లక్ష్యం, తపన, పట్టుదల, కృషి ఉంటే పెళ్లి, పిల్లలు, వయసు ఇవి ఏవీ లక్ష్యసాధనకు అడ్డుకావని నిరూపించింది ఓ వనిత. కన్న కొడుకుతోపాటు యువతరంతో పోటీపడి ఓ తల్లి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ అరుదైన సంఘటన కేరళలో జరిగింది. కేరళ రాష్ట్రం మలప్పురం పట్టణానికి చెందిన 42 సంవత్సరాల వయసు ఉన్న బిందు అనే మహిళ, ఆమె కుమారుడు వివేక్తోపాటు పోటీపరీక్షలలో శిక్షణ పొంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశారు. తల్లీకొడుకు ఇద్దరూ ఒకేసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. 42 ఏళ్ల అమ్మ, 24 ఏళ్ల కొడుకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న బిందు కల ఇన్నేళ్ల తర్వాత నెరవేరింది. ఇటీవల జరిగిన ఈ సంఘటన కేరళలోనే కాకుండా దేశమంతటా చర్చనీయాంశమైంది. ఈ వార్తతోపాటు తల్లీకొడుకుల ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. వివేక్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంలో విశేషం ఏమీలేదు. కానీ, కొడుకుతోపాటు తల్లి కూడా అదే పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో వారు అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె విజయం ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకం.
బిందు కేరళలోని మలప్పురం పట్టణానికి చెందిన వ్యక్తి. ఆమె భర్త చంద్రన్ మలప్పురం జిల్లాలోని కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ఎడప్పల్ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నారు. వారికి ఒక కుమారుడు వివేక్ ఒట్టుపర, కుమార్తె హృద్య ఉన్నారు. బిందుకు చిన్న వయసులోనే పెళ్లైంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఆమె ఎంతోకాలంగా కలలు కంటోంది. అయితే, పిల్లలు పుట్టడం, వారి ఆలనాపాలనా చూసుకోవడంతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవడం ఆమెకు సాధ్యంకాలేదు. దాంతో ఆమె కల నెరవేరలేదు. మలప్పురం జిల్లాలోని ఆరీకోడ్లో ఆమె గత 11 ఏళ్లుగా అంగన్వాడీ టీచర్గా పని చేస్తున్నారు. 2019-20లో బిందు ఉత్తమ అంగన్వాడీ టీచర్గా రాష్ట్ర ప్రభుత్వ అవార్డు అందుకున్నారు. అయితే, ఆమె అంతటితో ఆగిపోలేదు. ఉన్నత స్థానానికి ఎదగటం కోసం తీవ్రంగా కృషి చేస్తూనే ఉన్నారు. మరోపక్క పిల్లలు కూడా పెద్దవాళ్లయ్యారు. కొడుకు వివేక్ ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాస్తున్నాడు. బిందు కూడా అంగన్ వాడీ టీచర్ పోస్టుతో సంతృప్తి చెందలేదు. ఇప్పటి వరకూ ఆమె రెండు సార్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశారు. ఐసీడీసీ సూపరింటెండెంట్ పోస్టుకు పోటీ పరీక్షకు కూడా ప్రిపేర్ అవుతున్నారు.
ఇదే క్రమంలో ఆమె కొడుకు వివేక్ కేరళ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్యాలని అనుకున్నాడు. ఇప్పటికే రెండు సార్లు సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసిన బిందు కూడా కొడుకుతోపాటు మరోసారి ఆ పరీక్షలు రాయడానికి సిద్ధపడ్డారు. తియ్య కమ్యూనిటీకి చెందిన వారికి రిజర్వేషన్ ఉండటంతో ఆమెకు 42 ఏళ్లు వచ్చినా కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాస్ట్ గ్రేడ్ సర్వెంట్ పోస్టుకు అర్హురాలు కావడంతో ఆమె అప్లై చేశారు. అయితే, ఇంతకు ముందులా కాకుండా గట్టిపట్టుదలతో ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. తల్లీకొడుకులు ఇద్దరూ కలిసి ఒకే కోచింగ్ సెంటర్ లో చేరారు. ప్రతిరోజూ కలిసే క్లాసులకు హాజరయ్యేవారు. ఇంటి దగ్గర కూడా ఇద్దరూ కలిసి కంబైన్డ్ స్టడీ చేశారు. తల్లీకొడుకుల పట్టుదల, వారు ప్రిపేర్ అయ్యేతీరును గమనించిన కోచింగ్ సెంటర్లోని అధ్యాపకులు కూడా వారిని ప్రోత్సహించారు. చంద్రన్ కూడా భర్తగా, తండ్రిగా వారిద్దరినీ ప్రోత్సహించారు.
ఇద్దరూ కలిసి ఒకేసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశారు. ఆ పరీక్షల్లో ఇద్దరూ ఉత్తీర్ణులయ్యారు. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు ఎంపికైన వారి జాబితాలో వివేక్కు 38వ ర్యాంక్ వచ్చింది. లాస్ట్ గ్రేడ్ సర్వెంట్ పోస్టులకు ఎంపికైన వారి జాబితాలో బిందుకు 92వ ర్యాంక్ వచ్చింది. దాంతో ఆ తల్లీకొడుకుల ఆనందానికి అవధులు లేవు. చిరకాల వాంఛ నెరవేరినందుకు, కొడుకుతోపాటు తనకూ ప్రభుత్వ ఉద్యోగం వచ్చినందుకు బిందు సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కేరళ రాష్ట్రమంతా ఇప్పుడు వీరిద్దరివైపే చూస్తోంది. వారి ఇంటర్వ్యూల వీడియోలు వైరల్ అవడంతో దేశవ్యాప్తంగా కూడా వారి గురించి చర్చించుకుంటున్నారు. బిందు మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. ఒక భార్యగా, గృహిణిగా, తల్లిగా తన వంతు బాధ్యతలను నెరవేర్చడమే కాకుండా ఆత్మ విశ్వాసంతో ఉంటే ఆశయ సాధన అసాధ్యం కాదని, స్త్రీలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని బిందు నిరూపించారు. మహిళా లోకానికి ఆదర్శప్రాయంగా నిలిచారు. అమెకు మనస్ఫూరిగా అభినందనలు తెలియజేద్దాం.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914
No comments:
Post a Comment