ఉన్నత స్థాయిలో ఓ కొత్త వ్యవస్థ
48 ఏళ్ల పోరాట ఫలితం
జాతీయ మానవ హ్కకుల సంఘం సభ్యునిగా ఉన్నా పినాకి చంద్రఘోష్ భారత ప్రధమ ‘లోక్ పాల్’గా నియమితులయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహతగీలతో కూడిన ‘లోక్ పాల్’ ఎంపిక కమిటీ మార్చి 17న జస్టిస్ ఘోష్ పేరును ఖరారు చేసి, రాష్ట్రపతికి పంపించింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దానిని ఆమోదించారు. మార్చి 23న రాష్ట్రపతి ఆయనచేత ప్రమాణ స్వీకారం చేయించారు. 1976లో కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన జస్టిస్ ఘోష్ 1997లో ఆ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తరువాత2012లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. 2013లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది2017లో పదవీ విరమణ చేశారు. ఆయన పూర్వీకుడు హరచంద్ర ఘోష్ కలకత్తాలో బ్రిటీషువారు నెలకొల్పిన సదర్ దివానీ అదాలత్ కు 1876లో తొలి భారతీయ ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. ఆయన తండ్రి శంభు చంద్ర ఘోష్ కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసారు. లోక్పాల్లో జ్యుడీషియల్ సభ్యులుగా వివిధ హైకోర్టులకు చెందిన మాజీ ప్రధాన న్యాయమూర్తులు దిలీప్ బి భోసలే, ప్రదీప్ కుమార్ మొహంతి, అభిలాషా కుమారితో పాటు ఛత్తీస్గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (తరువాత రాజీనామా చేశారు) అజరు కుమార్ త్రిపాఠీ, నాన్ జ్యుడీషియల్ సభ్యులుగా మహారాష్ట్ర మాజీ సీఎస్ దినేశ్కుమార్ జైన్, సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్ బీ) మాజీ ఉమెన్ చీఫ్ అర్చనా రామసుందరం, ఐఆర్ ఎస్ మాజీ అధికారి మహేందర్ సింగ్, ఐఏఎస్ మాజీ అధికారి ఇంద్రజిత్ ప్రసాద్ గౌతంలను రాష్ట్రపతి నియమించారు. వారి చేత జస్టిస్ ఘోష్ మార్చి 27న ప్రమాణస్వీకారం చేయించారు. వీరంతా 70 ఏళ్లు వచ్చేవరకు లేదా 5 ఏళ్లు పూర్తి అయిన తర్వాత రిటైర్ అవుతారు. ప్రధాన మంత్రితోపాటు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులపై వచ్చే అవినీతి ఆరోపణలపై విచారణ చేయడం లోక్ పాల్ ప్రధాన విధి. ప్రభుత్వ అనుమతి లేకుండా విచారణ జరిపే స్వతంత్ర సంస్థ ఇది.
1966లోనే మొరార్జీ నేతృత్వంలోని పరిపాలన సంస్కరణల సంఘం కేంద్రంలో లోక్పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్త వ్యవస్థలను ఏర్పా టుచేయాలని సూచించింది. మొట్ట మొదటి సారిగా 4వ లోక్ సభలో 1969లో లోక్పాల్ బిల్లుని ఆమోదించారు. రాజ్య సభలో ఆమోదించలేదు. ఆ తరువాత 1971, 1977, 1985, 1989, 1996, 1998, 2001, 2005,2008లలో కూడా ఈ బిల్లుని వరుసగా 9 సార్లు పార్లమెంటులో ప్రవేశపెట్టినా ఆమోదించలేదు. జన్ లోక్పాల్ బిల్లు చట్టం కోసం అవినీతి-వ్యతిరేక కార్యకర్త 72 ఏళ్ల అన్నా హజారే 2011 ఏప్రిల్ 5న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. హజారే నేతృత్వంలో ప్రజా ఉద్యమం ఓ ఉప్పెనలా చెలరేగింది. దీక్ష నాలుగు రోజులు కొనసాగించిన తరువాత అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ 2011లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెడతామని ప్రకటించారు. దాంతో ఆయన దీక్ష విరమించారు. 2011 డిసెంబర్ 27న లోక్సభలో లోక్పాల్ బిల్లును ఆమోదించారు. అయితే ప్రధాన మంత్రిని ఈ బిల్లు నుంచి మినహాయింపు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 2012 డిసెంబర్ లో హజారే మళ్లీ దీక్షకు దిగారు. దీంతో బిల్లులో పలు సవరణలు చేసి డిసెంబర్ 18న లోక్ సభలో ఆమోదించారు. బిల్లు ముసాయిదాని రూపొందించడం కోసం కమిటీలు – న్యాయ నిపుణులు, ప్రభుత్వ, పౌర సమాజ ప్రతినిధులు, రాజకీయ నాయకులతో చర్చలు - సంప్రదింపులు - ఆందోళనలు - నిరసనలు - జాతీయ భద్రతా మండలి తిరస్కారం ... ఇలా అనేక దశలు దాటిన తరువాత లోక్పాల్, లోకాయుక్త చట్టంని 2013లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించడంతో చట్టంగా మారింది. అయితే అరేళ్ళ తర్వాత, అదీ సుప్రీం కోర్టు జోక్యంతో లోక్ పాల్ చట్టం ఇప్పుడు అమలులోకి వచ్చింది. అధికార నిర్వహణలో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులలో రోజురోజుకు నిరంకుశత్వం,ఆశ్రిత పక్షపాతంతోపాటు అవినీతి కుంభకోణాలు పెరిగిపోతుండటంతో వాటిని కట్టడి చేసేందుకు ఏర్పడిన నియంత్రణ వ్యవస్థే లోక్పాల్. లక్షాలాది భారతీయులు పాల్గొని దేశ వ్యాప్తంగా నడిచిన ఈ ఉద్యమం అహింసాయుతంగా, రాజకీయ జోక్యం లేకుండా కొనసాగింది. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ప్రజలే భాగస్వాములుగా ఇంత సుదీర్ఘ కాలం ఉద్యమం నడవడం విశేషంగా చెప్పవచ్చు. స్వతంత్ర భారతంలో సుదీర్ఘకాలం పార్లమెంటు ఆమోదానికి నోచుకోకుం డా పక్కన పడవేసిన బిల్లుల్లో లోక్పాల్ బిల్లు ఒకటి. లోక్పాల్ నియామకంలో జరిగిన జాప్యంపై ప్రతిపక్షాల నుంచి కేంద్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. లోక్ పాల్ ఏర్పాటులో ప్రభుత్వం జాప్యాన్ని ప్రశ్నిస్తూ లోక్ పాల్ ఎంపిక కమిటీని ఏర్పాటుచేసి, పది రోజుల్లో ఎంపికను ఖరారు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దాంతో కేంద్రం ఈ వ్యవస్థను కార్యరూపంలోకి తీసుకువచ్చింది. కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ఎంపీలు,ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులపై వచ్చే అవినీతి ఆరోపణలను విచారణ జరిపే అధికారం లోక్పాల్, లోకాయుక్తలకు ఉంటుంది. లోక్ పాల్ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. లోక్ పాల్ కు తగినన్ని వనరులు ప్రభుత్వమే సమకూరుస్తుంది. ఈ వ్యవస్థ వృత్తిపరమైన నిబద్ధతతో పని చేస్తుంది. ఉన్నతస్థాయిలో జరిగే అవినీతిని నియంత్రించడంలో ఈ కొత్త వ్యవస్థ ఒక హెచ్చరిక. దేశంలో పేరుకుపోయిన అవినీతిపై ఉక్కుపాదం మోపడానికి అవకాశం ఏర్పడింది.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914
No comments:
Post a Comment