. అప్పట్లో కవులు కలం పేరు పెట్టుకోవడం ఆనవాయితీ వచ్చేది. అలా తన కలం పేరు ‘కలిమిశ్రీ’గా పెట్టుకున్నారు. 1987లో ఆంధ్రపత్రికలో చేరారు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి, జ్యోతిచిత్ర, విద్య, ధాన్యమాలిక, సహస్రార, వందేగోమాతరం, మహోదయ .. వంటి పత్రికల్లో పనిచేశారు. జ్యోతిచిత్ర కోసం చిత్రపరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు మొదలుకొని అనేక మందిని, స్వాతి బలరామ్ నుంచి సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు వంటి పారిశ్రామికవేత్తలను ఇంటర్వ్యూ చేశారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉత్తమ జర్నలిస్టుగా సత్కరించారు. అనేక సాహితీ సంస్థలు ఆయనను సన్మానించాయి.
-శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914
No comments:
Post a Comment