హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం - దేశ రెండో రాజధాని
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం, దేశ రెండవ రాజధాని అవుతుందన్న ఊహాగానాలు
హల్ చల్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజన సమయంలో కేంద్ర పాలిత ప్రాంతం అంశం
తెరపైకి వచ్చింది. ఒక దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను విడగొట్టి,
హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. అయితే తెలంగాణలో అంతర్భాగంగా ఉన్న హైదరాబాద్ ని కేంద్ర
పాలిత ప్రాంతం ఎలా చేస్తారన్న విమర్శలు వినవచ్చాయి. ఆ తరువాత ఆ ఊసే లేదు. అయితే ఇటీవల మళ్లీ హైదరాబాద్ని
కేంద్ర పాలిత ప్రాంతం చేసే అవకాశం ఉందని, కేంద్రం ఈ అంశాన్ని పరిశీలిస్తుందని కూడా
విస్తృతంగా ప్రచారంలో ఉంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్, పార్టీ, దేశ
ప్రయోజనాల రీత్యా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అంతే కాకుండా దక్షిణాదిన బలపడాలన్న
ఆలోచనతో బీజేపీ ఉంది. కశ్మీర్ విషయంలో ఎవరూ ఊహించని రీతిలో హఠాత్తుగా సంచలన
నిర్ణయం తీసుకుంది. 370 ఆర్టికల్ ని రద్దు
చేసి దేశ వ్యాప్తంగా మద్దతు కూడగట్టుకుంది. ఆ క్రమంలో హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతం చేసే
ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అంతే కాకుండా పలువురు ప్రముఖులు కూడా ఈ విషయాన్ని
స్పష్టం చేశారు. హైదరాబాద్ ని కేంద్రపాలిత
ప్రాంతం చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తన వద్ద సమాచారం ఉందని మాజీ మంత్రి చింతా మోహన్ ఇటీవల విలేకరులకు
చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా మారుతుందని
సంచలన కామెంట్స్ చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత బీజేపీ
చిక్కుల్లో పడింది. ఎట్టకేలకు అక్కడ తమ అభ్యర్థినే ముఖ్యమంత్రిని చేస్తోంది. చింతా
మోహన్ హైదరాబాద్ గురించే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి తిరుపతికి
మారుస్తారని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అది ఎవరికీ అచ్చిరాదని, జగన్కు కూడా
ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. రాజధానికి
సంబంధించి ఏపీ ప్రభుత్వం కొత్తగా ఒక కమిటీని నియమించడం, పురపాలక, పట్టణాభివృద్ధి
శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసే వ్యాఖ్యల వల్ల రాజధానిని మార్చే అవకాశం ఉందని
పలువురు భావిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం విషయానికి వచ్చేసరికి అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్
నేతలు అవన్నీ వట్టి పుకార్లని కొట్టిపారేశారు. ఆ
వార్తలన్నీ వదంతులు మాత్రమేనని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం
చేశారు. ఆ వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర హోంశాఖ
సహాయ మంత్రి కిషన్రెడ్డి చెప్పారు.
ఈ విషయాలన్నీ
ఇలా ఉంచితే, తాజాగా హైదరాబాద్ని ఏకంగా
దేశ రెండో రాజధాని చేసే అవకాశం ఉన్నట్లు బలంగా వినవస్తోంది. అయితే ఈ అంశం ఇప్పటిదేమీ
కాదు. హైదరాబాద్ ని రెండవ రాజధాని
చేయాలని,
ఇక్కడ సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఎప్పటి
నుంచో ఉన్నాయి. దానికి తోడు దేశంలో ఉత్తరాది ఆధిపత్యం ఎక్కువైపోయిందన్న విమర్శలు చాలా కాలంగా వినవస్తున్నాయి. దక్షిణాదివారికి ఢిల్లీలో భాష కూడా ఓ సమస్య. ఈ
నేపధ్యంలో దక్షిణాదిన రెండవ రాజధానిని ఏర్పాటు చేయాలన్న అంశం చాలా కాలంగా
పరిశీలనలో ఉంది. హైదరాబాద్ ని దేశ రెండవ రాజధానిగా చేయాలని సౌత్ ఇండియా పొలిటికల్ జేఏసీ చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. ఇటీవల
ఈ అంశంపై హైదరాబాద్లో సదస్సు కూడా
నిర్వహించింది. ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ
దక్షిణాదిన బలహీనంగా ఉంది. ఇక్కడ బలం పుంజుకోవడానికి ఆ పార్టీ వ్యూహ రచన
చేస్తోంది. దక్షిణాది ప్రజల మనసులలో స్థిర
స్థానం సంపాదించాలన్న యోచనలో ఆ పార్టీ ఉంది. అందులో భాగంగా రెండవ రాజధానిని ఇక్కడ
ఏర్పాటు చేసి దక్షిణాది ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి ప్రణాళికలు సిద్ధం
చేస్తోంది. దానికి తోడు ప్రస్తుత పరిస్థితులు బీజేపీకి కలసి వచ్చాయి. ఢిల్లీ
రాజధానిగా ఏర్పడి ఇప్పటికి 87 ఏళ్లయింది. దేశం జనాభాతోపాటు, దేశం నలుమూలల నుంచి
వచ్చే జనాభాతో ఢిల్లీలో రద్దీ పెరిగిపోయింది. వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి
చేరకుంది. తొలిసారి ఢిల్లీలో వాయు
కాలుష్యం(2.5 పీఎం) 1000 పాయింట్లు దాటి రికార్డు సృష్టించింది. ఢిల్లీ మొత్తం పొగ కమ్మేసింది.
అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఊపిరి తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంతో అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వమే
హెచ్చరికలు జారీ చేస్తోంది. విద్యార్థులు కాలుష్య బారిన పడకుండా ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది.
కాలుష్యానికి తోడు నీరు, వసతి, భద్రత... తదితర సమస్యలు కూడా తీవ్రస్థాయిలో
ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపధ్యంలో హైదరాబాద్ను
దేశానికి రెండవ రాజధానిగా ప్రకటించాలన్న డిమాండ్ కూడా రాజకీయ నాయకుల నుంచి వచ్చే
అవకాశం ఉంది. అంతే కాకుండా ఈ అంశానికి సంబంధించి మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో విజృంభించిన
వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిని దాటిపోవడంతో అక్కడ నెలకొన్న పరిస్థితుల
దృష్ట్యా భారతరత్న, డాక్టర్
అంబేద్కర్ కోరుకున్న విధంగా హైదరాబాద్ నగరం దేశానికి రెండో రాజధాని అవుతుందేమోనన్న
ఆశా భావం వ్యక్తం చేశారు. ప్రస్తుత
పరిస్థితులలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. విద్యాసాగర్ రావు వంటి
వ్యక్తి ఈ రకమైన కీలక వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశంపై చర్చ మొదలైంది. 130 కోట్ల జనాభా,
వివిధ భాషా సంస్కృతుల సమ్మేళనం అయిన భారత దేశానికి రెండవ రాజధాని అవసరం ఎంతైనా
ఉంది. సంచలన నిర్ణయాలతో భారతీయులందరినీ ఆకర్షిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర
మోదీ హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా, దేశ రెండవ
రాజధానిగా ప్రకటించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. రాజకీయ, ప్రాంతీయ కారణాల రీత్యా హైదరాబాద్ని
కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.
రాష్ట్రపతికి సిమ్లాలో వేసవి విడిది
ఉంది. ఎప్పటి నుంచో హైదరాబాద్ రాష్ట్రపతికి శీతాకాల
విడిదిగా ఉంటోంది. సికింద్రాబాద్లో బొల్లారంలోని
రాష్ట్రపతి నిలయంలో ఆయన ప్రతి ఏడాది 15 రోజులు నివాసం ఉంటారు. పచ్చికబయళ్లు,
ఔషధ మొక్కలు, రంగురంగుల పూల తోటలు, పండ్ల తోటలతో ప్రకృతి శోభను సంతరించుకొని అంత్యంత ఆకర్షణీయంగా ఉండే ఈ
భవనాన్ని 1860లో అప్పటి నిజాం నవాబు నజీరుద్దౌలా కట్టించారు. ఖర్చు పరంగా కొంత
కలిసి వచ్చే అంశం ఇది. ఈ నేపధ్యంలో సంస్కృతి, సంప్రదాయాలు, వాతావరణం, మౌలిక
సదుపాయాలు, ఇతర సౌకర్యాల పరంగా హైదరాబాద్ దేశానికి రెండవ రాజధానిగా ఉండటానికి
అనువైనదిగా పలువురు భావిస్తున్నారు. హైదరాబాద్ ని కూడా రద్దీ నగరం అనుకుంటే
కొత్తగా నిర్మించే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దేశ రెండవ రాజధానిగా పరిశీలించే
అవకాశం ఉంది.
-
శిరందాసు నాగార్జున, సీనియర్
జర్నలిస్ట్ - 9440222914
No comments:
Post a Comment