వాస్తవంగా ఇళ్లు లేని పేదవారికి
ఇళ్లు
మంత్రి మండలి ఉపసంఘం నిర్ణయం
సచివాలయం,
మే 10: అధికారుల పరిశీలనలో వాస్తవంగా ఇళ్లు లేని పేదవారికి
ఇళ్లు మంజూరు చేయాలని సచివాలయం 2వ బ్లాక్ లోని ఆర్థిక మంత్రి సమావేశ మందిరంలో జరిగిన
మంత్రి మండలి ఉపసంఘం సమావేశం నిర్ణయించింది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన జరిగిన
సమావేశంలో మంత్రులు డాక్టర్ పి.నారాయణ, కింజరాపు అచ్చన్నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి పాల్గొన్నారు.
గత ప్రభుత్వంలో లబ్దిదారులకు తెలియకుండా వారిపేర్లుపై ఇళ్లు మంజూరు చేసిన
అంశం చర్చకు వచ్చింది. వారు ఇప్పుడు దరకాస్తు చేసుకుంటే వారి పేర్లపై ఇళ్లు
మంజూరైనట్లు రికార్డులలో నమోదుకావడంతో ఇళ్లు మంజూరు చేయడం కుదరడంలేదని అధికారులు
తెలిపారు. అటువంటి దరకాస్తులను పరిశీలించి, అధికారులు స్వయంగా వెళ్లి తనిఖీ చేసి,
వారికి నిజంగా ఇల్లు లేకపోతే, పాత రికార్డులలో వారి పేర్లు తొలగించి,
కొత్తగా ఇల్లు మంజూరు చేయమని ఉపసంఘం ఆదేశించింది.
2004కు ముందు ఎస్టీలకు రూ.7500
లతో నిర్మించిన
పూరిళ్లు, షెడ్లు పూర్తిగా దెబ్బతినడంతో వారికి కూడా ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద
ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. గృహ నిర్మాణ నిధులకు కొరతలేదని, నిర్మాణం వేగం పెంచాలని మంత్రి యనమల ఆదేశించారు. కొన్ని కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు నిధులు కావాలని
అధికారులు కోరగా మంత్రి మంజూరు చేస్తామని చెప్పారు. అన్ని ప్రాంతాలల్లో గృహ నిర్మాణ వ్యయం ఒకే రకంగా
ఉండాలని, మెటీరియల్, ఇతర అదనపు సౌకర్యాలకు అదనంగా అయ్యే ఖర్చుని లబ్దిదారుడు భరాయించడానికి సిద్దంగా
ఉంటే అందుకు అనుమతించాలన్నారు. నిర్మాణం పూర్తి అయి, మౌలిక వసతులు లేక స్వాధీనం చేసుకోని ఇళ్లకు మౌలిక వసతులు సమకూర్చాలని
నిర్ణయించారు.
ఇళ్ల నిర్మాణ వ్యయం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉద్యోగ హామీ పథకం(నరేగా) కింద 90 రోజుల పని దినాలు, గ్రూప్ ఇళ్లు, మెటీరియల్, పట్టణ, గ్రామీణ ఇళ్ల నిర్మాణం, అపార్ట్ మెంట్లు, వ్యక్తిగత ఇళ్లు, అగనంపూడి, రాజంపేటలలో ఇళ్ల నిర్మాణం, కడప శాటిలైట్ టౌన్ షిప్, పీఎంఏవై ఇళ్ల నిర్మాణం, హడ్కో రుణం, వడ్డీ శాతం వంటి పలు అంశాలను చర్చించారు.
సమావేశంలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్.కరికాలవలవన్, గృహ నిర్మాణ సంస్థ ఎండి కాంతిలాల్ దండే తదితరులు
పాల్గొన్నారు.
No comments:
Post a Comment